Read more!

జ‌గ‌న్‌..! ఇక ఏడ్చేస్తాడేమో?!

నేను ఒక్క‌ చెడ్డ‌ప‌ని కూడా చెయ్య‌లేదు..! అన్నీ మంచి ప‌నులే చేశా..!! నేను నిజాయితీ ప‌రుడ్ని. ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబే అన్నీ దుర్మార్గ‌పు ప‌నులు చేస్తున్నాడు.. నా చెల్లెళ్ల‌ను నాపై ఉసిగొల్పుతున్నాడు.. ఇవీ.. ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆర్తనాదాలు. తాను క‌లియుగ హ‌రిశ్చంద్రుడిని   అని చెప్ప‌డం మిన‌హా,    ప్ర‌జ‌ల ముందు ప‌డాల్సిన క‌థ‌ల‌న్నీ ప‌డేశాడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి. ఐదేళ్ల పాల‌న‌పై ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతున్న నేప‌థ్యంలో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని ఓట‌మి భ‌యం ప‌ట్టుకుంది.   స‌ర్వేల‌న్నీ బీజేపీ, జ‌న‌సేన‌, టీడీపీ కూట‌మికే జై కొడుతుండ‌టంతో జ‌గ‌న్ శిబిరం కంగారెత్తిపోతున్నది. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో అధికారంలోకి వ‌చ్చేందుకు జ‌గ‌న్, ఆయ‌న వ‌ర్గీయులు చేసిన పాపాలు అన్నీఇన్నీకావు.. ఏకంగా బాబాయ్ హ‌త్య‌, కోడి క‌త్తి  దాడి.. ఇలా చాలానే ఉన్నాయి. పోనీ ఇన్ని చేసి అధికారం దక్కించుకున్న తరువాత పాలన అయినా సక్రమంగా  సాగించారా అంటే అదీలేదు.. అమ‌రావ‌తి రాజ‌ధాని రైతుల‌ను రోడ్డున ప‌డేశారు. అంతెందుకు ఉన్న కంపెనీల‌ను పంపించేసి నిరుద్యోగుల‌కు ఉపాధి లేకుండా చేశారు. ఫ‌లితంగా చిన్న‌చిన్న ప‌నుల‌కోసం సైతం ఏపీ ప్ర‌జ‌లు హైద‌రాబాద్ బాట ప‌డుతున్నారంటే ఏపీలో   ప‌రిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. చంద్రబాబు హయాంలో అమరావతి నిర్మాణం జరుగుతున్న సమయంలో హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున వలసలు ఉండేవి. ఇప్పుడా పరిస్థితి రివర్స్ అయ్యింది.  వీట‌న్నింటిని వ‌దిలేసిన జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి. అన్నీ వేదాల్లోనే ఉన్నాయష.. అన్నట్లుగా అన్నిటికీ  చంద్రబాబే కారణమని జనం ముందు ప్రసంగాలు ఇస్తున్నారు.  

వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అధికారంలో ఉన్న‌న్నిరోజులు బ‌య‌ట‌కు రావాలంటే ప‌ర‌దాలు కట్టుకుని జనానికి ముఖం చూపకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకోవలసిన పరిస్థితి. అయితే ఇప్పుడు  ఎన్నిక‌ల స‌మ‌యం కావ‌డంతో ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని జ‌గ‌న్‌ ప్రారంభించాడు. మేమంతా సిద్ధం పేరుతో బ‌స్సు యాత్ర చేప‌ట్టిన జ‌గ‌న్.. ప్రొద్దుటూరులో ప్ర‌జ‌ల‌నుద్దేశించి మాట్లాడారు. జ‌గ‌న్ ప్ర‌సంగం మొత్తం.. క‌లియుగ స‌త్య హ‌రిశ్చంద్రుడిని నేనే అని డ‌బ్బాకొట్టుకోవ‌డానికి పరిమితమైంది.  ఐదేళ్ల కాలంలో చేసిన అభివృద్ధిని చెప్ప‌కుండా.. నేను మీ బిడ్డ‌ను.. అంద‌రూక‌లిసి నాపై దండ‌యాత్ర చేస్తున్నారు.. మీరే న‌న్ను కాపాడాలి అంటూ ప్ర‌జ‌ల‌ను  దీనంగా జ‌గ‌న్ అభ్య‌ర్ధించారు. ఐదేళ్ల పాల‌న‌పై ఆగ్రహంతో ఉన్న ప్ర‌జ‌ల‌ను సానుభూతి అస్త్రంతో త‌న‌వైపుకు తిప్పుకునే ప్ర‌య‌త్నం చేశారు. బాబాయ్ హ‌త్య‌కేసు విష‌యంపై మాట్లాడిన జ‌గ‌న్‌.. తన వాళ్ల‌నే చంద్ర‌బాబు తన మీద ఉసిగొల్పుతున్నారంటూ ప్ర‌జ‌ల ముందు క‌న్నీరు పెట్టుకునంత ప‌నిచేశాడు. వివేకానందను అన్యాయంగా, అతిదారుణంగా చంపారు.. ఆ హంత‌కులెవ‌రో ఆ దేవుడికి, ఈ జిల్లా ప్ర‌జ‌ల‌కు తెలుసు.. అని చెప్పిన జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి.. వారి పేర్ల‌ను మాత్రం చెప్ప‌లేదు. 

గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో బాబాయ్ హ‌త్య‌కు కార‌ణం చంద్ర‌బాబే అంటూ మొత్తుకున్న జ‌గ‌న్‌.. అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత బాబాయ్ హ‌త్య‌కేసును ఎందుకు సీరియ‌స్ గా తీసుకోలేద‌నే విష‌యాన్ని మాత్రం జ‌గ‌న్ త‌న ప్ర‌సంగంలో  ఎక్కడా పొరపాటున కూడా ప్ర‌స్తావించ‌లేదు. త‌న ఇద్ద‌రు చెల్లెళ్లు, సీబీఐ అధికారులు వివేకా హ‌త్య‌కేసులో కీల‌క ముద్దాయి వైసీపీ ఎంపీ అవినాశ్  రెడ్డి అని బ‌హిరంగంగానే చెబుతున్నారు.  సీబీఐ అధికారులు అవినాష్ రెడ్డిని అరెస్టు చేసేందుకు   క‌డ‌ప వెళ్లారు.. బాబాయ్ పై జ‌గ‌న్ కు నిజంగా ప్రేముంటే అవినాశ్ అరెస్టును ఎందుకు అడ్డుకోవాల్సి వ‌చ్చింద‌నే విష‌యంపై ప్ర‌జ‌లకు చెప్పేందుకు జ‌గ‌న్ సాహ‌సించ‌లేదు. కేవ‌లం అభాండాలు వేయ‌డమే తన పని అన్నట్లుగా జగన్ తీరు ఉందని జనం బాహాటంగానే అంటున్నారు త‌న ఇద్ద‌రు చెల్లెళ్ల‌ను చంద్ర‌బాబు త‌న‌పై ఉసిగొల్పుతున్నాడ‌ని జ‌గ‌న్ పేర్కొనడం విడ్డూరంగా ఉంద‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతున్నది. ష‌ర్మిల‌, సునీత‌లు అడిగే ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్ప‌లేక వారిని కూడా చంద్ర‌బాబు మ‌నుషులుగా వైసీపీ నేత‌లు చిత్రీక‌రించే ప్ర‌య‌త్న చేస్తూ వ‌చ్చారు. తాజాగా జ‌గ‌న్ కూడా త‌న ప్రంస‌గంలో అదే విష‌యాన్ని ప్ర‌స్తావించ‌డం జ‌గ‌న్ లో ఓట‌మి భ‌యాన్ని బ‌య‌ట‌పెట్టింది. ఇన్నాళ్లు చెల్లెళ్లు రోడ్డెక్కి మొత్తుకుంటున్నా క‌నీసం మాట‌ కూడా మాట్లాడ‌ని జ‌గ‌న్‌  ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌జ‌ల ఓట్లు కావాలి కాబ‌ట్టి సానుభూతికో సం అంతా చంద్ర‌బాబే చేస్తున్నారని చెప్ప‌డం వైసీపీ నేత‌ల‌ను సైతం ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. జ‌గ‌న్ చెల్లెళ్లు అడిగే ప్ర‌శ్న‌ల‌కు ముందు స‌మాధానం చెప్పిన త‌రువాత చంద్ర‌బాబు పేరు ఎత్తితే బాగుంటుంద‌ని   విశ్లేష‌కులు సూచిస్తున్నారు.  

ఇటీవ‌ల విశాఖ తీరంలో దొరికిన డ్ర‌గ్స్ కేసుపైనా జ‌గ‌న్‌ స్పందించాడు. డ్ర‌గ్స్ తో ఉన్న కంటైన‌ర్ లో పేర్కొన్న అడ్ర‌స్సు చంద్ర‌బాబు వ‌దిన చుట్టం కంపెనీది అంటూ జ‌గ‌న్ అన్నాడు. అయితే, ఆ కంపెనీ వాళ్లు వైసీపీ నేత‌ల‌ని, ఇటీవ‌ల సంక్రాంతి పండుగ‌కు వాళ్లు జ‌గ‌న్ ఫొటోతో కూడిన ఫ్లెక్సీల‌ను ఎందుకు వేయించార‌నే విష‌యంపై మాత్రం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నోరువిప్ప‌క పోవ‌టం గ‌మ‌నార్హం. త‌న‌పై, త‌న వ‌ర్గీయుల‌పై వ‌చ్చే ప్ర‌తీ ఆరోప‌ణ‌ను చంద్ర‌బాబు చేసేదే అని చెప్ప‌డం మిన‌హా బ‌స్సు యాత్ర ప్ర‌సంగంలో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మాట్లాడింది పెద్ద‌గా ఏమీలేద‌నే చెప్పొచ్చు. ఎన్నిక‌ల స‌మ‌యంలో కేవ‌లం ప్ర‌జల సానుభూతికోసం  జ‌గ‌న్ పాకులాడిన‌ట్లు క‌నిపించింది. మొత్తంగా చెప్పాలంటే.. క‌న్నీళ్లు పెట్ట‌డం త‌ప్పితే అన్ని విన్యాసాలు ప్ర‌జ‌ల ముందు జ‌గ‌న్ చేశాడ‌ని చెప్పొచ్చు.