English | Telugu

‘మేము సైతం’ అంతా సిద్దం

తెలుగు గడ్డపై ఎప్పుడెలాంటి ప్రకృతి వైపరీత్యం సంభవించినా తెలుగు సినీ పరిశ్రమ బాధితుల్ని ఆదుకునేందుకు ఎప్పుడూ ముందుంటూనే వుంది. ఆంధ్రప్రదేశ్‌ని హుద్‌హుద్‌ తుపాను వణికించిన దరిమిలా, తెలుగు సినీ పరిశ్రమ ‘మేము సైతం’ అనే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. స్టార్లు డాన్సులేస్తారు.. క్రికెట్‌ ఆడతారు.. తద్వారా వచ్చే డబ్బుని బాధితుల సహాయార్థం అందజేస్తారు.. ఇవన్నీ కామన్‌. ఈసారి మాత్రం సేవా కార్యక్రమాన్ని తెలుగు సినీ పరిశ్రమ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

ఎమ్మెల్యేగా తన నియోజకవర్గంలో పర్యటిస్తోన్న కారణంగా బాలకృష్ణ హాజరు కాలేకపోయారుగానీ, ‘మేముసైతం’ ప్రోగ్రామ్‌ షెడ్యూల్‌ని విడుదల చేయడానికి చిరంజీవి, నాగార్జున, వెంకటేష్‌ మీడియా ముందుకొచ్చి మాట్లాడిన తీరు అందర్నీ ఆశ్చర్యపరిచింది. ‘మేం సహాయం చేస్తున్నాం.. ఆ సహాయంలో మీరూ భాగమవ్వండి..’ అని చిరంజీవి, నాగార్జున, వెంకటేష్‌ చెప్పడం గొప్ప విషయమే.

స్టార్స్‌ క్రికెట్‌లో ఈసారి హీరోయన్లనూ భాగస్వాముల్ని చేశారు. తంబోలా, స్టార్స్‌తో కలిసి డిన్నర్‌.. ఇలా పలు కార్యక్రమాల గురించి చిరంజీవి, వెంకటేష్‌, నాగార్జున.. ఇలా ఒక్కొక్కరూ వివరించారు. ‘మేము సైతం’ పేరుతో ఓ వెబ్‌సైట్‌ని ప్రారంభించామనీ, దానికి విరాళాలు ప్రకటించాలని అభిమానుల్ని కోరారు.

29, 30 తేదీల్లో ‘మేముసైతం’ పేర వరుస కార్యక్రమాలకు తెలుగు సినీ పరిశ్రమ శ్రీకారం చుట్టింది. గతంలో ఎన్నడూ లేని విధంగా తెలుగు సినీ పరిశ్రమ పూర్తిగా బాధితులకు సహాయం అందించేందుకు రెండ్రోజుల సమయాన్ని కేటాయించడం గమనార్హం.

మొత్తమ్మీద ‘మేముసైతం’ మెగా వేదిక. ఈ వేదికలో ఎవరెవరు ఎలా పార్టిసిపేట్‌ చేస్తారనేదానిపై ఇప్పటికే ఓ నిర్ణయానికి సినీ జనం వచ్చినట్లు తెలుస్తోంది. మెగాస్టార్‌ చిరంజీవి కూడా ఈ వేదికపై పెర్ఫామ్‌ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌తోపాటు ఇతర హీరోలు, హీరోయిన్లు.. ‘మేముసైతం’ కార్యక్రమాన్ని ఓ యజ్ఞంగా భావిస్తున్నారట.

కార్యక్రమంలో పాల్గొనడం వేరు.. కమిట్‌మెంట్‌తో నిర్వహించడం వేరు.. తెలుగు సినీ పరిశ్రమలో అంతా ఒక్కతాటిపైకి వస్తే, ఆ అద్భుతం ఎలా వుంటుందనడానికి నిదర్శనం ‘మేము సైతం’ అనుకోవచ్చు.