English | Telugu
బీజేపీ క్యాండిడేట్ పై ఎమ్మెల్యే దాడి! రాజేంద్రనగర్ లో హై టెన్షన్
Updated : Nov 30, 2020
డివిజన్ పరిధిలోని హౌజింగ్బోర్డు లో టీఆర్ఎస్ నేతలు ఓటర్లకు డబ్బులు పంచుతున్నారన్న సమాచారంతో బీజేపీ క్యాండిడేట్, కార్యకర్తలు వెళ్లి అడ్డుకున్నారు. ఈ సమయంలో గొడవ జరిగింది. టీఆర్ఎస్ నేతలు దీనిపై ఎమ్మెల్యేకు సమాచారం ఇచ్చారు. 200 మంది అనుచరులతో ఆ ప్రాంతానికి చేరుకున్న ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ హల్చల్ చేశారు. బీజేపీ క్యాండిడేట్ తో పాటు అతని పార్టీ కార్యకర్తలపై దాడి చేశారు. ఎమ్మెల్యే దాడిలో తనకు, కుటుంబ సభ్యులకు, పార్టీ కార్యకర్తలకు గాయాలు అయ్యాయని బీజేపీ క్యాండిడేట్ తోకల శ్రీనివాస్రెడ్డి చెప్పారు. టీఆర్ఎస్ నేతలు డబ్బు పంచుతుండటంపై తాము పోలీసులకు సమాచారం ఇచ్చామని.. అక్కడికి వచ్చిన ఎస్సై మీద కూడా ఎమ్మెల్యే అనుచరులు దాడి చేశారని తెలిపారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మైలార్దేవ్పల్లి పోలీస్స్టేషన్ఎదుట ఆయన ధర్నాకు దిగారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మైలార్ దేవ్ పల్లికి చేరుకుని పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే దాడి చేస్తుంటే ఏం చేస్తున్నారని ఆమె లోకల్ సీఐని ప్రశ్నించారు. పోలింగ్ ప్రశాంతంగా సాగాలంటే.. ఎమ్మెల్యేను, అనుచరులను వెంటనే అరెస్టు చేయాలని డీకే అరుణ డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే, అనుచరులు గూండాల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈఘటనపై డీసీపీ కార్యాలయంలో కంప్లైంట్ చేశామని బీజేపీ నేత స్వామిగౌడ్ తెలిపారు.