ఆ పాలన మాకొద్దన్న ఏపీ ఓటర్! అధికారం టీడీపీ కూటమిదే!
ఏపీలో జరిగిన పోలింగ్ పై రాజకీయ పార్టీల్లో ఉత్కంఠత పెరిగిపోతోంది. 2019లో 79.64 శాతం పోలింగ్ నమోదైంది. 2014వ సంవత్సరంతో పోల్చితే, 2019లో ఓటింగ్ 1.23 శాతం పెరిగింది. ఫలితం ప్రతిపక్ష పార్టీకి 151 సీట్లు వచ్చాయి. అధికార పార్టీ 23 సీట్లతో సర్దు కోవాల్సి వచ్చింది.
ఇక 2019తో 2024 పోలింగ్ ను పోల్చితే 2 శాతం తేడా కనిపిస్తోంది. 2014 లో జరిగిన మొదటి ఎన్నికల్లో 78.41, రెండోసారి 2019లో 79.64 శాతం నమోదయితే ఈసారి 2024 లో పోలింగ్ 81 శాతాన్ని దాటిపోయేలా వుంది. దీన్ని బట్టి ఫలితం ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. తెలుగుదేశం కూటమికి 155 నుండి 160 సీట్లు, వైఎస్సార్సీకి 15 నుండి 21 అసెంబ్లీ సీట్లు, 2 లేదా 3 పార్లమెంటు సీట్లు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. వైఎస్సార్సీపికి కనీసం ప్రతిపక్షహోదా కూడా రాకుండా ఓట్లతో అమోఘమైన ప్రజాస్వామిక తీర్పు ఇచ్చారనే టాక్ అయితే నడుస్తోంది.
పోలింగ్ జరిగిన తీరు చూస్తే.... ఉప్పెనలా పోలింగ్ బూతులకు జనాలు తరలి వచ్చారు. ముఖ్యంగా మహిళ ఓటర్లు, వాళ్ళు ఎవరి వైపు మొగ్గు చూపితే వారిదే అధికారం. ఆంధ్రప్రదేశ్ లో మహిళ ఓటర్లు ఎక్కువ. 154 నియోజకవర్గాల్లో మహిళ ఓటర్లు ఎక్కువ మంది ఉన్నారు. వీరే గెలుపోటములను నిర్ణయిస్తారు. ఇక్కడ ఓ విషయం మాట్లాడుకోవాలి.
2019 ఎన్నికల్లో మహిళలు పెద్దయెత్తున తరలి రావడంతో తమకు అనువుగా మారుతుందని అప్పటి అధికార తెలుగుదేశం పార్టీ అంచనా వేసింది. అందుకు కారణం ఏమిటంటే, పసుపు కుంకుమ పేరిట పది వేల రూపాయలు నగదును వారి ఖాతాల్లోకి బదిలీ చేయడంతో ఆ ఓట్లన్నీ తమకేనని అప్పట్లో టీడీపీ ఆశలు పెట్టుకుంది. ఫలితం మనం చూశాం. టీడీపీ 23 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
సీన్ కట్ చేస్తే 2024 ఎన్నికల్లోనూ భారీ స్థాయిలో మహిళా ఓటర్లు ఓటు వేశారు. అంటే... ప్రభుత్వంపై వ్యతిరేకత మహిళల్లో ఉంది.
1. అభివృద్ధి లేకపోవడంతో పాటు
2. మద్యనిషేధం చేయకపోవడం
3. శాంతిభద్రతల సమస్యలు
4. కూటమి మ్యానిఫేస్టోలో పెట్టిన అంశాలు
5. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం,
6. ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం,
7. తల్లికి వందనం పేరిట ఎంత మంది కుటుంబంలో ఉన్నా వారందరికీ ఇస్తామని ప్రకటించడం
8. 19 ఏళ్లు దాటిన ప్రతి మహిళకు 1,500 ఇస్తామని చెప్పడం
టీడీపీ కూటమికి కలసి వచ్చే అంశాలు. అందుకే మహిళలు భారీ ఎత్తున ఓటు వేశారు.
ఏపీలో కుల రాజకీయాలకు ఎన్నికలు పరాకాష్ఠ. వారి కులం వారికే ఓటర్లు తమ ఓటును వేస్తారనేది కాదనలేని వాస్తవం. ఆ కులానికి చెందిన వ్యక్తి మంచి చేస్తున్నాడా చేయడం లేదా అనేది ఎవ్వరికీ అవసరం లేదు. ఆ నేత తమ కులం వాడు, అతనికే తమ ఓటు అనే ఆలోచనా ధోరణి ఏపీలో చాలా మంది ఓటర్లకు ఉంది. ఉద్యోగులు, కార్మికులు, మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి, కాపు, కమ్మ కులాల ఓటర్లు సాలిడ్ గా టీడీపీ కూటమికి ఓటేసినట్లు ఆయా పార్టీలు చెప్పుకుంటున్నాయి.
బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, రెడ్డి ఓటర్లు, సంక్షేమ పథకాలు తీసుకున్న వాళ్లు తమకే మద్దతిచ్చారని వైసీపీ చెబుతోంది.
59 నెలలుగా దాదాపు 2 లక్షల 75 వేల కోట్ల రూపాయలు 65 లక్షల కుటుంబాలకు అనేక పధకాల ద్వారా చేరాయని జగన్ పదే పదే చెప్పడం, ' మీ కుటుంబానికి మంచి జరిగితే మీరు వోట్ వేయండి.. మీరే ఇతరులకు చెప్పండి !' అని అన్ని చోట్లా జగనే చెబుతూ ప్రచారం చేసుకున్నారు.
ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు అన్న లక్ష్యంతో చంద్రబాబునాయుడు కూటమి ఏర్పాటు చేసుకొని ఈ ఎన్నికల్లో తలపడ్డారు. గత 5 సంవత్సరాలుగా రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదు, రాష్ట్రానికి రాజధాని లేదని, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని ప్రజా వ్యతిరేక చట్టం గా ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లారు.
వైఎస్ షర్మిల జగన్ చెల్లెలు గా జగన్ ని బాగా ఇరకాటంలో పడేసింది అని చెప్పాలి. వివేకానంద రెడ్డి హత్య కేసు ను పట్టుకొని ఆయన కుమార్తె Dr సునీత కూడా వైఎస్ అవినాష్ రెడ్డి మీద వ్యతిరేక ప్రచారం చేయటం, చివరి రోజు వైఎస్ విజయమ్మ కూడా 'షర్మిల ను గెలిపించండి ' అని మేసేజ్ వదలటం వైఎస్సార్ పార్టీ కి నష్టం కలిగించే అంశాలు.
ETV, TV5, ABN AndhraJyothi TV ఛానళ్ళు కూటమి వైపు, TV9, NTV, Sakshi TV ఛానళ్ళు వైయస్సార్ పార్టీ కి అనుకూలంగా కధనాలు ప్రసారం చేశాయి.
- ఎం.కె.ఫజల్