సింహాచలం విషాదం..ఈ పాపం ఎవరిది ?

సింహాద్రి అప్పన్న చందనోత్సవ వేళ జరిగిన అపశ్రుతి అత్యంత విషాదకరం. గోడ కూలడమే ప్రమాదానికి కారణం అయినప్పటికీ.. ఈ దుర్ఘటన అనేక ప్రశ్నలను తెరమీదకు తీసుకువస్తున్నది.  భారీ వర్షం కారణంగా ఈ ఘటన జరిగినట్టు అధికారులు చెప్తున్నారు. అయితే వర్షం ఒక కారణమైతే కావచ్చు కానీ, సింహాచలం అప్పన చందనోత్సవ సమయంలో ప్రతి ఏటా ఏదో ఒక గలాటా జరుగుతూనే ఉంది. అలాంటి పరిస్థితి ఏర్పడటానికి బాధ్యులెవరన్నది తేల్చాల్సి ఉంది. ఏడాది మొత్తంలో ఒక రోజు మాత్రమే సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం ఉంటుంది. ఆ కారణంగా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు.  సరిగ్గా అక్షయ తృతీయ రోజు జరిగే ఈ చందన యాత్రలో పాల్గొనేందుకు భారీ సంఖ్యలో భక్తులు రావడం రివాజు. అయితే గతంలో కేవలం పరిమిత భక్తులతో  మాత్రమే ఈ యాత్ర సాగేది. అయితే తరువాత తరువాత పరిస్థితి మారింది.

ఇదో వీఐపీ యాత్రగా మారిపోయింది. సాధారణ భక్తుల తాకిడికి తోడు వీఐపీల హడావుడీ అధికమైంది.  ముఖ్యంగా  పోలీస్, పొలిటికల్, జ్యుడిషరీ, దేవాదాయ, రెవెన్యూ  విభాగాల నుంచి వీఐపీల ఎక్కువైపోయింది. దీంతో సాధారణ భక్తులకు ఇబ్బందులు పెరిగిపోయాయి. దీంతో చ ందనోత్సవ సమయంలో ప్రతిఏటా సమస్యలు ఉత్పన్నమౌతూనే ఉన్నాయి. తాజా సంఘటనే తీసుకుంటే.. మంగళవారం (ఏప్రిల్ 29)అర్ధరాత్రి దాటిన తరువాత, బుధవారం (ఏప్రిల్ 30) తెల్లవారుజామున ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది.  దీంతో సాధారణ దర్శనం కోసం క్యూ లైన్ లో ముందు రోజు రాత్రి నుంచీ  వేచి ఉన్న భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.  సరిగ్గా అదే సమయంలో 300 రూపాయల టికెట్ తీసుకున్న భక్తుల క్యూ లైన్ కు  ఆనుకుని ఉన్న గోడ ఒక్కసారిగా కూలిపోయింది. ఈ గోడను ఇటీవలే తాత్కాలికంగా నిర్మించారు దీనికి బాధ్యులు ఎవరు అన్న విషయంపై చర్చ జరుగుతోంది. నిర్మాణంలో నాణ్యతా లోపం ఉందా అన్న విషయంపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. 

ఏటా చందనోత్సవం సమయంలో దేవాదాయ శాఖలో ఏదో ఒక సమస్య, ఇబ్బంది సాధారణం అయిపోయింది. ఒకసారి ఈవో కు వ్యతిరేకంగా, మరోసారి ఉద్యోగులకు వ్యతిరేకంగా సంఘటనలు జరుగుతుంటాయి. ప్రధానంగా టికెట్ల  కేటాయింపు విషయంలో  గందరగోళం నెలకొంటుంది.  సాధారణ భక్తులు డబ్బులు ఇచ్చి కొనే టికెట్ల కంటే..  ప్రోటోకాల్ టికెట్లకి ఎక్కువగా డిమాండ్ ఏర్పడుతున్నది. 
ఇక విషయానికి వస్తే..  గోడ కూలిన ఘటనలో ఏడుగురు  మృతి చెందారు ఘటనా స్థలాన్ని హోం మంత్రి అనిత పరిశీలించారు. యుద్ధ ప్రాతిపదికన సహాయ కార్యక్రమాలు సాగుతున్నాయి. బాధ్యులెవరైనా, ఎంతటి వారైనా వదిలేది లేదని హోంమంత్రి ఇప్పటికే హెచ్చరించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందజేస్తామని భరోసా ఇచ్చారు. అయితే ఈ మొత్తం వ్యవహారాన్ని గమనించినట్లైతే.. ఈ దుర్ఘటనకు ఇంజినీరింగ్ అధికారుల వైపల్యం కారణంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సింహాచలం ఆలయంలో ఇంజనీరింగ్ విభాగం నిర్లక్ష్యం చాలా వరకు ఉంటుంది మెట్ల మార్గం నిర్మాణం రోడ్ల విషయంపై కూడా చాలా వరకు విమర్శలు వినిపిస్తున్నాయి తాజా ఘటనలతో పూర్తి విచారణ జరిపించి అసలైన బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. 

ఇక సింహాచలంలో కూడా తిరుమల తరహాలో దర్శనాలు కల్పించాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. వాస్తవానికి ఈ ప్రతిపాదన గత ఏడాదే అప్పటి జిల్లా కలెక్టర్ చేశారు.  టికెట్లు ఉన్న భక్తులు మాత్రమే లోపలికి వెళ్లే రీతిన ఆటోమేటిక్ యంత్రాన్ని ఏర్పాటు చేసినట్లయితే చాలావరకు తొక్కిసలాటలు నిరోధించే అవకాశం ఉంటుంది.  ప్రధానంగా వీఐపీల పేరిట సింహాచలంలో దర్శనాలకు వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతున్నది దీనివలన ఆదాయం కోల్పోవడం మాత్రమే గాక ఇతర భక్తులు అసౌకర్యానికి గురవుతున్నారు.

Teluguone gnews banner