తెలంగాణ ప్రభుత్వం పదో తరగతి పరీక్షలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ బాటలోనే తమిళనాడు, పుదుచ్చేరి ప్రభుత్వాలు కూడా పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి. తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలు పదో తరగతి పరీక్షలు రద్దు చేసిన నేపథ్యంలో ఏపీలో కూడా టెన్త్ పరీక్షలు రద్దవుతాయన్న ప్రచారం మొదలైంది. ఈ నేపథ్యంలో ఏపీ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పందించారు. ఏపీలో టెన్త్ పరీక్షలు జరిగి తీరుతాయని తేల్చిచెప్పారు. షెడ్యూల్ ప్రకారమే జులై 10వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు జరుగుతాయని స్పష్టం చేశారు. అయితే, 11 పేపర్లను 6 పేపర్లకు కుదించి పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. అనవసరమైన ప్రచారాలతో విద్యార్థులను గందరగోళానికి గురిచేయొద్దని విజ్ఞప్తి చేశారు. కరోనా భద్రతా చర్యలు పటిష్టంగా అమలు చేస్తున్నామని.. విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్యం విషయంపై జాగ్రత్తలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.