English | Telugu
కనీసం కొబ్బరికాయ కూడా కొట్టకుండా ప్రారంభమై ట్రెండ్ సెట్టర్ అయిన తొలి తెలుగు చిత్రం!
Updated : Jun 27, 2021
ధవళ సత్యం దర్శకత్వం వహించగా 1980 ఆగస్ట్ 15న విడుదలై సంచనల విజయం సాధించిన చిత్రం 'యువతరం కదిలింది'. నవతరం పిక్చర్స్ పతాకంపై మాదాల రంగారావు కథను రాసి, సమర్పించిన ఈ చిత్రంలో ఆయనతో పాటు రామకృష్ణ, నారాయణరావు, మురళీమోహన్, రంగనాథ్, సాయిచంద్, ప్రభాకర్రెడ్డి, నాగభూషణం ప్రధాన పాత్రలు పోషించారు. టైటిల్ సాంగ్ను సి. నారాయణరెడ్డి రాసిన ఈ చిత్రంలో "ఆశయాల పందిరిలో అనురాగం సందడిలో.." అనే మరో పాట ఆనాటి యువతరాన్ని బాగా ఆకట్టుకుంది. ఆ పాట రాసింది అదృష్ట దీపక్. ఇది ఆయన తొలి సినీ గీతం. అప్పటికే ఆయన కథకుడు, బుర్రకథారచయిత, రంగస్థల నటుడు, గాయకుడు.
అదృష్ట దీపక్ రాసిన పాటతోటే ఈ సినిమా పాటల రికార్డింగ్ ప్రారంభమైంది. టి. చలపతిరావు స్వరాలు కూర్చిన ఈ పాటను రామకృష్ణ, విజయలక్ష్మీ శర్మ బందం పాడగా రికార్డ్ చేశారు. 1980 మార్చి 26న మద్రాస్లోని విజయా గార్డెన్స్లో మొదలైన ఈ కార్యక్రమం పెద్ద సంచలనాన్నే సృష్టించింది. కారణం.. పూజలూ, పురోహితులూ లేకుండా, కనీసం కొబ్బరికాయ కూడా కొట్టకుండా అది జరగడం. విపరీతమైన సెంటిమెంట్లకు ఆలవాలమైన సినిమా రంగంలో ఇలా చేయడం ద్వారా మాదాల రంగారావు టాక్ ఆఫ్ ద టౌన్గా మారారు. "ఇలా జరగడం మొత్తం మద్రాసు చలనచిత్ర చరిత్రలో ఇదే మొదటిసారి." అంటూ పత్రికలన్నీ ఆ సంఘటనను ప్రముఖంగా రాశాయి.
'ఆశయాల పందిరిలో..' పాట రికార్డింగ్ రోజునే యువతరం కదిలింది సినిమా విడుదల తేదీని కూడా ఆయన ప్రకటించారు. ప్రకటించిన విధంగానే అదే సంవత్సరం ఆగస్ట్ 15న విడుదలైన ఈ సినిమా అప్పుడు విడుదలైన భారీ బడ్జెట్ సినిమాలను ఢీకొట్టి మరీ సెన్సేషనల్ హిట్టయింది. ఆ తరహా చిత్రాలకు ట్రెండ్ సెట్టర్గా నిలిచింది.