English | Telugu
ఎంఎస్ నారాయణ సతీమణి కన్నుమూత
Updated : Jan 25, 2016
ప్రముఖ హాస్యనటుడు, దివంగత ఎంఎస్ నారాయణ సతీమణి కళాప్రపూర్ణ (63) కన్నుమూశారు. సోమవారం ఉదయం జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో ఆమె గుండెపోటుతో మృతి చెందారు. గత కొంతకాలంగా కళాప్రపూర్ణ గుండె సంబంధింత వ్యాధితో బాధపడుతున్నారు. ఎంఎస్ నారాయణ 2015 జనవరి 23న గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. భర్త ప్రథమ వర్థంతి జరిగిన రెండు రోజులకే కళాప్రపూర్ణ మృతి చెందారు. ఏడాది వ్యవధిలోనే వారి ఇంట మరో విషాదం చోటుచేసుకుంది.
ఎంఎస్ నారాయణ భీమవరంలో మూర్తి రాజు కాలేజీలో భాషాప్రవీణ కోర్చు చదువుతున్నప్పుడు తన తోటి విద్యార్ధిని కళాప్రపూర్ణతో ప్రేమలో పడ్డారు. కానీ ఎమ్మెస్ కులాంతర వివాహానికి ఆయన కుటుంబ సభ్యులు అడ్డు చెప్పారు.దాంతో అదే కాలేజీలో అధ్యాపకునిగా పనిచేస్తున్న పరుచూరి గోపాలకృష్ణ సహకారంతో,కళాప్రపూర్ణను,1972లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. సినిమాల్లోకి రాకముందు ఎమ్మెస్ నారాయణ మూర్తిరాజు హైస్కూల్లో,ఆయన భార్య జూపూడి కేశవరావు హైస్కూల్లో సెకండరీ గ్రేడ్ తెలుగు పండిట్గా పనిచేశారు.కాగా,పలువురు సినీప్రముఖులు, కళాప్రపూర్ణ మృతికి తమ సంతాపాన్ని తెలియజేశారు.