English | Telugu

మార్కెట్ లో హల్ చల్ చేస్తున్న కొత్త మాఫియా...

మార్కెట్ లో తేనెకు విపరీతమైన గిరాకీ ఉంది. దీనికి తగ్గట్టే కొరత కూడా ఉంది. ఆరోగ్యం బాగోలేకపోతే తేనెలో రంగరించి అనేక ఔషధాలను వినియోగించడం పురాతన కాలం నుండి వస్తోంది. ఒళ్ళు తగ్గాలన్నా ఓపిక రావాలన్నా తేనె ప్రధానంగా వినియోగిస్తారు.అలాంటి తేనెను ఉపయోగించాలన్న కూడా భయపడాల్సి వస్తోంది ప్రజలు. వివరాళ్లోకి వెళ్తే మనం ఎన్నో రకాల మాఫియాలను చూస్తుంటాం. శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, మైనింగ్ మాఫియా ఇవన్నీ విన్నవే వాటి సరసన ఇప్పుడో కొత్త మాఫియా వచ్చి చేరింది. తీయ్యగా ప్రాణాలు కూడా తీసేస్తు, మెల్లగా అనారోగ్యం బారిన కూడా పడేస్తోంది. చివరకు మంచానికే పరిమితం చేసి కాటికి చేరుస్తోంది. అంతేకాదు అంతర్జాతీయంగా భారత్ పరువును బజారున పడేస్తోంది, ఇదే ఇప్పుడు తీవ్ర ఆందోళన కలిగిస్తున్న అంశంగా అందరిని ఆలోచనల్లో పడేస్తున్న విషయం. మభ్యపెడుతున్నారు, మాయచేస్తున్నారు తీయటి తేనెను విషంగా మారుస్తున్నారు, కమ్మటి మాటలు చెప్పి కాటికి చేరుస్తున్నారు విక్రయదారులు.

రోజురోజుకు విస్తరిస్తున్న హనీ మాఫియా ఇప్పుడు ప్రాణాలతో చెలగాటమాడుతోంది. ఔషధ లక్షణాలు కలిగిన తెనెను విషతుల్యం చేస్తుంది. అది ప్రమాదకర రసాయనాలతో నకిలీ తేనె లను తయారు చేసి పెద్ద ఎత్తున విక్రయాలు జరుపుతున్నారు కొందరు ముఠాలు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇవే కనిపించడమే కాక వారి ఆగడాలు మితిమీరిపోతున్నాయి. పెద్ద ఎత్తున నకిలీ తేనెను తయారు చేసి విక్రయిస్తున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఇలాంటి వారు వందల సంఖ్యలో ఇప్పుడు రోడ్ల పక్కనే చేరి విక్రయాలు జరుపుతున్నారు. మనం నిత్యం ఉపయోగించే సబ్బుల తయారీలో కూడా తేనె వినియోగం చాలానే ఉంది. అలాగే కాస్మోటిక్స్ మెడిసిన్స్ తో పాటు హోమియోపతి, ఆయుర్వేద మందులలో తేనె వాడకం అధిక మయ్యింది. చర్మ సంబంధ వ్యాధులను నయం చేసే గుణం తేనెలో ఎంతగానో ఉందని భావిస్తారు. ముఖంలో మెరుపు కోసం తేనెను వాడతారు. దీనివల్ల లెక్కకు మించిన ప్రయోజనాలున్నాయని తేనెను వాడడం విపరితంగా పెరిగిపోయింది.

తేనెకున్న డిమాండ్ ని గమనించి హనీ మాఫియా రెచ్చిపోతోంది. యథేచ్ఛగా నకిలీ తేనెను తయారు చేసి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న ముఠాలు పెరిగిపోతున్నాయి. బెల్లం, చక్కెర, మక్కజొన్న రసం, గ్యాస్ట్రిక్ సోడా, సోడియం బైకార్బోనేట్, అమ్మోనియం నైట్రేట్ ఉపయోగించి అతి ప్రమాదకరమైన తేనెను తయారు చేస్తున్నారు. బెల్లం చక్కెరను మరగబెట్టి ఈ రసాయనాలన్నిటినీ అందులో కలుపుతున్నారు. మొక్కజొన్న రసం వాడకం వల్ల నకిలీ తేనె పాడవుకుండా ఎక్కువ కాలం ఉంటుంది. తియ్యదనంతో పాటు రంగులో ఏమాత్రం అనుమానం రాకుండా అసలు తేనెకు తీసుకోకుండా తయారు చేసి పెద్ద ఎత్తున విక్రయిస్తున్నారు. దీన్ని వాడటం వల్ల తాత్కాలికంగా బాగానే ఉన్నా క్రమేపీ ఆరోగ్యం దెబ్బతిని చివరికి ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.