మృగశిర కార్తె .. చేపలు తినాల్సిందే! ఫిష్ మార్కెట్లలో ఫుల్ రష్..
posted on Jun 8, 2021 9:28AM
నేటి నుంచి (జూన్ 8) నుంచి మృగశిర కార్తె ప్రారంభం కానుంది. ఆశ్విని మొదలుకుని రేవతి వరకూ మనకున్న 27 నక్షత్రాల్లో సూర్యుడి ప్రవేశం ఆధారంగా కార్తె నిర్ణయం జరుగుతుంది. చంద్రుడు ఒక్కొక్క నక్షత్రం సమీపంలో 14 రోజుల పాటు ఉంటాడు. ఏ నక్షత్రంలో సమీపంలో ఉంటే ఆ కార్తెకు ఆ పేరు పెడతారు. అశ్వినితో మొదలై రేవతితో ముగిసే వరకూ 27 నక్షత్రాల పేర్లతో కార్తెలున్నాయి. ప్రస్తుతం మృగశిర నక్షత్రానికి చేరువలో చంద్రుడు ఉండటం వల్ల దీనికి మృగశిర కార్తె అనే పేరు వచ్చింది.
ఈ క్రమంలో సూర్యుడు మృగశిర నక్షత్రంలోకి ప్రవేశించిన నాటినుంచి నైరుతి రుతుపనాలు వస్తాయి. వాతావరణం ఒక్కసారి చల్లబడటం, ప్రకృతిలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. రోహిణి కార్తెలో రోళ్లు పగిలే ఎండలతో సతమతమవుతుంటారు. కార్తెలో వచ్చే నైరుతి రుతుపవనాలతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడి ఉపశమనం కలుగుతుంది. ఈ మృగశిర కార్తెలో రైతులు ఏరువాక సాగే కాలం అని కూడా ఉంటుంటారు. ఏరువాక అంటే నాగటి చాలు. ఈ కాలంలో రుతుపవనాలు విస్తరించి తొలకరి వర్షాలు పడగనే రైతులు పొలాన్ని దున్ని పంటలు వేయడం ప్రారంభిస్తారు. మృగశిర కార్తె మొదటి రోజును దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో మృగశిర, మృగం, మిరుగు, మిర్గం అనే పేర్లతో పిలుస్తారు.
ఈ కార్తె రోజు చేపలకు ఎందుకంత ప్రాముఖ్యత..
మృగశిర కార్తె రోజున చేపలు తినడాన్ని మన పూర్వీకుల నుంచి ఆనాదిగా వస్తోంది. దీని వెనుక ఆరోగ్య రహస్యం దాగివుంది. ఎండకాలం తర్వాత వాతావరణం చల్లబడటంతో మన శరీరంలో ఉష్ణోగ్రత తగ్గుతుంది. దీంతో వేడి ఉండేందుకు చేపలను తింటారు. దీని వల్ల గుండె జబ్బులు, ఆస్తమా రోగులకు ఉపశమనం కలుగుతుంది. ఇది శాస్త్రీయంగా నిరూపించబడింది. అంతేకాకుండా ఈ కార్తె రావడంతో వర్షాలు మొదలు కానున్న నేపథ్యంలో పలు వ్యాధులు వచ్చే అవకాశాలుంటాయి. ఈ సీజన్లో చాలా మందికి జీర్ణశక్తితో పాటు రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంటుంది. జ్వరం, దగ్గు, ఇతర వ్యాధుల బారిన పడుతుంటారు. ఇలాంటి నుంచి గట్టెక్కాలంటే చేపలు తినాల్సిందే. పూర్వీకులు శాఖాపరమైన ఇంగువను బెల్లంలో కలుపుకొని ఉండలు.. ఉండలుగా చేసుకుని తినేవారు. మాంసాహారులైతే చేపలను ఇంగువలో, చింత చిరుగులో పెట్టుకుని తినేవారు. మృగశిరకార్తె రోజున ఏ ఇంటా చూసినా చేపల పులుసే. చేపల కూర వంటకాలే కనిపిస్తుంటాయి.
పంచాంగం ప్రకారం ఆరుద్ర నక్షత్రంలో సూర్యుడు ప్రవేశించే సమయంలోని తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు, శకునాలు తదితర అంశాల ఆధారంగా చేసుకుని ఆ సంవత్సరం యొక్క వర్షాన్ని నిర్ణయించడం జరుగుతుంది. ఈ విధంగా వ్యవసాయదారులకు నిత్యజీవనోపయోగిగా,వ్యవసాయం పనులకు మార్గదర్శకంగా ఈ కార్తెలు ఉపయోగపడుతున్నాయి.
పురాణగాధ ప్రకారం
మృగశిరస్సు కలిగిన మృగవ్యాధుడు అను వృతాసురుడు వరప్రభావంచే పశువులను , పంటలను హరించి వేయడం ప్రకృతి భీభత్సాలాను సృష్టించడం , వర్షాలకు అడ్డుపడటం జరుగుతూ ఉండేడిది. ఇతను చనిపోకుండా అనేక వరాలు కలిగి ఉండటంచేత ఇంద్రుడు సముద్ర హలల నుండి వచ్చే నురుగును ఆయుధంగా చేసి చంపేస్తాడు.
ప్రకృతి మార్పు ప్రభావం
ఈ కథ ఆధారంగా ఖగోళంలో ఇంద్ర నక్షత్రమైన జ్యేష్టాకు మృగశిరకు 180 డిగ్రీల దూరంలో ఉండటం వలన తూర్పు ఆకాశంలో ఇంద్ర నక్షత్రం ఉదయించగానే వృతాసుర నక్షత్రం అస్తమిస్తుంటుంది. ఇక్కడ నురుగు అనేది ఋతుపవనాలకు , వర్షాలకు సూచన. ఇంద్ర నక్షత్రమైన జ్యేష్ట ఉదయించినపుడు సూర్యుడు మృగశిరలోకి ప్రవేశించడం వలన మృగశిరకార్తె ప్రవేశిస్తుంది. వర్షాలు పడకుండా అడ్డుపడ్డ మృగాసురుని చంపిన ఇంద్రున్ని వర్షప్రదాతగా , వర్షదేవుడుగా పిలుస్తారు. ఇది కథ.
చేపలలో పోషకాలు:
1. చేపలలో ఎన్నో పోషకాలున్నాయంటున్నారు వైద్య నిపుణులు. చేపలలో అనేకమైన మాంసకృతులతో పాటు శరీరానికి మేలు చేసే గుణాలు ఎన్నో ఉన్నాయి. కాల్షియం , పాస్పరస్ , ఐరన్ , మెగ్నీషియం , కాపర్ , జింక్ వంటి ఖనిజ పోషకాలు ఎన్నో లభిస్తాయి.
2. చేపలు కొవ్వులు చాలా సులభంగాజీర్ణమై శక్తిని అందిస్తాయి. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకూ ఎవరైనా తినవచ్చు.
3. చేపల్లో ఉన్న కొవ్వు మన శరీరంలో రక్త పీడనంపై మంచి ప్రభావం చూపుతాయి.
4. ఓమేగా 3 కొవ్వు ఆమ్లాలలో డీహెచ్ఏ , ఈపీఏ వంటివి కంటి చూపునకు ఎంతో మేలు చేస్తాయి. అలాగే జ్ఞాపకశక్తిని కూడా పెంచుతాయి.
5. చేపల్లో బీ12 విటమిన్ , రైబోప్లవిన్ , నియాసిన్ , బయెటిక్ , థయామిన్ తదితర విటమిన్లు లభిస్తాయి
6. సముద్ర చేపల కాలేయంలో విటమిన్ఏ , డీ , ఈ వంటి విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి.
7. చేపలు గుండెకు సంబంధిత వ్యాధులకు , ఆస్తమా , షూగర్ వ్యాధి గ్రస్తులకు మంచి ఆహారంగా పని చేస్తుంది. ముఖ్యంగా గర్భిణులు , పిల్లల తల్లులకు ఎంతో మేలు. పిల్లల్లో జ్ఞాపకశక్తి , నాడీ వ్యవస్థ అభివృద్ధి చేస్తాయి చేపలు
8. మన రాష్ట్ర చేపల్లో కొర్రమీనులో లభించే ఆరాఖిడోనిక్ ఆమ్లం ఉంటుంది. ఇది గాయాలైనప్పుడు రక్తం తొందరగా గడ్డకట్టించే స్వభావం ఉంటుంది
9. దేశీయ మార్పు చేపల్లో ఐరన్ , కాపర్ వంటి ఖనిజ పోషకాలు ఎన్నో లభిస్తాయి. మృగశిర కార్తె రోజు చేపలను ఏ రూపంలో తిన్నా మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.
10. ప్రస్తుతం కరోనా వ్యాప్తి ఉన్నందున స్థానికంగా దొరికే పెద్ద చేపలను ఇంగువ , చింత చిగురుతో కలిపి వండుకుని తింటే ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు
11. మృగశిర కార్తెలో చేపలు తినడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి కాపాడుకోవచ్చు. ఇది శాస్త్రీయంగా నిరూపించబడింది.
12. చేపలు తినడం వల్ల ముఖ్యంగా గుండె జబ్బులు , ఆస్తమా , మధుమోహ వ్యాధి ఉన్న వారు , గర్భిణులు ఈ సమయంలో చేపలు తింటే ఎంతో ప్రయోజనం ఉంటుంది.