English | Telugu
చమ్మక్ చంద్ర రి-ఎంట్రీ...చెల్లిని గుర్తుచేసుకుని ఏడ్చేసిన బబ్లూ
Updated : Aug 24, 2023
త్వరలో రాఖీ పండగ రాబోతున్న నేపథ్యంలో శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ వారం రాఖీ స్పెషల్ ఈవెంట్ ఎపిసోడ్ ని రెడీ చేసింది. జబర్దస్త్ నుంచి వెళ్లిపోయిన చమ్మక్ చంద్ర ఇప్పుడు ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ రాఖీ స్పెషల్ ఈవెంట్ లో మెరిశాడు. అలాగే ఢీ షోలో కూడా రీసెంట్ గా ఒక ఎపిసోడ్ కి కూడా వచ్చాడు. తనకు బాగా పేరు తెచ్చిన ఫ్యామిలీ స్కిట్ చేసాడు. కరుణ, ఐశ్వర్యకు అన్నగా నటించాడు. అలాగే వాళ్ళతో కలిసి ఒక డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చేసి అందరినీ ఎంటర్టైన్ చేసాడు. ఇక ఈ రాఖీ స్పెషల్ ఈవెంట్ లో ఒక టాస్కు కూడా జరిగింది. మనుషులు కనిపించకుండా చేతులు మాత్రమే కనిపించేలా చేశారు. ఆ చేతులు ఎవరెవరివో గుర్తించి వాళ్ళ వాళ్ళ చెల్లెళ్లు రాఖీ కట్టారు. ఈ టాస్క్ కొంచెం ఫన్నీగా, కొంచెం ఎమోషనల్ గా సాగింది.
రామ్ ప్రసాద్, మహేశ్ విట్టా .. తమ తమ చెల్లెళ్లపై ఉన్న ప్రేమను గురించి చెప్పారు. ఇక రోహిణీ అయితే తన జీవితంలో జరిగిన ఆపరేషన్ సంఘటన గురించి షేర్ చేసుకుని ఏడ్చేసింది. అలాంటి సమయంలో తన తల్లి తనకు సపోర్ట్గా ఉందని, ఆమె చాలా గ్రేట్ అని గుర్తుచేసుకుంది. ఇక ఈ ఈవెంట్ కి స్పెషల్ గెస్ట్గా కిరణ్ అబ్బవరం ఎంట్రీ ఇచ్చాడు. గెస్ట్గా వచ్చిన కిరణ్కు జడ్జ్ ఇంద్రజ రాఖీ కట్టింది. రాఖీ కట్టడం తన జీవితంలో ఇదే మొదటిసారి అని ఇంద్రజ చెప్పగా.. కిరణ్ అబ్బవరం కూడా రాఖీ కట్టించుకోవడం మొదటిసారని అన్నాడు. తర్వాత కమెడియన్ బబ్లూ కూడా ఈ ఈవెంట్ లో కనిపించాడు. అయితే గతేడాది తాను తన చెల్లితో ఆ ఈవెంట్కు వచ్చినట్లు గుర్తు చేసుకున్నాడు. ఐతే ప్రస్తుతం తాను ఒక్కడినే వచ్చానన్నాడు. ఏమయ్యింది ? అని ఇంద్రజ అడిగేసరికి తన చెల్లి చనిపోయిందని చెప్పాడు. మెదడులో బ్లడ్ క్లాట్ అవడంతో తన చెల్లి చనిపోయిందన్న విషయాన్ని చెప్పి కళ్ళు మూసుకున్నాడు. అందుకే తను గతేడాది చెల్లితో కలిసొచ్చిన ఈవెంట్ను మళ్లీ మళ్లీ చూసుకుంటున్నట్లు చెప్పాడు. అలా బాధపడుతున్న బబ్లూకు అక్కడ ఉన్న అమ్మాయిలంతా వచ్చి రాఖీ కట్టి అతన్ని ఓదార్ఛారు.