Read more!

వేసవికాలం డయాబెటిస్ రోగులకు ప్రమాదమా?  

వేసవికాలం  వచ్చిందంటే మండే ఎండల వల్ల అందరూ ఇబ్బందులు ఎదుర్కొంటారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్దులు అసౌకర్యానికి గురవుతారు. అయితే వీరు మాత్రమే కాదు.. ఎండల ధాటికి డయాబెటిక్ రోగులకు కూడా చాలా ప్రమాదం పొంచి ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అసలు వేసవికాలంలో డయాబెటిస్ రోగులకు ఉండే ముప్పేంటి? డయాబెటిస్ రోగులు తీసుకోవల్సిన జాగ్రత్తలేంటి? తెలుసుకుంటే..

వేసవి కాలం డయాబెటిస్ రోగులపైన ప్రభావం చూపిస్తుంది. అధిక వేడి  డయాబెటిక్ రోగులకు కష్టంగా ఉంటుంది.  తరచుగా మూత్రవిసర్జన చేయాల్సి రావడం వల్ల శరీరంలో తేమను కోల్పోయే ప్రమాదం ఉంటుంది.   శరీరాన్ని చల్లగా ఉంచుకోవడంలో  ఇబ్బంది పడతారు. అందుకే ఈ  వేసవిలో  శరీర ఉష్ణోగ్రత,  చక్కెర స్థాయిలను సమతుల్యంగా ఉంచుకోవడానికి కింది టిప్స్ పాటించాలి.

పుష్కలంగా నీరు త్రాగాలి..

వేసవి కాలంలో నీరు  బెస్ట్ ఫ్రెండ్. రోజుకు కనీసం 8-10 గ్లాసుల నీరు త్రాగాలని లక్ష్యంగా పెట్టుకోవాలి.   అధిక ఉష్ణోగ్రతలు లేదా శారీరక శ్రమ కారణంగా  ఎక్కువగా చెమటలు పడుతుంటే నీరు  తీసుకోవడం పెంచాలి.

హైడ్రేటింగ్ ఆహారాలు..

ఆహారంలో దోసకాయ, పుచ్చకాయ, నారింజ,  టమోటా వంటి నీరు అధికంగా ఉండే పండ్లు,  కూరగాయలను చేర్చాలి. ఈ ఆహారాలు  హైడ్రేట్‌గా ఉంచడమే కాకుండా అవసరమైన పోషకాలను కూడా అందిస్తాయి.

కెఫీన్ ఆహారాలు వద్దు..

 కెఫిన్ కలిగిన కాఫీ, టీ, ఎనర్జీ డ్రింక్స్, శీతల పానీయాలకు దూరంగా ఉండాలి. ఇవి రక్తంలో చక్కెరపై చెడు ప్రభావాన్ని చూపి శరీరం డీహైడ్రేట్ అయ్యే ప్రమాదాన్ని పెంచుతుంది.

కాటన్ దుస్తులు..

 కాటన్ దుస్తులను ధరించాలి. తద్వారా  శరీరం చల్లగా ఉంటుంది. చెడు శరీర ఉష్ణోగ్రత  చక్కెర స్థాయిని పాడు చేస్తుంది. సన్‌బర్న్‌ను నివారించడానికి సన్‌స్క్రీన్ ఉపయోగించండి.

షుగర్ లెవెల్స్ చెక్ చేసుకోవాలి..


 రక్తంలో చక్కెర స్థాయిలను క్రమం తప్పకుండా తనిఖీ చేస్తూ ఉండాలి.  వైద్యుల సలహా ప్రకారం  మెడిసిన్  లేదా ఇన్సులిన్ మోతాదును తీసుకోవాలి.


                                                    *రూపశ్రీ.