బాబు పకడ్బందీ వ్యూహం.. గన్నవరం వంశీకి దూరం!
posted on Apr 20, 2024 @ 9:52AM
రాజకీయ ప్రత్యర్థులపై తిట్ల దండకంతో విరుచుకుపడే వైసీపీ ఆస్థాన విద్వాంసుల్లో వల్లభనేని వంశీ ఒకరు. 2 014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా విజయం సాధించిన వంశీ.. ఆ తరువాత అధికార వైసీపీకి మద్దతు తెలుపుతూ జగన్ శిబిరంలో చేరారు. ప్రస్తుత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా మళ్లీ గన్నవరం నియోజకవర్గం నుంచే పోటీ చేస్తున్నారు. గత రెండు దఫాలుగా తెలుగుదేశం క్యాడర్ మద్దతుతో గెలిచిన ఆయనకు ఈసారి ఘోర ఓటమి ఎదురు కాబోతున్న దన్న చర్చ ఏపీ రాజకీయాల్లో జోరుగా సాగుతోంది. ఈ నియోజకవర్గం నుంచి కూటమి తరపున తెలుగుదేశం అభ్యర్థి యార్లగడ్డ వెంకటరావు పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో యార్లగడ్డ వైసీపీ అభ్యర్థిగా వంశీ చేతిలో స్వల్ప ఓట్లతో ఓడిపోయారు. వంశీ జగన్ శిబిరంలో చేరడంతో.. యార్లగడ్డ వెంకట్రావు తెలుగుదేశంలో చేరారు. తెలుగుదేశంలో చేరిన నాటినుంచి నియోజకవర్గంలోని పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు యార్లగడ్డ అందుబాటులో ఉంటూ వస్తున్నారు. మొదటి నుంచి గన్నవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. దీనికితోడు వంశీని ఓడించేందుకు చంద్రబాబు పకడ్బందీ వ్యూహాన్ని అమలు చేశారని, దీంతో యార్లగడ్డ విజయం నల్లేరుపై బండినడకేననిపరిశీలకులు విశ్లేషిస్తున్నారు. నియోజకవర్గంలో ప్రముఖ సంస్థలు నిర్వహించిన సర్వేలో మరోసారి ఇక్కడ తెలుగుదేశం విజయం ఖాయమని పేర్కొన్నాయి.
గన్నవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. 1983 తరువాత ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగురుతూ వస్తుంది..మధ్యలో రెండు సార్లు ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలిచినప్పటికీ వారుకూడా టీడీపీ సానుభూతి పరులే కావటం గమనార్హం. ప్రస్తుతం గన్నవరంలో వంశీని భారీ మెజార్టీతో ఓడించాలని తెలుగుదేశం శ్రేణులు, చంద్రబాబు అభిమానులు పట్టుదలతో ఉన్నారు. వల్లభనేని వంశీకి వైసీపీలో చేరిన తరువాత తెలుగుదేశం నేతలపై నోరుపారేసుకోవటం అలవాటుగా మారింది. ఈ క్రమంలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిపై వల్లభనేని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం శ్రేణులు, నారా, నందమూరి కుటుంబాల అభిమానులు వంశీపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. దీనికితోడు నియోజకవర్గంలోవంశీకి మద్దతుగా నిలిచేందుకు పలువురు వైసీపీ నేతలుసైతం వెనుకడుగు వేస్తుండటం గమనార్హం. వంశీ క్యారెక్టర్ లేని వ్యక్తిఅని, రాజకీయ భిక్షపెట్టిన చంద్రబాబు నాయుడు కుటుంబంపైనే అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఆయనకు మద్దతు తెలిపితే ప్రజలు మమ్మల్నికూడా క్షమించరని కొందరు వైసీపీ నేతలు బహిరంగంగానే పేర్కొటున్నారు.
గన్నవరం నియోజకవర్గం ప్రజల నుంచి వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గత ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థిగా వల్లభనేని వంశీ విజయం సాధించి వైసీపీలోకి వెళ్లినప్పటికీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో విఫలమయ్యారని ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. వైసీపీలో చేరిన తరువాత నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కనీసం పట్టించుకున్న దాఖలాలు లేవని పలువురు వైసీపీ నేతలే ఆగ్రహం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. దీంతో ప్రచారంలో భాగంగా ప్రజల వద్దకు వెళ్లిన వంశీని పలువురు సమస్యలపై నిలదీస్తున్నారు. ఈ నియోజకవర్గంలో ఎస్సీ, కాపు సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువ. ఎవరు విజయం సాధించాలన్నా ఈ రెండు సామాజిక వర్గాల ఓట్లు కీలకం. తెలుగుదేశం, జనసేన కలిసి పోటీచేస్తుండటంతో మెజారిటీ కాపుసామాజిక వర్గ ఓటర్లు తెలుగుదేశం అభ్యర్థి యార్లగడ్డకు మద్దతు నిలుస్తున్నారు. ఎస్సీలు అధికశాతం తెలుగుదేశంకు మద్దతుగా ఉన్నారు. అలాగే బీసీలు సైతం కూటమికే జై కొడుతున్నారు. కమ్మ సామాజిక వర్గం ఓటర్లు వంశీపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. చంద్రబాబు కుటుంబంపై వ్యాఖ్యల నేపథ్యంలో వంశీకి ఈ ఎన్నికల్లో గట్టి గుణపాఠం చెప్పేందుకు వారంతా ఏకతాటిపైకి వచ్చినట్లు సమాచారం.
సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ కు ముందు కొంతకాలంగా వల్లభనేని వంశీ రాజకీయాల్లో యాక్టివ్ గా లేరు. వైసీపీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డి విడతల వారిగా అభ్యర్థులను ప్రకటించారు. చివరి వరకు వల్లభనేని వంశీకి అవకాశం దక్కలేదు. వైసీపీ నుంచి పోటీచేస్తే ఓడిపోతానని భావించిన వంశీ.. తాను ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటానని జగన్ కు చెప్పినట్లు అప్పట్లో ప్రచారం కూడా జరిగింది. అయితే జగన్ ప్రోద్బలంతో పోటీకి ఒప్పుకోవటంతో చివరి విడతలో గన్నవరం అభ్యర్థిగా వంశీ పేరును వైసీపీ అధిష్టానం ప్రకటించింది. వారంరోజుల క్రితం జగన్ బస్సు యాత్ర గన్నవరం నియోజకవర్గంలో సాగింది. అయితే , బస్సు యాత్రలో ఆశించిన స్థాయిలో ప్రజలు పాల్గొనలేదని నియోజకవర్గం పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతున్నది. రాజకీయ బిక్షపెట్టిన చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులపై వల్లభనేని వంశీ చేసిన వ్యాఖ్యల పట్ల నియోజకవర్గంలోని ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. దీంతో వల్లభనేని వంశీకి ఓటు ద్వారా గుణపాఠం చెప్పేందుకు ప్రజలంతా సిద్ధమైనట్లు ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. మొత్తానికి ఎటుచూసినా ఈదఫా ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ ఓటమి ఖాయమని ప్రముఖ సర్వే సంస్థలు సైతం తేల్చాయి.