English | Telugu

శ‌ర‌ణ్ నాకు ఒక్క‌పైసా ఇవ్వ‌లేదు.. కావాల‌ని కుట్ర చేస్తున్నారు!

శ‌ర‌ణ్ నాకు ఒక్క‌పైసా ఇవ్వ‌లేదు.. కావాల‌ని కుట్ర చేస్తున్నారు!

 

"నన్ను, నా ఫ్యామిలీని ఇబ్బంది పెట్టేందుకు కొంత మంది పన్నిన కుట్రలో భాగమే నాఫై నమోదు అయిన కేసు" అని తేల్చేశారు సీనియ‌ర్ ప్రొడ్యూస‌ర్ బెల్లంకొండ సురేశ్‌. 2018-19 మ‌ధ్య కాలంలో ఆయ‌న త‌న ద‌గ్గ‌ర రూ. 85 ల‌క్ష‌లు అప్పు తీసుకొని, తిరిగి చెల్లించ‌క‌పోగా బెదిరిస్తున్నారంటూ శ‌ర‌ణ్ కుమార్ అనే వ్య‌క్తి కోర్టును ఆశ్ర‌యించ‌డం, ఈ కేసును ద‌ర్యాప్తు చేయాల్సిందిగా పోలీసుల్ని కోర్టు ఆదేశించ‌డం తెలిసిందే. 

ఈ వ్య‌వ‌హారంపై శ‌నివారం ఏర్పాటు చేసిన స‌మావేశంలో వివ‌ర‌ణ ఇచ్చారు బెల్లంకొండ సురేశ్‌. త‌నకు శ‌ర‌ణ్ ఎన్న‌డూ ఒక్క పైసా కూడా ఇవ్వ‌లేద‌నీ, డ‌బ్బులు ఇచ్చిన‌ట్లు సాక్ష్యాలు ఉంటే పోలీసుల‌కు అంద‌జేయాల‌నీ ఆయ‌న అన్నారు. "నాఫై, నా కొడుకుఫై కావాలనే కుట్ర చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. నేను డబ్బులు ఇచ్చినట్టు సాక్ష్యాలు బయటకు పెట్టక పోతే పరువునష్ట దావా వేస్తా" అని ఆయ‌న హెచ్చ‌రించారు.

శరణ్‌తో కలిసి కొంతమంది వ్యక్తులు కుట్ర పన్నారనీ, బెల్లంకొండ ఫ్యామిలీ ఎదుగుదల చూడలేకనే కేసులు పెడ్తున్నారనీ సురేశ్ ఆరోపించారు. పోలీసుల విచారణకు సహరిస్తాన‌ని ఆయ‌న చెప్పారు. "85 లక్షల రూపాయలు ఇచ్చాను అంటూ నాపై ఆరోపణ వచ్చింది. నన్ను బ్యాడ్ చేయడానికి శరణ్ ఆరోపణలు చేశారు. కోర్టులో ప్రైవేటు పిటీషన్ వేశారు. అతని దగ్గర ఆధారాలు తీసుకురావాలంటూ శరణ్ కు పోలీసులు నోటీసులు ఇచ్చారు" అని ఆయ‌న చెప్పారు.

"నా పిల్లలు నా పంచ ప్రాణాలు.. శ‌ర‌ణ్ నా పిల్లలు జోలికి వచ్చాడు. శరణ్ ను లీగల్ గా ఎదుర్కొంటా. అతనిపై పరువు నష్టం దావా వేస్తా." అని సురేశ్ అన్నారు. త‌న‌కు కోర్టు నుండి కాని, సీసీఎస్ నుండి ఎలాంటి నోటీసులు రాలేదని ఆయ‌న చెప్పారు. 

శరణ్‌ది త‌మ‌ ఊరేన‌నీ... పదేళ్ళ క్రితం పరిచయమ‌య్యాడ‌నీ, సినిమా టికెట్ల కోసం ఫోన్ చేస్తూ ఉండేవాడనీ సురేశ్ వెల్ల‌డించారు. "శరణ్ అనవసరంగా నా కొడుకు పేరును బ్లేమ్ చేస్తున్నాడు. అతను క్షమించమని వేడుకున్నా నేను ఊరుకోను. బ్లాక్ మెయిల్లో భాగంగానే ఇదంతా చేస్తున్నాడు. శరణ్ వెనకాల ఓ రాజకీయ నాయకుడు ఉన్నాడు. అతనెవరో బయట పెడతా." అన్నారు సురేశ్‌.