English | Telugu

ఇక్కడ ఉండాలంటే హిందువుల ఆధిపత్యాన్ని అంగీకరించాల్సిందే: ఆర్ఎస్ఎస్ చీఫ్

ఇండియాలో ముస్లింలు చాలా సంతోషంగా ఉన్నారని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. ఓ హిందీ మ్యాగజైన్‌కు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మనదేశ సంస్కృతిపై దాడి జరిగిన ప్రతిసారీ అన్ని మతాల ప్రజలు కలిసి ఒకటిగా నిలబడి దేశాన్ని రక్షించుకున్నారని అయన ప్రశంసించారు. అంతేకాకుండా ప్రపంచంలో మరే దేశంలోనూ లేనంతగా ముస్లింలు ఇక్కడ సంతోషంగా ఉన్నారని అయన అన్నారు. పొరుగు దేశమైన పాకిస్థాన్‌లో ఇతర మతాల వారికి ఎటువంటి హక్కులు ఉండవని అయన అన్నారు. గతంలో మేవార్‌ రాజు మహారాణా ప్రతాప్‌ సైన్యంలో అనేక మంది ముస్లింలు మొఘల్‌ చక్రవర్తి అక్బర్‌ కి వ్యతిరేకంగా పోరాడారని భగవత్ ఈ సందర్భంగా గుర్తుచేశారు.

అయితే ఇక్కడ హిందువులు మాత్రమే ఉండాలని మన రాజ్యాంగం చెప్పలేదని.. అయితే, ఇకపై ఎవరైనా ఇక్కడ ఉండాలంటే హిందువుల ఆధిపత్యాన్ని అంగీకరించాల్సిందేనని అయన తేల్చి చెప్పారు. ఈ దేశంలో ముస్లింలకు కూడా ప్రత్యేకంగా చోటు కల్పించామని, ఇది భారతదేశ స్వభావానికి ప్రతీక అని పేర్కొన్నారు. తమ స్వార్థ ప్రయోజనాలకు దెబ్బ తగిలిన వారే దురభిమానాన్ని, వేర్పాటువాదాన్ని వ్యాప్తి చేస్తున్నారని భగవత్ మండిపడ్డారు.