2022 పొంగల్ వార్ః అజిత్ వర్సెస్ ధనుష్!
on Oct 27, 2021
తమిళనాట 2022 పొంగల్ రసవత్తరం కానుంది. ఇప్పటికే ఈ సీజన్ లో తల అజిత్ కొత్త చిత్రం `వలిమై` విడుదల కాబోతున్నట్లు అధికారిక ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. కట్ చేస్తే.. అదే సీజన్ లో మరో క్రేజీ ప్రాజెక్ట్ థియేటర్స్ లోకి రాబోతున్నట్లు సమాచారం.
ఆ వివరాల్లోకి వెళితే.. `ధ్రువంగళ్ పదినారు` ఫేమ్ కార్తిక్ నరేన్ దర్శకత్వంలో ధనుష్ కథానాయకుడిగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. `మారన్` పేరుతో రూపొందుతున్న ఈ సినిమాలో `మాస్టర్` ఫేమ్ మాళవికా మోహనన్ కథానాయికగా నటిస్తోంది. చిత్రీకరణ తుది దశకు చేరుకున్న ఈ భారీ బడ్జెట్ మూవీని పొంగల్ స్పెషల్ గా విడుదల చేయబోతున్నట్లు కోలీవుడ్ బజ్. అదే గనుక నిజమైతే.. 2022 పొంగల్ కి అజిత్, ధనుష్ బాక్సాఫీస్ ముంగిట పోటీకి సిద్ధమైనట్లే. త్వరలోనే `మారన్` రిలీజ్ డేట్ పై క్లారిటీ రానుంది. మరి.. అజిత్, ధనుష్ లలో ఎవరు పొంగల్ విన్నర్ గా నిలుస్తారో చూడాలి.
కాగా, `వలిమై`లో అజిత్ జోడీగా బాలీవుడ్ బ్యూటీ హ్యూమా ఖురేషి నటిస్తుండగా.. `ఆర్ ఎక్స్ 100` ఫేమ్ కార్తికేయ గుమ్మకొండ ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. `ఖాకి` ఫేమ్ హెచ్. వినోద్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు.