డైరెక్ట్ ఓటీటీలో విడుదల కానున్న విక్రమ్ 'మహాన్'
on Jan 24, 2022
తనయుడు ధృవ్ విక్రమ్ తో కలిసి కోలీవుడ్ స్టార్ విక్రమ్ నటించిన సినిమా 'మహాన్'. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదల కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. కొద్దిరోజులుగా కరోనా మళ్ళీ విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ మూవీని నేరుగా ఓటీటీలో విడుదల చేయాలని మూవీ టీమ్ నిర్ణయించింది.
'మహాన్' సినిమాని డైరెక్ట్ గా ఓటీటీలో విడుదల చేస్తున్నట్లు తాజాగా మూవీ టీమ్ ప్రకటించింది. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ లో ఫిబ్రవరి 10 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. మరో కోలీవుడ్ స్టార్ సూర్య నటించిన గత రెండు చిత్రాలు 'ఆకాశం నీ హద్దురా', 'జై భీమ్' సినిమాలు కూడా నేరుగా ఓటీటీలో విడుదలై అన్ని వర్గాల వారిని మెప్పించి సంచలన విజయాన్ని అందుకున్నాయి. మరి కొంతకాలంగా తన స్థాయి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న విక్రమ్.. సూర్య మాదిరిగానే ఓటీటీ వేదికగా సంచలనం సృష్టిస్తాడేమో చూడాలి.
'మహాన్' సినిమాలో బాబీ సింహా, సిమ్రాన్, సంతానం తదితరులు కీలక పాత్రలు పోషించారు. సెవెన్ స్క్రీన్ స్టూడియో నిర్మించిన ఈ సినిమా తమిళ్, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. కాగా కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించిన గత చిత్రం 'జగమే తంత్రం' కూడా నేరుగా ఓటీటీలోనే విడుదల కావడం విశేషం.