కోతులపై విష ప్రయోగం! తిరువణ్ణామలైలో కలకలం!
posted on Apr 25, 2020 @ 12:45PM
కరోనా నేపథ్యంలో పర్యాటక ప్రాంతాలలో కోతుల బాధలు వర్ణణాతీతం.. ఇదిలా ఉండగా మానవత్వం పూర్తిగా మరచిన కొందరు నికృష్టులు ఆకలితో అలమటిస్తున్న కోతులకు విషంపెట్టి హతమార్చడం తిరువణ్ణామలైలో కలకలం రేపింది. తిరువణ్ణామలై అటవీ ప్రాంతంలో ఓ చోట పది కోతులు మరణించి ఉండటాన్ని గిరిజనులు గుర్తించి, అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న అధికారులకు చాలా కోతులు మరణించి కనిపించాయి..
ఈ కోతులు మరణించిన ప్రాంతానికి కూత వేటు దూరంలో అరటి పండ్లు పడి ఉండటంతో వాటిని పరిశీలించగా విషం ఉన్నట్టు గుర్తించారు. ఇకపోతే ఇంతటి కిరాతకానికి ఒడిగట్టిన వారి కోసం పోలీసులు వెతుకులాట ప్రారంభించారు. ఎంత దారుణం ఆకలితో అలమటిస్తున్న కోతులకు అరటి పండులో విషం పెట్టి చంపడం.. మనుషులు రోజు రోజుకు ఎంత కౄరంగా ఆలోచిస్తున్నారు.
మరో ప్రక్క ఈ కరోనా వల్ల ఆకలితో అలమటిస్తున్న వారెందరో ఉన్నారు.. కేవలం ఈ ఆకలి మనుషులకే కాదు.. ఈ సృష్టిలోని ప్రతి ప్రాణి సొంతం.. అందుకే ఇప్పుడు ఈ ఆకలి సెగ జంతువులకు, పక్షులకు కూడా తగిలింది.. మనుషులంటే అన్నమో రామచంద్ర.. అని అడుక్కుంటారు.. ఎదోలా కడుపు నింపుకుంటారు.. కానీ మూగజీవాలు మనుషుల్లా ఆలోచించలేవు.. మోసాలు చేసి పొట్టనింపుకోవు.. పరిస్దితులు మామూలుగా ఉంటే వాటికి కూడా కాస్త ఆహారం దొరికేది. కానీ లాక్ డౌన్ వల్ల మూగ జీవాల పరిస్దితి చాలా దారుణంగా మారింది.. ప్రస్తుత పరిస్దితుల్లో ఆకలితో అన్ని జంతువులు అలమటిస్తున్నాయి.