50 రోజుల్లో 5 మల్టిస్టారర్స్!
on Oct 25, 2021
`సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు`(2013)తో తెలుగునాట మళ్ళీ మల్టిస్టారర్స్ ట్రెండ్ ఊపందుకుంది. ఈ తరం అగ్ర కథానాయకులు సైతం ఈ తరహా చిత్రాల్లో నటిస్తూ.. ప్రేక్షకులకు కనువిందుని కలిగిస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో రెండు తరాల స్టార్స్ నటిస్తున్న సినిమాలతో పాటు ఒకే తరం స్టార్స్ కలిసి నటిస్తున్న మల్టిస్టారర్స్ కూడా తెరకెక్కుతున్నాయి. విశేషమేమిటంటే.. 2022 ఆరంభంలో కేవలం 50 రోజుల వ్యవధిలో టాలీవుడ్ నుంచి 5 మల్టిస్టారర్ మూవీస్ థియేటర్స్ లో సందడి చేయబోతున్నాయి.
ఆ వివరాల్లోకి వెళితే.. జనవరి 7న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన `ఆర్ ఆర్ ఆర్` విడుదల కానుండగా.. జనవరి 12న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి స్టార్ రానా కాంబోలో తెరకెక్కుతున్న `భీమ్లా నాయక్` వినోదాలు పంచనుంది. ఇక జనవరి 15న కింగ్ నాగార్జున, ఆయన తనయుడు యువ సామ్రాట్ నాగచైతన్య కలిసి నటిస్తున్న `బంగార్రాజు` రిలీజ్ కానున్నట్లు టాక్. అదే విధంగా ఫిబ్రవరి 4న మెగాస్టార్ చిరంజీవితో ఆయన తనయుడు చరణ్ జట్టుకట్టిన `ఆచార్య` థియేటర్స్ లోకి రానుండగా.. ఫిబ్రవరి 25న విక్టరీ వెంకటేశ్, మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ మల్టిస్టారర్ `ఎఫ్ 3` ఎంటర్టైన్ చేయనుంది. మరి.. 50 రోజుల్లో రాబోతున్న ఈ 5 మల్టిస్టారర్స్ - బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాయో చూడాలి.