English | Telugu

ఆ విషయంలో రాజమౌళిని ఫాలో అవుతున్న ‘బలగం’ వేణు.. ఎందుకంటే?

2004లో తేజ దర్శకత్వంలో వచ్చిన ‘జై’ చిత్రం ద్వారా నటుడిగా పరిచయమైన వేణు ఎల్దండి.. తేజ సినిమాల ద్వారానే గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత జబర్దస్త్‌ షో ద్వారా బాగా పాపులర్‌ అయ్యారు. హాస్యనటుడిగా దాదాపు 200 సినిమాల్లో నటించిన వేణు.. దర్శకుడిగా అవతారమెత్తి అందర్నీ ఆశ్చర్యపరిచారు. 2023లో వేణు రూపొందించిన ‘బలగం’ చిత్రం ప్రతి ఒక్కరి మనసును తాకింది. చిన్న చిత్రాల్లో పెద్ద విజయం సాధించిన సినిమాగా నిలిచింది. ఈ సినిమాకి ఉత్తమ చిత్రంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించే గద్దర్‌ అవార్డు లభించింది. అలాగే ఫిలింఫేర్‌ అవార్డులతోపాటు మరికొన్ని అవార్డులు ఈ సినిమా గెలుచుకుంది. ఈ సినిమా తర్వాత వేణు ఎలాంటి సినిమా చేయబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలోనే ‘ఎల్లమ్మ’ పేరుతో ఓ సినిమా చేయబోతున్నట్టు ప్రకటించారు. బలగం చిత్రాన్ని నిర్మించిన దిల్‌రాజే ఈ సినిమాకి కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్‌ దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే సెట్స్‌ పైకి వెళ్లనుంది.

ప్రీ ప్రొడక్షన్‌లో ఉండగానే ‘ఎల్లమ్మ’ సినిమాపై హైప్‌ క్రియేట్‌ అయింది. నితిన్‌ హీరోగా తెరకెక్కనున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే ప్రతి విషయంలోనూ కేర్‌ తీసుకుంటూ ముందుకెళ్తున్నారు వేణు. ఈ సినిమాకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం బయటికి వచ్చింది. బలగం చిత్రం బంధాలు, అనుబంధాలు, కుటుంబ సభ్యుల మధ్య ఉండే ఎమోషన్స్‌ నేపథ్యంలో తెరకెక్కిన విషయం తెలిసిందే. ఎల్లమ్మ చిత్రం ఒక గ్రామదేవత నేపథ్యంలో రూపొందిస్తారని తెలుస్తోంది. ఈ సినిమాలో కీర్తి సురేష్‌ కూడా ప్రధాన పాత్ర పోషిస్తుందని వార్తలు వస్తున్నాయి. నితిన్‌ కూడా ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నట్టు పలు ఇంటర్వ్యూల్లో తెలిపారు. తన కెరీర్‌లో వన్‌ ఆఫ్‌ ది బెస్ట్‌ ఫిలిం అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు నితిన్‌.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాకి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్‌ విషయం ప్రచారంలోకి వచ్చింది. ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం అవకముందే చిత్ర యూనిట్‌కి వేణు ఒక కండిషన్‌ పెట్టినట్టు తెలుస్తోంది. అదేమిటంటే.. షూటింగ్‌ జరుగుతున్నన్ని రోజులు సెట్‌లో ఎవరూ సెల్‌ వాడకూడదు అనేది ఆ కండీషన్‌. షూటింగ్‌కి వచ్చే ముందే సెల్‌ ఫోన్స్‌ను సరెండర్‌ చెయ్యాలని సూచిస్తున్నారు. సాధారణంగా రాజమౌళి తను చేసే సినిమాలకు ఇలాంటి కండీషన్స్‌ పెడుతుంటారు. ఇప్పుడు వేణు కూడా అతన్నే ఫాలో అవుతూ తన యూనిట్‌కి స్ట్రిక్ట్‌ ఇన్‌స్ట్రక్షన్స్‌ ఇస్తున్నారని తెలుస్తోంది. మీడియా, సోషల్‌ మీడియా విపరీతంగా పెరిగిపోయిన కారణంగా కొన్ని సినిమాల్లోని కీలక సన్నివేశాలు లీక్‌ అవడం మనం చూస్తున్నాం. అలాంటివి జరగకూడదని ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఇండస్ట్రీ నుంచి అందుతున్న సమాచారం మేరకు ‘ఎల్లమ్మ’ చిత్రంతో మరోసారి సెన్సేషన్‌ క్రియేట్‌ చేసేందుకు వేణు సిద్ధమవుతున్నారట. నితిన్‌ కూడా తాను హీరోలా కాకుండా ఒక సాధారణ నటుడిగా వేణుకి తన పూర్తి సహకారాన్ని అందించాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.