అమరావతి రీలాంచ్ సరే.. జగన్ నిర్వాకంపై మోడీ మౌనమేల?

ఆంధ్రప్రదేశ్ రాజథాని అమరావతి నిర్మాణానికి 2015లో శంకుస్థాపన జరిగింది. అప్పట్లో ఈ కార్యక్రమానికి ప్రధాని హోదాలో మోడీ హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ శంకుస్థాపన కార్యక్రమాన్ని నభూతో అన్నట్లుగా నిర్వహించారు. సరే మళ్లీ ఇప్పుడు అంటే మే 3న అదే అమరావతికి ప్రధాని మోడీ మరో సారి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాన్ని అమరావతి నిర్మాణ పనుల పున: ప్రరంభ కార్యక్రమం అని చెబుతున్నారు. అప్పుడూ.. ఇప్పుడూ కూడా కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వమే ఉంది. ప్రధానిగా నరేంద్రమోడీ, ఏపీ సీఎంగా చంద్రబాబు రెండు సార్లూ కూడా అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతామనే అన్నారు. అయితే ఈ మధ్యలో ఐదేళ్లలో ఏం జరిగింది? 2015లో అట్టహాసంగా ప్రారంభమైన అమరావతి నిర్మాణ కార్యక్రమం 2019 నుంచి 2024 వరకూ ఎందుకు నిలిచిపోయింది. నిర్వీర్యమైపోయింది అన్నది అందరికీ తెలిసిన చరిత్రే. 

అయితే అప్పటికీ ఇప్పటికీ ఒక తేడా ఉంది. నాడు మోడీ కేవలం అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేసి మట్టీ, నీళ్లు ఇచ్చి వెళ్లిపోయారు. అమరావతి నిర్మాణం, పురుభివృద్ధి ఒక బాధ్యతగా భావించలేదు. అది కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఒక కార్యక్రమంగానే భావించారు. ఎందుకంటే అప్పుడు కేంద్రంలో ఉన్నది ఎన్డీయే ప్రభుత్వమే అయినా, భాగస్వామ్య పక్షాల మద్దతు ఇసుమంతైనా అవసరం లేనంత బలం ఒంటరికగా బీజేపీకే ఉంది. అందుకే అప్పట్లో మోడీ మిత్రపక్షాల ఆకాంక్షలను, డిమాండ్లను పట్టించుకోలేదు. 

అయితే ఇప్పుడు 2025లో మోడీకి ఆ పరిస్థితి లేదు. కేంద్రంలో తన ప్రభుత్వం మనుగడ సాగించాలంటే చంద్రబాబు మద్దతు అవసరం. అందుకే ఇప్పుడు  మోడీ మరో సారి అమరావతి నిర్మాణ పనులను రీ లాంచ్ చేశారు. అవును మళ్లీ అమరావతి నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టారు. అయితే ఈ సారి గతంలోలా దీనిని ఒక లాంఛనంగా కాకుండా ఒక బాధ్యతగా  తీసుకున్నారు. అమరావతి అభివృద్ధిలో కేంద్రం బాధ్యతగానే కాకుండా భాగస్వామిగా కూడా ఉంటుందని చెప్పడానికే 57 వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలూ చేశారు. అంతే కాదు అమరావతికి ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకుల నుంచి గ్రాంట్లు అందేలా చూడటమే కాకుండా హుడ్కో నుంచి కేటాయింపులు కూడా వచ్చేలా సంపూర్ణ సహకారం అందించింది. దీంతో గతానికి భిన్నంగా ఈ సారి మోడీ చిత్తశుద్ధి కనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు. అందుకు ఆయన రాజకీయ అవసరం కూడా కారణం అనుకోండి అది వేరే సంగతి. 

ఇంత వరకూ బాగే ఉంది.. 2015లో తానే స్వయంగా శంకుస్థాపన చేసిన అమరావతి నిర్మాణం అర్ధంతరంగా ఐదేళ్ల పాటు నిలిచిపోవడానికీ, నిర్వీర్యమైపోవడానికీ కారణమైన జగన్ నిర్వాకం గురించి మోడీ శుక్రవారం (మే 2)న జరిగిన అమరావతి పనుల పున:ప్రారంభోత్సవ సభలో ఒక్కటంటే ఒక్క మాట అనలేదు. ఐదేళ్ల జగన్ అరాచక పాలన కారణంగా ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలుగా వెనుకబడిపోవడం తెలిసిందే. అయితే ఇంతటి అరాచక పాలన సాగించి, కేవలం రాష్ట్ర రాజధాని మాత్రమే కాదు.. ఒక శక్తి అని చెప్పిన ప్రధాని మోడీ.. ఆ శక్తిని నిర్వీర్యం చేయడానికి గత ఐదేళ్లలో విశ్వ ప్రయత్నం చేసిన జగన్ పాలనపై చిన్న పాటి విమర్శ కూడా చేయకపోవడం విమర్శలకు తావిస్తున్నది. 

మూడు రాజధానుల పేరుతో అమరావతి విధ్వంసానికి పూనుకున్న మాజీ ముఖ్యమంత్రి   జగన్  పాలనను కానీ, జగన్ సర్కార్ ప్రభుత్వ విధానాలపై కానీ చిన్నపాటి విమర్శ కూడా మోడీ చేయలేదు.  గత పదేళ్లుగా అమరావతి నిర్మాణాలకు అవసరమైన అన్ని సదుపాయాలను కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది అని చెప్పుకున్న మోడీ.. మరి గత ఐదేళ్లుగా అమరావతిలో కనీసం ఒక్క ఇటుక కూడా పేర్చని జగన్ పాలన గురించి అసలు ప్రస్తావించనేలేదు.   ఇక్కడే ఇప్పటికీ మోడీ జగన్ ను షీల్డ్ చేస్తున్నారా? అన్న అనుమాలు వ్యక్తమౌతున్నాయని పరిశీలకులు అంటున్నారు. 

Teluguone gnews banner