English | Telugu
పెళ్లికి ముందు పిల్లలు పుట్టరని డాక్టర్లు చెప్పారు.. రోజా భావోద్వేగం!
Updated : Sep 4, 2021
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విజయవంతమైన హీరోయిన్లలో రోజా ఒకరు. కథానాయికగా వెండితెరపై ఓ వెలుగు వెలిగిన రోజా, ప్రస్తుతం 'జబర్దస్త్'తో సహా ఇతర కార్యక్రమాల ద్వారా బుల్లితెర ప్రేక్షకులలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. రాజకీయాల్లోనూ రాణిస్తున్నారు. రోజా దగ్గర బోలెడు డబ్బులు ఉన్నాయని చాలామంది అనుకుంటారు. ఇప్పుడు రోజా దగ్గర డబ్బులు ఉండి ఉండవచ్చు. అయితే కథానాయికగా కెరీర్ ప్రారంభించినప్పటి నుండి పదేళ్ల పాటు కష్టపడి సంపాదించిన డబ్బులన్నీ అప్పులు కట్టడానికి సరిపోయాయని తాజాగా బయటపెట్టారు.
"నేను 1991లో ఇండస్ట్రీకి వచ్చాను. 2002 వరకూ కష్టపడినది మొత్తం అప్పులు కట్టాను" అని వినాయక చవితి సందర్భంగా త్వరలో ఈటీవీలో ప్రసారం కానున్న 'ఊరిలో వినాయకుడు' స్పెషల్ ఈవెంట్ లో చెప్పారు. ఈ సంగతి చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆమె చెబుతుంటే ఇంద్రజ, పూర్ణ ఎమోషనల్ అయ్యారు. ఇద్దరూ రోజా దగ్గరకు వెళ్లి ఓదార్చారు.
పెళ్లి చేసుకునే ముందు తనకు పిల్లలు పుట్టరని వైద్యులు చెప్పారని... అయితే, ఏడాదిలో ప్రెగ్నెన్సీ వచ్చి అన్షు పుట్టిందని రోజా తెలిపారు. అందుకే, తనకు కుమార్తె అన్షు అంటే చాలా చాలా ఇష్టమని చెప్పుకొచ్చారు. 'ఊరిలో వినాయకుడు' కార్యక్రమానికి రోజా కుమార్తె, కుమారుడు వచ్చారు. అలాగే, హీరో శ్రీకాంత్ కూడా సందడి చేశారు.