భార్య డబ్బు పంపలేదని పిల్లల్ని చిత్రహింసలకు గురిచేశాడు

 

భార్య కష్టపడి డబ్బులు పంపిస్తుంటే తినమరిగిన ఓ భర్త దారుణానికి పాల్పడ్డాడు. ఈ వ్యవహారం పశ్చిమ గోదావరి జిల్లా సార్వ గ్రామంలో జరిగింది. గల్ఫ్ లో పని చేస్తున్న భార్య ఇంటికి డబ్బు పంపించడం లేదని తన కోపాన్ని పిల్లల మీద చూపిస్తున్నాడు ఎలిషా. పిల్లల్ని ఛార్జర్ తో.. బెల్ట్ తో.. కొడుతూ వీడియోలు రికార్డు చేసి వాటిని భార్య మహాలక్ష్మికి వాట్సాప్ చేశాడు. అది చూసి తట్టుకోలేని తల్లి.. తన వాళ్ళకి ఫోన్ చేసి వాపోవడంతో మహాలక్ష్మి బంధువులు హుటాహుటిన వెళ్లి పిల్లల్ని తెచ్చేసుకున్నారు. తల్లి లేక పోతే.. అన్నీ తానై ఉండాల్సిన నాన్న ఇంత వికృతంగా మారాడు. గల్ఫ్ నుంచి డబ్బు రావడం లేదని పిల్లల్ని దారుణంగా హింసించాడు. చివరికి ఆ పిల్లలు కూడా తండ్రిని చూస్తేనే వణికిపోతూ ఓ మూలకు వెళ్లి దాక్కున్న విషయం చూస్తుంటే హృదయాన్ని పిండేసినట్లు అనిపిస్తుందని బంధువులు అంటున్నారు.

ఈ ఘటన 20 రోజుల క్రితం జరిగింది కానీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన తరువాత ఎప్పుడైతే వీడియోలు కూడా బయటకు వచ్చాయో బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే ఆ కిరాతక తండ్రి పరారీలో ఉన్నట్లు సమాచారం.చిన్నారులు కూడా మహాలక్ష్మీ బంధువుల ఇంటి వద్ద ఆశ్రయం తీసుకునే పరిస్థితి నెలకొంది. ఇలాంటి దయనీయమైనటువంటి ఘటన కేవలం డబ్బుల కోసం అది కూడా సొంత కన్నబిడ్డల్ని బెల్టుతో చిత్ర హింసలకు గురిచేయడమే కాక  భార్యను నెల నెల డబ్బులు పంపించాలని పిల్లల్ని కొట్టి.. మళ్లీ వాటిని వీడియో రూపంలో చిత్రీకరించి పంపిన ఈ ఘటన పై స్థానికులు,బంధువులు కూడా తీవ్రంగా మండిపడుతున్నారు.పోలీసులు ఈ కిరాతకుడిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని.. పిల్లలకు రక్షణ కల్పించాలి కోరుతున్నారు. ఫిర్యాదును సీరియస్ గా తీసుకున్న పోలీసులు ప్రస్తుతం ఎలీషా ను పట్టుకునే పనిలో బిజీగా ఉన్నారు.