English | Telugu

మీకు అంత నమ్మకముంటే జగన్, కేసీఆర్ లాగా చేసి చూపించండి.. బాబుకు సజ్జల కౌంటర్ 

రాజధాని అమరావతి ఉద్యమం మొదలై 365 రోజులు పూర్తైన సందర్భంగా దానికి మద్దతుగా నిన్న నిర్వహించిన జనరణభేరిలో టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ ఏపీ సీఎం జగన్‌కు ఓ సవాలు విసిరిన సంగతి తెలిసిందే. అమరావతినే రాజధానిగా ఉంచాలని, లేదంటే మూడు రాజధానుల అంశంపై రెఫరెండం నిర్వహించాలని, దీనికి సీఎం జగన్‌ సిద్ధమేనా? అని నిన్న చంద్రబాబు ప్రశ్నించారు. ఒకవేళ ప్రజా తీర్పు మూడు రాజధానులకు అనుకూలంగా వస్తే తాను శాశ్వతంగా రాజకీయాల నుంచి విరమించుకుంటానని అయన సవాల్‌ విసిరారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై తాజాగా వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి స్పందిస్తూ బాబుకు ట్విట్టర్ ద్వారా కౌంటర్ ఇచ్చారు.

"రెఫరెండానికి రెడీనా అని చంద్రబాబుగారు అడుగుతున్నారు. తాను నమ్మిన అంశాల మీద నమ్మకం, విశ్వాసం ఉండే నాయకులు గతంలో ఏం చేశారో ఉమ్మడి రాష్ట్రంలో చూశాం. కాంగ్రెస్‌ నుంచి వేరుపడ్డ సమయంలో జగన్‌గారు, తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌గారు ఏం చేశారో మనకు తెలిసిందే.. వారి తో ఉన్న ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి ప్రజల ముందుకు వెళ్లారు. వైఎస్ జగన్ ‌గారు, కేసీఆర్‌గారిలానే చంద్రబాబుగారు కూడా తాను చెబుతోన్న మాటలమీద ఆయనకు నమ్మకం ఉంటే ప్రస్తుతం ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి ఎన్నికలకు వెళ్తే, ప్రజలు ఎటువైపు ఉన్నారో తేలుతుంది కదా?" అని సజ్జల చంద్రబాబుకు కౌంటర్ ఇస్తూ ట్వీట్ చేసారు. ఈ ట్వీట్ కు టీడీపీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.