English | Telugu

మోదీ ప్రతినిధిగా మాట్లాడుతున్నా.. అమరావతే ఏపీ రాజధాని

రాజధాని అమరావతి అంశం గత కొన్ని నెలలుగా ఏపీ రాజకీయాలను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. అధికార వైసీపీ మూడు రాజధానుల నిర్ణయం తీసుకోవడాన్ని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. బీజేపీ నుంచి మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే, తాజాగా రాజధాని అంశంలో బీజేపీ వైఖరి ఏంటో ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తేల్చి చెప్పారు. ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. అమరావతిలోనే రాజధాని ఉండాలనేది బీజేపీ లక్ష్యమని, ఇందులో రెండో ఆలోచనకు తావు లేదని చెప్పారు. గుంటూరు జిల్లా తుళ్లూరులో జరిగిన 'భారతీయ కిసాన్ సంఘ్' సమ్మేళనంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రధాని నరేంద్ర మోదీ ప్రతినిధిగా తాను మాట్లాడుతున్నానని సోము వీర్రాజు చెప్పారు. అమరావతిలో రూ. 1800 కోట్లతో నిర్మిస్తున్న ఎయిమ్స్ హాస్పిటల్ ఆగలేదని, దుర్గమ్మ ఫ్లైఓవర్ ను పూర్తి చేశామని తెలిపారు. మోదీ అమరావతి వైపే ఉన్నారనడానికి ఇదే నిదర్శనమని అన్నారు. బీజేపీ కార్యాలయాన్ని కూడా విజయవాడలోనే కడుతున్నామని చెప్పారు. బీజేపీ మాట తప్పే పార్టీ కాదని, అమరావతిలోనే రాజధాని ఉండాలని బీజేపీ తరపున ఉద్యమం చేస్తామని అన్నారు. 2024 ఎన్నికల్లో ఏపీలో బీజేపీకి అధికారం ఇస్తే.. అమరావతిని బాగా అభివృద్ధి చేసి చూపిస్తాం అని వీర్రాజు చెప్పుకొచ్చారు.