English | Telugu

క్లైమాక్స్ కి రాజస్థాన్ పొలిటికల్ డ్రామా

ఆగష్టు 14 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు రాజస్థాన్ గవర్నర్‌ కల్‌రాజ్‌ మిశ్రా అనుమతి ఇచ్చారు. అసెంబ్లీని సమావేశపర్చాలని కోరుతూ అశోక్ గెహ్లాట్ సర్కారు పంపిన మూడు ప్రతిపాదనలను తిరస్కరించిన గవర్నర్‌.. ఎట్టకేలకు నాలుగో ప్రతిపాదనను ఆమోదించారు. అసెంబ్లీ సమావేశాలకు డేట్ ఫిక్స్ కావడంతో.. క్యాంపు రాజకీయాలు మరింత వేడెక్కనున్నాయి. మేజిక్ ఫిగర్ కంటే కేవలం ఒక్క ఎమ్మెల్యే మాత్రమే ఎక్కువగా ఉన్న నేపథ్యంలో.. ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా మిస్ కాకుండా చూసుకోవాల్సిన పరిస్థితి కాంగ్రెస్ కు ఉంది.

మరోవైపు, ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌ విలీనం చేసుకోవడాన్ని సవాలు చేస్తూ బీఎస్పీ బుధవారం రాజస్థాన్ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. 2018లో జరిగిన ఎన్నికల్లో బీఎస్పీ తరఫున ఎమ్మెల్యేలుగా గెలిచిన ఆరుగురు.. ఆ తరువాత కాంగ్రెస్‌లో చేరారు. ఈ విలీనాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్‌ వేశామని, స్పీకర్‌ కార్యాలయంలోనూ ఫిర్యాదు చేశామని బీఎస్పీ రాజస్థాన్ శాఖ అధ్యక్షుడు భగవాన్‌ సింగ్‌ బాబా తెలిపారు. ఈ పిటిషన్లను హైకోర్టు విచారణకు స్వీకరించింది. దీంతో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.

ఇక, కాంగ్రెస్ తిరుగుబాటు నేత సచిన్ పైలట్ ఏం చేయబోతున్నారనే విషయం ఆసక్తికరంగా మారింది. అసెంబ్లీ సమావేశాలను గవర్నర్ ఆమోదించడంతో ఇప్పటికే సచిన్ పైలట్ అలెర్ట్ అయ్యారు. ఇప్పటి వరకూ తమ శిబిర ఎమ్మెల్యేలు ఉంటున్న రిసార్టులను ఒక్కసారిగా మార్చేశారు. అంతేకాకుండా ఆ 19 మంది ఎమ్మెల్యేల ఫోన్ నెంబర్లను కూడా మార్చేశారు. అంతేకాకుండా వీరి రక్షణ కోసం రిసార్టు చుట్టూ ప్రైవేట్ బౌన్సర్లను కూడా నియమించుకున్నారు.