Read more!

వ‌డ్లు కొనకుంటే యుద్ధమే..! మోడీనే తేల్చుకోవాలన్న కేసీఆర్

రైతుల‌కు వ్య‌తిరేకంగా కేంద్రం తీసుకుంటున్న నిర్ణ‌యాల‌పై తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. ఒక‌టే మాట‌.. ఏం జ‌రుగుతోంది. ఏంది గ‌డ‌బిడి ఇది. లొల్లి ఏంది అస‌లు. ఒక‌టే ఒక మాట‌. సాఫ్‌ సీదా ముచ్చ‌ట‌. తెలంగాణ‌లో పండించే వ‌డ్లు కొంట‌రా..? కొన‌రా..? అది చెప్ప‌మంటే.. మేం మ‌రాఠీలో అడిగామా? ఉర్దూలో అడిగామా? అర్థం కాని భాషలో అడిగామా? అని కేసీఆర్ ప్ర‌శ్నించారు. ఇందిరా పార్క్ వ‌ద్ద టీఆర్ఎస్ చేప‌ట్టిన రైతు మ‌హాధ‌ర్నాలో కేసీఆర్ ప్ర‌సంగించారు.

బీజేపీ నాయ‌కులు వంక‌ర టింక‌ర మాట‌లు మాట్లాడుతున్నారు. ఈ గోస ఒక తెలంగాణ‌లోనే లేదు. భార‌త‌దేశం మొత్తంలో ఉంది. ఒక ఏడాది కాలం నుంచి ఢిల్లీ స‌రిహ‌ద్దుల్లో వేల ల‌క్ష‌ల మంది రైతులు వ‌రుస నిరాహార ధీక్ష‌లు చేస్తున్నారు. పంట‌లు పండించే శ‌క్తి లేక కాదు. కేంద్రం తెచ్చిన చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా రైతులు నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నారు. మ‌ద్ద‌తు ధ‌ర ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తున్నారు. కేంద్రం త‌న విధానాలు మార్చుకోకుండా అడ్డ‌గోలుగా మాట్లాడుతోంది. ఈ దేశాన్ని న‌డ‌ప‌డంలో అన్ని పార్టీల ప్ర‌భుత్వాలు దారుణంగా విఫ‌లం చెందాయి. పంట‌లు కొన‌డానికి మీకు భ‌యం అవుతుంది. బాధ అవుతుంది. అడ్డ‌గోలుగా మాట్లాడ‌టం కాదు.. గ్లోబ‌ల్ హంగ‌ర్ ఇండెక్స్‌లో భార‌త్ 101వ స్థానంలో ఉంది. ఇంత‌క‌న్న సిగ్గుచేటు ఏమైనా ఉంట‌దా? దేశంలో 12 కోట్ల మంది రైతుల ఉన్నారు. 40 కోట్ల ఎక‌రాల వ్య‌వ‌సాయ భూమి ఉంది. అద్భుత‌మైన న‌దులున్నాయి. బంగారు పంట‌లు పండే అవ‌కాశాలు ఉన్నాయి. దాదాపు సగం మంది వ్య‌వ‌సాయ రంగంపై ఆధార‌ప‌డి బ‌తుకుతున్నారు అని సీఎం కేసీఆర్ తెలిపారు.

మేం రాష్ట్రం తెచ్చుకుని, చెరువుల‌ను బాగు చేసుకుని, చెక్‌డ్యాంలు క‌ట్టి, క‌రెంట్ ఇచ్చి రైతుల‌ను బాగు చేసుకున్నాం. పంట‌లు పండించుకున్నాం. ఆ ధాన్యాన్ని కొనుగోలు చేసే బాధ్య‌త కేంద్రానిదే. కానీ నిర్ల‌క్ష్యం వ‌హిస్తోంది. రైతాంగాన్ని కాపాడాల్సిన అవ‌స‌రం ఉంది. హంగ‌ర్ ఇండెక్స్‌లో భార‌త్ ఆక‌లి రాజ్యం అని తెలుస్తోంది. దేశంలో ఏ మూల‌లో ఆహార కొర‌త ఉందో స‌మ‌న్వయం చేయాలి. అవ‌స‌ర‌మైతే డ‌బ్బులు ఖ‌ర్చు పెట్టి ఆహారం అందించాలి. స‌మ‌స్య ఉన్న‌దంతా కేంద్రం వ‌ద్దే. కేంద్రం మీద యుద్ధం ప్రారంభ‌మైంది. ఉత్త‌ర భార‌త రైతాంగం కేంద్రానికి నిర‌స‌న వ్య‌క్తం చేస్తోంది. రైతుల జీవితాల‌పై చెల‌గాట‌మాడుతోంది. కార్ల‌తో తొక్కి చంపుతోంది. ఇవాళ తెలంగాణ రైతుల‌పై బీజేపీ నేత‌లు క‌న్నేశారు. కొనుగోలు కేంద్రాల వ‌ద్ద విధ్వంసం సృష్టిస్తున్నారు. రైతుల‌ను బ‌త‌క‌నిస్తారా? బ‌త‌క‌నివ్వారా? అని కేసీఆర్ ప్ర‌శ్నించారు. దిక్కు మాలిన కేంద్ర ప్ర‌భుత్వం విధానాల వ‌ల్లే రైతులు న‌ష్ట‌పోతున్నారు. వ‌డ్లు వేయాలి.. మెడ‌లు వంచి కొనిపిస్తాం అని బీజేపీ నేత‌లు అంటున్నారు. ఈ దేశాన్ని పాలించే బీజేపీ అడ్డ‌గోలు అబ‌ద్ధాలు మాట్లాడుతున్నారు. ఫేస్ బుక్‌, వాట్సాప్‌ల‌లో వితండ‌వాదాలు సృష్టిస్తున్నారు అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.