English | Telugu

ఉచిత సేవలు బంద్.. జియో బాటలోనే ఎయిర్ టెల్ , ఐడియా , వొడాఫోన్!

జియో బాటలోనే వెళ్లేందుకు రెడీ అయ్యాయి మరో రెండు టెలికాం కంపెనీలు. వినియోగదారులని బాదేయటానికి వొడాఫోన్, ఐడియా, ఎయిర్టెల్ సిద్ధమయ్యాయి. టారిఫ్ పెంచుతున్నట్టు వొడాఫోన్, ఐడియా ప్రకటించిన కాసేపటికే ఎయిర్టెల్ కూడా అదే బాట పట్టింది. జియో నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటున్న టెలికం కంపెనీలు అదే దారిలో పయనించనున్నాయి. తమ టారిఫ్ ధరలను పెంచుతున్నట్లు వొడాఫోన్, ఐడియా, ఎయిర్టెల్ కంపెనీలు ఒకే రోజు ప్రకటించాయి.

డిసెంబరు 1వ తేదీ నుండి ధరలు పెంచుతున్నట్లు వొడాఫోన్, ఐడియా ప్రకటించగా డిసెంబర్ మొదట్లో రేట్లు పెంచడానికి ఎయిర్టెల్ రెడీ అయ్యింది. అయితే ఎంత మొత్తంలో పెంచుతున్నది రెండు కంపెనీలు వెల్లడించలేదు. వినియోగదారులకు ప్రపంచ స్థాయి డిజిటల్ సేవలు అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వొడాఫోన్ తెలిపింది. వ్యాపారం లాభసాటిగా ఉండేందుకు ఎయిర్టెల్ ట్యారిఫ్ రేట్లను పెంచటానికి డిసైడ్ అయ్యింది. సెప్టెంబర్ 30 తో ముగిసిన త్రైమాసిక ఫలితాల్లో ఈ రెండు కంపెనీలు భారీ మొత్తంలో నష్టాలు ప్రకటించిన కొద్ది రోజులకే ఈ నిర్ణయం తీసుకున్నాయి. సవరించిన స్థూల ఆదాయం విషయంలో సుప్రీం కోర్టు తీర్పు వెలువరించడంతో టెలికమ్ కంపెనీలపై పెను భారం పడింది. దీంతో ఆదుకోవాలని ఆయా కంపెనీలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి.

ప్రభుత్వం సహకరించకుంటే భారతలో కొనసాగడం కష్టమేనని వొడాఫోన్ కంపెనీ ఇటీవల చెప్పింది. అయితే ఐయూసీ చార్జీల విషయంలో వేరే నెట్ వర్క్ కు చేసే కాల్స్ పై నిమిషానికి ఆరు పైసలు లెక్కన వసూలు చేయనున్నట్లు జియో ఇది వరకే ప్రకటించింది. జియో బాటలోనే వొడాఫోన్, ఐడియా, ఎయిర్టెల్ సైతం వినియోగదారులపై భారం మోపడానికి సిద్ధమవుతున్నాయి. టారిఫ్ పెంపు విషయంలో టెలికం కంపెనీలతో ట్రాయ్ సంప్రదింపులు జరిపే అవకాశముంది.