కేసీఆర్ ను ఆహ్వానిస్తా.. చంద్రబాబు

 

తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం తనకు లేదని.. జరగబోయే గోదావరి పుష్కరాలకు కేసీఆర్ ను కూడా ఆహ్వానిస్తానని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. జపాన్ పర్యటన అనంతరం ఆయన నిన్న కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పైవిధంగా వ్యాఖ్యానించారు. కాగా రెండు రాష్ట్రాల మధ్య కొన్ని సమస్యలు ఉన్నాయని.. కలిసి కూర్చొని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారమవుతాయని.. కేసీఆర్ తో కూర్చొని మాట్లాడటానికి తానెప్పుడూ సిద్ధమేనని స్పష్టం చేశారు. నిన్నగాక మొన్న ‘నీకిక్కడేం పని’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారని, హైదరాబాద్ 10 ఏళ్లపాటు రెండు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని అని కేసీఆర్ గుర్తుంచుకోవాలని సూచించారు. అయితే గవర్నర్‌ను బదిలీ చేయాలని కోరారా అని ప్రశ్నించగా, అసలు గవర్నర్ విషయం ఎందుకు ప్రస్తావన వస్తుందని ప్రశ్నించారు. సెక్షన్ 8 పై మాట్లాడానని అంతే కాని గవర్నర్ గురించి ఏం మాట్లాడలేదని వివరణ ఇచ్చారు. ఇదిలా ఉండగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ లో చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందించి.. పవన్‌ కల్యాణ్‌ ప్రత్యేక హోదా గురించి మాట్లాడారు.. కానీ ఇలాంటి సమయంలో సంయమనం పాటించాలి.. ఎందుకంటే రాష్ట్రం విడిపోయిన తరువాత ఏపీ ఆర్ధికంగా చాలా నష్టపోయిందని.. రాజధానిని నిర్మించుకోవాలి.. దానికోసం పెట్టుబడులు రావాల్సిన అవసరం ఉంది.. ఇవన్నీ జరగాలంటే కొంత సమయం పడుతుంది.. ఇది ఒక్కరివల్ల అయ్యే పనికాదు అందరి సహకారం తీసుకొని వీలైనంత త్వరగా సమస్యల నుండి బయటపడాలని అన్నారు. సమస్యలు పరిష్కారం కావడంపై దృష్టి కేంద్రీకరించకుండా జఠిలం చేసుకోవడానికి ఒక్క నిమిషం పట్టదు అని అన్నారు. తాను ఏపీ అభివృద్ధికి శాయశక్తుల కృషిచేస్తుంటే కొందరు మాత్రం దానిని అడ్డుపడటానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.

Teluguone gnews banner