గుంటూరు జిల్లా తెనాలిలో కలకలం రేగింది. ఐతానగర్లో టీడీపీ నేత మంచాల రమేష్ పై హత్యాయత్నం జరిగింది. ఈ రోజు తెల్లవారుజామున ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడికి తెగబడ్డారు. అడ్డుగా వెళ్లిన రమేష్ సోదరుడు సతీష్ పై కూడా దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో రమేష్ కి తీవ్ర గాయాలు కాగా, సతీష్ స్వల్పంగా గాయపడినట్టు తెలుస్తోంది. వారిని తెనాలి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కాగా, మంచాల రమేష్ కుమార్తె తెనాలి పట్టణంలోని 39వ వార్డులో కౌన్సిలర్గా పోటీచేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రమేష్ కుటుంబంపై దాడి జరిగిందని తెలుస్తోంది. ఈ హత్యాయత్నం ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.