English | Telugu

గోదావరిపై ప్రాజెక్టులను తక్షణమే ఆపేయండి!!

గోదావరి నదిపై కొత్తగా నిర్మిస్తున్న ప్రాజెక్టులపై ముందుకెళ్లొద్దని రెండు తెలుగు రాష్ట్రాలను గోదావరి నదీ యాజమాన్య సంస్థ (జీఆర్‌ఎంబీ) ఆదేశించింది. అన్ని ప్రాజెక్టుల సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)లను ఈ నెల 10వ తేదీలోగా సమర్పించాలని స్పష్టం చేసింది.

శుక్రవారం హైదరాబాద్‌లోని జీఆర్‌ఎంబీ కార్యాలయంలో చైర్మన్‌ చంద్రశేఖర్‌ అయ్యర్‌ అధ్యక్షతన బోర్డు సమావేశం జరిగింది. ఏపీ జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌, ఈఎన్‌సీ నారాయణరెడ్డి, తెలంగాణ నీటి పారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రజత్‌కుమార్‌, ఈఎన్‌సీ మురళీధర్‌ పాల్గొన్నారు. రాష్ట్ర విభజన చట్టానికి భిన్నంగా తెలంగాణ ప్రభుత్వం గోదావరిపై ప్రాజెక్టులు నిర్మిస్తోందని గతనెల 19న ఏపీ‌ ఇచ్చిన ఫిర్యాదుపై ప్రధానంగా చర్చ జరిగింది.

గోదావరి బోర్డు, కేంద్ర జలసంఘం డీపీఆర్‌లను పరిశీలించి సాంకేతికంగా సిఫార్సు చేయాలని, అపెక్స్‌ కౌన్సిల్‌ నుంచి ప్రాజెక్టులకు అనుమతి తీసుకోవాలని ఇరు రాష్ట్రాలకు బోర్డు సూచించింది. కొత్త ప్రాజెక్టుల నిర్మాణాలను రెండు రాష్ట్రాలూ తక్షణమే నిలుపుదల చేయాలని.. వాటి డీపీఆర్‌లను సమర్పించాలని జీఆర్‌ఎంబీ ఆదేశించింది. ఈ నెల పదో తేదీలోపు డీపీఆర్‌లను సమర్పించేందుకు రెండు రాష్ట్రాలూ సమ్మతించాయి. అలాగే అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం చర్చించాల్సిన ఎజెండాను కూడా అదే తేదీలోగా ఇచ్చేందుకు అంగీకరించాయి.