English | Telugu

బోరిస్‌ పంతం నెగ్గింది.. స్వతంత్ర దేశంగా బ్రిటన్

బ్రిటన్ చరిత్రలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వేరుపడేందుకు ఉద్దేశించిన బ్రెగ్జిట్ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. దీనిపై క్వీన్ ఎలిజబెత్ టూ కూడా సంతకం చేశారు. దీంతో బ్రెగ్జిట్ నుంచి ఎగ్జిట్ అయిన బ్రిటన్ నేటి నుంచే స్వతంత్ర దేశంగా ఉండనుంది. దీనికి సంబంధించిన ప్రక్రియ పూర్తయినట్టేనని ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు. బ్రెగ్జిట్ కు సంభందించి ఈయూతో కుదుర్చుకున్న ఒప్పందానికి బ్రిటన్ పార్లమెంటు దిగువ సభ హౌస్ ఆఫ్ కామన్స్ 330,231 ఓట్ల తేడాతో ఆమోద ముద్ర వేసింది. దీనికి ఎగువ సభ కూడా ఓకే చెప్పడంతో బ్రిటన్ స్వతంత్రంగా మారిపోయింది. ఐరోపా దేశాల సమాఖ్య నుండి విడిపోయింది.

ఈ బిల్లుపై ఈయూలో జరిగిన చర్చ సందర్భంగా చట్టసభ్యులు అందరూ 50 ఏళ్ళ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. అనంతరం 621-49 తేడాతో బ్రెగ్జిట్ ఒప్పందానికి ఆమోదం తెలిపారు. ఆల్ లాంగ్ సైన్ అనే సాంప్రదాయ పాటతో ఈయూ పార్లమెంట్ బ్రిటన్ కు వీడ్కోలు పలికింది. బ్రెగ్జిట్ అజెండా తోనే పదవి చేపట్టిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఎట్టకేలకు తన పంతాన్ని నెగ్గించుకున్నారు. ఈయూ నుంచి వైదొలిగేందుకు పట్టుదలతో కృషి చేసి విజయం సాధించారు. 2018లో అప్పటి ప్రధాని థెరిసా మే బ్రెగ్జిట్ కోసం చర్చలు జరిపిన దిగువ సభ తిరస్కరించటంతో రాజీనామా చేశారు. ఆ తరవాత పీఠమెక్కిన బోరిస్ సభలో మెజారిటీ లేకపోవడంతో ఎన్నికలకు వెళ్లారు. సంపూర్ణ మెజార్టీతో మళ్లీ ప్రధాని బాధ్యతలు చేపట్టి తన బ్రెగ్జిట్ కలను సాకారం చేసుకున్నారు.