English | Telugu

కొమరం భీం జిల్లాలో మరోసారి పులి పంజా.. తల్లి కళ్లెదుటే బాలికను కబళించింది.. 

తెలంగాణలోని కుమురంభీం జిల్లాలో ఈనెల 11న విఘ్నేశ్ అనే 19 ఏళ్ల యువకుడిని పులి పొట్టనపెట్టుకున్న సంగతి తెల్సిందే. తాజాగా నిన్న మరోసారి పులి తన తల్లి కళ్లెదుటే మరో బాలిక ప్రాణాలు తీసింది. పొలంలో పత్తిని ఏరుతున్న బాలికను ఆమె తల్లి, సోదరుడు, ఇతర కూలీలు చూస్తుండగానే దాడి చేసి ఈడ్చుకెళ్లింది. జిల్లాలోని పెంచికల్‌పేట మండలం కొండపల్లి శివారులో ఈ దారుణం చోటు చేసుకుంది.

కొండపల్లి శివారులోని అన్నెం సత్తెయ్య అనే రైతు పొలంలో పత్తి ఏరేందుకు నిర్మల (16), ఆమె తల్లి లక్ష్మక్క, సోదరుడు రాజేశ్, మరో ఏడుగురు కూలీలు వెళ్లారు. అయితే మధ్యాహ్నం వరకు పత్తి ఏరిన తరువాత వారిలో కొంతమంది భోజనానికి వెళ్లగా, నిర్మల, మరో స్నేహితురాలితో కలిసి చేనుకు మరో వైపున పత్తి ఏరుతోంది. ఈ క్రమంలో అకస్మాత్తుగా వారిపై దాడిచేసిన పులి నిర్మలను నోట కరుచుకుని వెళ్లిపోయింది. దీంతో నిర్మల అరుపులు విని తోటి వారు అప్రమత్తమై కర్రలతో వెంట పడడంతో కొంతదూరం వెళ్లాక నిర్మలను వదిలిపెట్టి వెళ్లిపోయింది. అయితే తీవ్ర గాయాలపాలైన నిర్మల అక్కడికక్కడే చనిపోయింది. ఈ దుర్ఘటన సమాచారం అందుకున్న డీఎఫ్ఓ శాంతారాం ఘటనా స్థలాన్ని సందర్శించారు. ఈ ప్రమాదం గురించి అయన ఉన్నతాధికారులకు తెలియజేయడంతో వారు బాధిత కుటుంబంలో ఒకరికి ఉద్యోగంతోపాటు రూ. 5 లక్షల పరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు.