Read more!

English | Telugu

రంభ ఇప్పుడేం చేస్తున్నారు? ఎక్క‌డున్నారు?

 

ఆమె అస‌లు పేరు విజ‌య‌ల‌క్ష్మి. కానీ రంభ అనే స్క్రీన్ నేమ్‌తోటే ఆమె పాపుల‌ర్ అయ్యారు. తెలుగు, త‌మిళ తెర‌ల‌పై టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగారు. 'ఆ ఒక్క‌టీ అడ‌క్కు' మూవీలో రాజేంద్ర‌ప్ర‌సాద్ స‌ర‌స‌న నాయిక‌గా న‌టించ‌డం ద్వారా టాలీవుడ్‌లో కాలుపెట్టిన రంభ‌, ఆ త‌ర్వాత కృష్ణ‌, చిరంజీవి, బాల‌కృష్ణ‌, వెంక‌టేశ్‌, రాజ‌శేఖ‌ర్‌, జ‌గ‌ప‌తిబాబు, సుమ‌న్‌, జె.డి. చ‌క్ర‌వ‌ర్తి లాంటి హీరోల స‌ర‌స‌న సూప‌ర్ హిట్ సినిమాల్లో నాయిక పాత్ర‌లు పోషించారు. ఇక త‌మిళంలోనూ ర‌జ‌నీకాంత్‌తో మొద‌లుపెట్టి ఒకటిన్న‌ర ద‌శాబ్దం క్రితం అక్క‌డి పాపుల‌ర్ స్టార్స్ అంద‌రితోనూ ఆమె న‌టించారు.

చివ‌రిసారిగా ఆమె క‌నిపించిన సినిమా 2008లో వ‌చ్చిన 'దొంగ స‌చ్చినోళ్లు'. రాజా వ‌న్నెంరెడ్డి డైరెక్ట్ చేసిన ఆ సినిమాలో రంభ ఓ ప్ర‌త్యేక పాత్ర చేశారు. నిజం చెప్పాలంటే ఒక‌టిన్న‌ర ద‌శాబ్ద కాలం టాలీవుడ్‌, కోలీవుడ్‌ను ఏలిన హీరోయిన్ల‌లో ఆమె ఒక‌రు. హిందీలోనూ హీరోయిన్‌గా కొన్ని సినిమాలు చేశారు. 2001 నుంచి ఆమె ప్రాభ‌వం త‌గ్గుతూ వ‌చ్చింది. ఆ టైమ్‌లో టీవీ షోల‌కు జ‌డ్జిగా కూడా ఆమె వ్య‌వ‌హ‌రిస్తూ వ‌చ్చారు. ఆమ‌ధ్య వ‌చ్చిన‌ అజ‌య్ భూప‌తి మూవీ 'మ‌హాస‌ముద్రం'లో రంభ వీరాభిమానులుగా హీరో శ‌ర్వానంద్, న‌టుడు జ‌గ‌ప‌తిబాబు క‌నిపించి, ఆమెకు నీరాజ‌నాలు ప‌ల‌క‌డం విశేషం. 

వివాహానంత‌రం రంభ‌ న‌ట‌న‌కు పూర్తిగా దూర‌మ‌య్యారు. 2010 ఏప్రిల్‌ 8న కెనడాకు చెందిన వ్యాపారవేత్త ఇంద్రకుమార్‌ను ఆమె పెళ్లాడారు. ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గానే ఉంటూ వ‌స్తోన్న రంభ‌, త‌మ పిల్ల‌ల‌కు సంబంధించిన క్యూట్ ఫొటోల‌ను త‌ర‌చూ షేర్ చేసుకుంటూనే వ‌స్తున్నారు. అప్పుడ‌ప్పుడు త‌న సెల్ఫీ పిక్చ‌ర్స్‌ను షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కు ఆనందం క‌లిగిస్తున్నారు. భ‌ర్త ఇంద్ర‌కుమార్‌, ఇద్ద‌రు కూతుళ్లు, కొడుకుతో చాలా హ్యాపీగా జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. ప్ర‌స్తుతం రంభ ఫ్యామిలీ టోరంటోలో నివాసం ఉంటోంది.