Read more!

కాంగ్రెస్ కు పెద్ద ఝలక్.. రేపు బీజేపీ గూటికి రాములమ్మ..! 

కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్, సినీ నటి విజయశాంతి జిహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో హఠాత్తుగా రేపు మంగళవారం ఢిల్లీ బయలుదేరుతున్నారు. ఆమె ఢిల్లీ పర్యటనలో బీజేపీ కేంద్ర కార్యాలయంలో జరిగే ఓ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆమె కాషాయ కండువా కప్పుకోనున్నారు. ఆ తరువాత ఢిల్లీలో బీజేపీ పార్టీ కేంద్ర నేతలతో ఆమె భేటీ అవుతారు. తాజాగా బీజేపీ వర్గాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ.. ఆమె ఢిల్లీ నుండి తిరిగి రాగానే, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల తరుఫున విస్తృతంగా ప్రచారం చేస్తారని తెలిపారు. అంతేకాకుండా విజయశాంతికి బీజేపీలో కీలకమైన బాధ్యతలనే అప్పగిస్తారని తెలుస్తోంది.

 

గత కొంత కాలంగా కాంగ్రెస్ కు దూరంగా ఉంటున్న రాములమ్మ, కాంగ్రెసు ప్రచార కమిటీ చైర్ పర్సన్ గా ఉన్నప్పటికీ దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారానికి కూడా దూరంగా ఉన్నారు. అదే సమయంలో ఆమె కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో ప్రత్యేకంగా మంతనాలు జరిపిన సంగతి తెలిసిందే. ఆపై తన అనుచరులతో సమావేశమైన విజయశాంతి, బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. కొంత కాలం నుండి కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం పై అసంతృప్తిగా ఉన్న విజయశాంతిని బుజ్జగించడానికి కాంగ్రెసు తెలంగాణ ఇంచార్జీ మాణిక్యం ఠాగూర్ చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదని తెలుస్తోంది.