Read more!

జగన్ అరాచకపాలనకు నిరసనగా హస్తిన వేదికగా వేలు కోసుకున్న మహిళ

ఏపీలో జగన్ పాలన అరాచకత్వానికి పర్యాయపదంగా మారిపోయింది. జగన్ అరాచక పాలనకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన ఎన్నికల ప్రచారం పేర మనమంతా సిద్ధం అంటూ నిర్వహిస్తున్న బస్సు యాత్రకు ప్రజలు ముఖం చాటేస్తున్నారు. ఎలాగో తంటాలు పడి వైసీపీ నేతలు జనాలను సమీకరించినా.. అడుగడుగునా నిరసనలే వ్యక్తమౌతున్నాయి. జగన్ కు వ్యతిరేకంగా యువత, నిరుద్యోగులు, కార్మికులు, కర్షకులు.. ఇలా ఒకరనేమిటి సమాజంలోని అన్ని వర్గాల వారీ రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలకు దిగుతున్నారు. జగన్ బస్సు యాత్ర పోడవునా నిరసన గళం వినిపిస్తున్నారు. 

అయితే రాష్ట్రంలో జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తుతున్న వారిపై పోలీసుల సహకారంతో ఉక్కుపాదం మోపుతున్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా పోలీసులు ప్రభుత్వం తరఫున ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసుల తీరుపై, కొందరు ఐఏఎస్, ఐపీఎస్ లు జగన్ కు అండగా వ్యవహరిస్తున్న వైనంపై ఎన్నికల సంఘానికి ఇప్పటికే ఎన్నో ఫిర్యాదులు అందాయి. స్వయంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మీనా ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందన కోసం వేచి ఉన్నామని ప్రకటించిన సంగతి కూడా తెలిసిందే. 

అయితే ఇప్పుడు జగన్ పాలనలో జరుగుతున్న ఆరాచకాలపై హస్తిన వేదికగా కూడా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. గుంటూరుకు చెందిన కోవూరి లక్ష్మి అనే మహిళ జగన్ అరాచకపాలనకు నిరసనగా ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద తన బొటన వేలు కోసుకున్నారు.  మాజీ హోంమంత్రి సుచరిత అనుచరుల అక్రమాలను వివరిస్తూ ఇండియా గేట్ వద్ద తన అనుచరులతో నిరసనకు దిగిన ఆమె.. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, అవినీతిపై ప్రసంగిస్తూ అకస్మాత్తుగా తన బొటన వేలు కోసుకున్నారు.

జగన్ అరాచకపాలన, వైసీపీ నేతల అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలు, అవినీతిపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్రమోడీ, సీజేఐ చంద్రచూడ్ లకు ఫిర్యాదు చేసే ఉద్దేశంతో  మహిళా సంఘాలు, ప్రజా సంఘాల నేతలతో కలిసి హస్తిన వచ్చిన లక్ష్మి వారిని కలిసేందుకు అవకాశం దక్కక పోవడంతో వారి వారి కార్యాలయాలలో ఫిర్యాదులు అందజేసి ఆదివారం సాయంత్రం ఇండియా గేట్ వద్ద నిరసన చేపట్టారు. ఆ నిరసనలో భాగంగా తన బొటన వేలు తెగ్గోసుకున్నారు.