ఓటీటీలపై బన్నీ వాసు సంచలన వ్యాఖ్యలు!
on Jun 28, 2022
ఒకప్పుడు సినిమా టికెట్ ధరలు పెంచమని అడిగిన నిర్మాతలే.. ఇప్పుడు తమ సినిమా టికెట్ ధరలు తక్కువగా ఉన్నాయని, తమ సినిమా చూడాలని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితిపై తాజాగా ప్రొడ్యూసర్ బన్నీ వాసు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అలాగే ఓటీటీలు థియేటర్ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని అన్నారు.
గోపీచంద్, రాశి ఖన్నా జంటగా మారుతి దర్శకత్వంలో రూపొందిన సినిమా 'పక్కా కమర్షియల్'. యూవీ క్రియేషన్స్ తో కలిసి జీఏ2 పిక్చర్స్ పై బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమా జులై 1 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మారుతితో కలిసి బన్నీ వాసు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా బన్నీ వాసు మాట్లాడుతూ.. "టికెట్ రేటు అనేది సినిమా బడ్జెట్ ని బట్టి నిర్ణయించుకోవాలి. భారీ బడ్జెట్ సినిమా అయితే ప్రేక్షకులు రూ.300, రూ.400 పెట్టి సినిమా చూడటానికి రెడీగా ఉన్నారు. కానీ చిన్న, మీడియం బడ్జెట్ సినిమాలకు కూడా అంత రేటు పెడితే ప్రేక్షకులకు థియేటర్లకు రారు. ఇంత ఖర్చు పెట్టి చూసేబదులు నెలరోజులు ఆగితే ఓటీటీలో ఫ్యామిలీ అంతా కలిసి చూడొచ్చు అనుకుంటారు. అందుకే తమ సినిమాకి ఎంత రేటు ఉండాలి అనేది ప్రొడ్యూసర్ కి నాలెడ్జ్ ఉండాలి" అన్నారు.
అలాగే ఓటీటీల కారణంగా థియేటర్ వ్యవస్థ చచ్చిపోయే పరిస్థితి ఉందని బన్నీ వాసు ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రొడ్యూసర్స్ కాస్తా ప్రొడక్షన్ మేనేజర్స్ అయిపోతారని.. హీరోల మార్కెట్, క్రేజ్ పై కూడా ఇది తీవ్ర ప్రభావం చూపే అవకాశముందని అన్నారు. రెండు, మూడు వారాలకే సినిమాలను ఓటీటీలలో విడుదల చేయకుండా.. థియేటర్స్ లో విడుదలైన 50 రోజులు తర్వాతే ఓటీటీలో రిలీజ్ చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. థియేటర్ వ్యవస్థను కాపాడే బాధ్యత నిర్మాతలు, హీరోలు అందరిపై ఉందని అన్నారు. రీసెంట్ గా ఒక హీరో తన సినిమా 50 రోజులు తర్వాతే ఓటీటీలో విడుదలయ్యేలా అగ్రిమెంట్ చేసుకున్నారని తెలిసింది.. ఇలా థియేటర్ వ్యవస్థను కాపాడే ఆలోచనలు చేయాలని బన్నీ వాసు అన్నారు.
Also Read