English | Telugu

న్యూజిలాండ్ లో మళ్ళీ కొత్తగా కరోనా కేసులు.. ఎన్నికల వాయిదా

న్యూజిలాండ్ కరోనా రహిత దేశం గా ప్రకటించిన మూడు నెలల తరువాత తాజాగా కొత్తగా కరోనా కేసులు నమోదయ్యాయి. దాదాపు 102 రోజుల తర్వాత గత వారం మళ్లీ కొత్తగా కరోనా కేసులు నమోదుకావడంతో అక్కడ జరగాల్సిన జనరల్ ఎలక్షన్స్ ను 4 వారాల పాటు వాయిదావేశారు. దీంతో సెప్టెంబర్ 19న జరగాల్సిన ఎన్నికలు ఇపుడు అక్టోబర్ 17 నాటికి వాయిదా పడ్డాయి. ప్రతిపక్షాలతో పాటు మిత్రపక్షాల నుంచి వచ్చిన తీవ్ర ఒత్తిళ్ల నేపథ్యంలో న్యూజిలాండ్ ప్రధాని జసిండా ఆర్డెర్న్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

న్యూజిలాండ్‌లో దాదాపు 102 రోజుల తర్వాత గత మంగళవారం ఆ దేశంలోని అతిపెద్ద నగరమైన ఆక్లాండ్‌లోని ఒకే కుటుంబంలో నలుగురికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అంతేకాకుండా నిన్న ఆదివారం నాటికి న్యూజిలాండ్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 49కి చేరుకుంది. ఐతే దేశంలో మళ్లీ కొత్తగా కరోనా కేసులు నమోదుకావడంతో ఎన్నికలు వాయిదా వేసినట్లు ప్రధాని తెలిపారు. సెప్టెంబర్‌లో కనుక ఎన్నికలు నిర్వహిస్తే కరోనా కారణంగా ప్రజలు ఓటింగ్‌లో పాల్గొనేందుకు ఆసక్తి చూపే అవకాశం లేదని అందుకే వాయిదా వేశామని ఆమె అభిప్రాయపడ్డారు.

ఐతే ఎన్నికలను వాయిదా వేయాలని నిర్ణయం తీసుకునే ముందు గత వారం రోజులుగా ఆమె పలు రాజకీయ పార్టీల నేతలు, ఎన్నికల కమిషన్ అధికారులతో కూడా సంప్రదింపులు జరిపారు. అయితే ఎట్టి పరిస్థితిలోనే ఎన్నికలను రెండోసారి వాయిదా వేయకూడదని కూడా నిర్ణయం తీసుకున్నట్లు జసిండా ఆర్డెర్న్ స్పష్టంచేశారు. ఇది ఇలా ఉండగా వచ్చే ఎన్నికల్లో జాసిండా ఆర్డెర్న్ మళ్లీ విజయం సాధిస్తారంటూ ఒపీనియన్ పోల్ సర్వేలు అంచనా వేస్తున్నాయి.