Read more!

English | Telugu

నాలుగోసారి నేష‌న‌ల్ అవార్డ్ అందుకున్న కంగ‌న‌.. గ‌ర్వంతో పొంగిపోతున్న అమ్మానాన్న‌లు!

 

న‌టిగా నాలుగోసారి జాతీయ అవార్డు అందుకొని త‌ల్లిదండ్రుల‌కు గ‌ర్వ‌కార‌ణంగా నిలిచింది బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగ‌నా ర‌నౌత్‌. చిత్ర‌సీమ‌లోకి అడుగు పెట్టిన‌ప్ప‌ట్నుంచీ త‌న న‌ట‌న‌తో ఆడియెన్స్‌ను అల‌రిస్తూ వ‌స్తోందామె. ప్ర‌తి ఏటా ఆమె చేసే పాత్ర‌లు, ఆమె న‌ట విన్యాసాలు ఫ్యాన్ బేస్‌ను పెంచుకుంటూ పోతున్నాయి.  'ఫ్యాష‌న్' (2010) సినిమాలో చేసిన క్యారెక్ట‌ర్‌తో ఉత్త‌మ స‌పోర్టింగ్ యాక్ట్రెస్‌గా తొలిసారి నేష‌న‌ల్ అవార్డ్ సాధించిన ఆమె, ఆ త‌ర్వాత 'క్వీన్' (2015), 'త‌ను వెడ్స్ మ‌ను' (2016) చిత్రాల్లో చేసిన హీరోయిన్ క్యారెక్ట‌ర్స్‌తో నేష‌న‌ల్ బెస్ట్ యాక్ట్రెస్ అవార్డులు అందుకుంది. 

'మ‌ణిక‌ర్ణిక‌', 'పంగా' సినిమాల్లో చేసిన న‌ట‌న‌కు నాలుగోసారి నేష‌న‌ల్ అవార్డ్ సాధించిన కంగ‌న‌, ఆ పుర‌స్కారాన్ని న్యూఢిల్లీలో సోమ‌వారం జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎం. వెంక‌య్య‌నాయుడు చేతుల మీదుగా అందుకుంది. ఆమె ర‌జ‌త క‌మ‌లాన్ని అందుకుంటున్న వేళ ఆమె త‌ల్లిదండ్రులు పొందిన ఆనందం అంతా ఇంతా కాదు.

కంగ‌న సోద‌రి రంగోలి, ఆ వేడుక‌కు సంబంధించిన క్ష‌ణాల‌ను త‌న ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేసింది. మొద‌టి పిక్చ‌ర్‌లో రెండు వేళ్ల‌ను చూపిస్తూ సంప్ర‌దాయ ప‌ట్టుచీర‌లో గార్జియ‌స్‌గా క‌నిపిస్తోంది కంగ‌న‌. మ‌రో ఫొటోలో కూతురు అవార్డు అందుకుంటున్న స‌మ‌యంలో కంగ‌న త‌ల్లి ఆశా ర‌నౌత్ ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు.

కంగ‌న సైతం త‌న ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా త‌న త‌ల్లితండ్రుల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపింది. అవార్డుల ప్ర‌దానోత్స‌వానికి సంబంధించిన రెండు ఫొటోల‌ను ఆమె షేర్ చేసింది. "మ‌న‌మంతా మ‌న త‌ల్లితండ్రుల ప్రేమ‌, సంర‌క్ష‌ణ‌, త్యాగాల‌కు అర్హులుగా ఉండాల‌నే ప్ర‌గాఢ కోరిక‌తో పెరుగుతాం. అమ్మానాన్న‌ల‌ను నేను పెట్టిన ఇబ్బందుల నాటి రోజుల్ని ఇలాంటివి మ‌ర్చిపోయేలా చేస్తాయి. మీరు నా అమ్మానాన్న‌లు అయినందుకు థాంక్ యూ. ఇంత‌కంటే నేనేం కోరుకోను." అని ఆమె రాసుకొచ్చింది.