English | Telugu
బిజెపి హైదరాబాద్లో భారీ బహిరంగ సభ అందుకే నిర్వహించనుందా..?
Updated : Feb 11, 2020
పౌరసత్వ సవరణ చట్టానికి అనుకూలంగా హైదరాబాద్ లో భారీ బహిరంగ సభకు బిజెపి ప్లాన్ చేస్తోంది. మార్చి మొదటి వారంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ సభకు అమిత్ షా, పవన్ కళ్యాణ్ ను ఆహ్వానించాలనుకుంటోంది. ఉమ్మడి పౌరసత్వ సవరణ చట్టానికి అనుకూలంగా బీజేపీ సంఘ్ పరివార్ క్షేత్రాలు, కార్యక్రమాలు చేస్తున్నాయి. చిన్న చిన్న సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నాయి. కొన్ని చోట్ల భారీ సభలు కూడా జరుగుతున్నాయి, తెలంగాణలో కూడా కొన్ని చోట్ల సభలు, సమావేశాలు నిర్వహించింది బీజేపీ. మేథావుల సమావేశాలను ఏర్పాటు చేసింది, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, నగరాల్లో సభలు జరిగాయి. హైదరాబాద్ లో కూడా కార్యక్రమాలు చేసింది, ఇందిరాపార్కులో ఒక కార్యక్రమం తప్ప ఎక్కువగా హాల్ మీటింగ్ లకే పరిమితమైంది. మొక్కుబడి కార్యక్రమాలు కాకుండా భారీ బహిరంగ సభ నిర్వహించాలని కమలనాధులు భావిస్తున్నారు. మార్చి మొదటి వారంలో ఎల్బీ స్టేడియంలో ఈ సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
హోంమంత్రి అమిత్ షా టైమిస్తే మార్చి మూడవ(మార్చి 3) తేదీన ఈ సభ వుండే అవకాశముంది. ఈ సభకు బిజెపితో మళ్లీ దోస్తీ కట్టిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా హాజరు కానున్నారు. ఇప్పటికే బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో మాట్లాడినట్లు సమాచారం. త్వరలో గ్రేటర్ ఎన్నికలు జరిగే అవకాశం ఉండటం, గ్రేటర్ మునిసిపల్ కౌన్సిల్ పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా తీర్మానం చేయటంతో ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని బీజేపీ భావిస్తోంది. ఈ సభను తనకు అనుగుణంగా మార్చుకోవాలని బిజెపి నేతలు అనుకుంటున్నారు.