English | Telugu
రజినీకాంత్ షాకింగ్ రెమ్యూనరేషన్.. పాన్ ఇండియా స్టార్స్ ని మించి!
Updated : May 8, 2025
ఇండియాలో ఉన్న బిగ్గెస్ట్ స్టార్స్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ ఒకరు. 74 ఏళ్ళ వయసులోనూ ఈ తరం స్టార్స్ తో పోటీపడి సినిమాలు చేస్తున్నారు. బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తున్నారు. దేశ విదేశాల్లో రజినీకాంత్ కి తిరుగులేని మార్కెట్ ఉంది. అందుకే ఆయనతో సినిమాలు చేయడానికి నిర్మాతలు పోటీ పడుతుంటారు. ఈ జనరేషన్ స్టార్స్ కి మించిన రెమ్యూనరేషన్ ఆయనకు ఇవ్వడానికి ఏమాత్రం వెనకాడరు. ఈ క్రమంలోనే తాజాగా రజినీ రెమ్యూనరేషన్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.
రజినీకాంత్ ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో 'కూలీ' సినిమా చేస్తున్నాడు. సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ మూవీలో నాగార్జున, ఆమిర్ ఖాన్, ఉపేంద్ర వంటి పలువురు స్టార్స్ భాగమయ్యారు. అసలే రజినీ-లోకేష్ కాంబినేషన్, దానికితోడు పలువురు స్టార్స్ భాగం కావడంతో.. 'కూలీ'పై అంచనాలు ఆకాశాన్నంటే స్థాయిలో ఉన్నాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగా ఈ సినిమా కోలీవుడ్ చరిత్రలో సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమనే అంచనాలున్నాయి. దానికంటే ముందే రెమ్యూనరేషన్ పరంగా రజినీ రికార్డు సృష్టించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం ఆయన ఏకంగా రూ.260 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు వార్తలొస్తున్నాయి. పాన్ ఇండియా స్టార్స్ కూడా ఈ రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకోవట్లేదు. అలాంటిది 74 ఏళ్ళ వయసులో రజినీ రూ.260 కోట్లు తీసుకున్నారనే వార్త సంచలనంగా మారింది.
