ఎమ్మార్వోపై వైసీపీ నేత భౌతిక దాడి

చట్టాలు వర్తించవు, నిబంధనలు పాటించరు. అధికారులను వారి పని వారిని చేసుకోనివ్వరు. తమ మాట వినకపోతే భౌతిక దాడులకు కూడా వెనుకాడరు. ఇదీ ఏపీలో అధికార వైసీపీ నేతల తీరు. తిరుమలలో నిబంధనలు పాటించకుండా విజిలెన్స్ చీఫ్ ను తోసుకుని మరీ మహాద్వారం గుండా మాజీ మంత్రి కొడాలి నాని ఆలయ ప్రవేశం చేసినా ఆయనకు దణ్ణం పెట్టడం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయత ఆ అధికారులదీ, అక్కడి పోలీసులదీ.

చంద్రబాబును అక్రమంగా అర్ధరాత్రి అరెస్టు చేసి ఇదేమిటంటూ రోడ్లపైకి వస్తున్న జనాలను ఎక్కడికక్కడ అడ్డుకుని, ఆందోళనలను అణచివేయడం.. అదే సమయంలో చంద్రబాబును అరెస్టు చేసినా రాష్ట్రంలో ఎక్కడా కనీసం ఖండనలు లేవని చెప్పుకోవడం వైసీపీ నేతల రీతి. రాష్ట్రం మొత్తం అధికార వైసీపీ ఆడింది ఆటగా, పాడింది పాటగా చెలామణి అవుతున్న అరాచక పరిస్థితి రాజ్యమేలుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

ఇక తాజాగా ప్రకాశం జిల్లా సంతనూతలపాడు ఎమ్మార్వోగా పని చేస్తున్న లక్ష్మీనారాయణ రెడ్డికీ వైసీపీ గూండాయిజం సెగ తగిలింది. స్థానిక వైసీపీ నాయకుడు, సంతనూతల పాడు మండల వైసీపీ అధ్యక్షుడు, స్థానిక జడ్పీటీసీ సభ్యురాలి భర్త అయిన దుంపా చెవిరెడ్డి ఎమ్మార్వో లక్ష్మీనారాయణరెడ్డిపై భౌతిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన మంగళవారం (సెప్టెంబర్ 19)న జరిగింది. దుంపాచెవిరెడ్డి గత కొంత కాలంగా పది ఎకరాల పోరంబోకు భూమి విషయంలో వివాదం ఉంది. ఈ వివాదం నేపథ్యంలోనే ఇటీవల రెండు వారాలపాటు లక్ష్మీనారాయణ రెడ్డి సెలవుపై వెళ్లారు. ఆయన గత వారమే తిరిగి విధులలో చేరారు. ఈ నేపథ్యంలో మంగళవారం (సెప్టెంబర్ 19)న దుంపా చెవిరెడ్డి ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్లి మరో సారి ఆ పదెకరాల పోరంబోకు భూమినీ తన పేరుపై బదలాయించాల్సిందిగా ఒత్తిడి తీసుకువచ్చారు. అందుకు ఎమ్మార్వోపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన చెవిరెడ్డి కార్యాలయ సిబ్బందిని బయటకు పంపేసి లక్ష్మీనారాయణరెడ్డి గొంతు పట్టుకుని బెదరించి చెంపపై కొట్టారు.  

ఈ సంఘటన మండలంలో సంచలనం సృష్టించింది. దుంపాచెవిరెడ్డి తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. అధికారులు సక్రమంగా విధులు నిర్వర్తించే పరిస్థితులు లేకుండా వైసీపీ నేతలు భయానక వాతావరణం సృష్టిస్తున్నారని తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు. ఎమ్మార్వోపై చేయి చేసుకున్న దుంపా చెవిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని, కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 

Teluguone gnews banner