English | Telugu

ఏలూరును వణికిస్తున్న వింత వ్యాధి.. బాధితులను పరామర్శించిన సీఎం జగన్‌

పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరులో అంతుపట్టని వ్యాధి వణికిస్తోంది. మూర్ఛ, నోటి వెంట నురగ వంటి లక్షణాలతో అనేకమంది ఆస్పత్రిపాలవుతున్నారు. అంతుచిక్కని వ్యాధితో అనారోగ్యం పాలైన వాళ్ల సంఖ్య ఇప్పటికే 350 దాటింది. అలాగే, రెండు మరణాలు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.

ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్‌ ఇవాళ ఉదయం ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకుని అస్వస్థతకు గురైన బాధితులను పరామర్శించారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్న సీఎం.. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. సీఎం జగన్‌ వెంట మంత్రి పేర్నినాని, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ఉన్నారు. బాధితుల పరామర్శ అనంతరం అధికారులతో సీఎం జగన్‌ సమీక్ష జరుపుతున్నారు. వ్యాధి కారణాలు, తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తున్నారు.

మరోవైపు, మంగళగిరి ఎయిమ్స్‌ వైద్యుల బృందం ఏలూరులో పర్యటించింది. 8 మంది సభ్యుల బృందం రోగుల నుంచి రక్త నమూనాలు సేకరించింది. రక్త నమూనాలు సేకరించి ఢిల్లీ ఎయిమ్స్‌ కు పంపించామని, రిపోర్టుల ఆధారంగా వ్యాధిని నిర్థారిస్తామని ఎయిమ్స్‌ వైద్యులు తెలిపారు.