Read more!

చెన్నారెడ్డి కి నివాళులర్పించని కిరణ్ ?

 

 

రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి 16 వ వర్ధంతికి నివాళులర్పించడానికి ప్రస్తుత ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి సమయం దొరకలేదా లేక కావాలని ఆ కార్యక్రమానికి హాజరు కాలేదా?

 

తాను ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రిని స్వయంగా ఆహ్వానించానని శాసనసభ్యుడు, ప్రకృతి వైపరీత్యాల కమిటీ ఉపాధ్యక్షుడు మర్రి శశిధర్ రెడ్డి మీడియాతో అన్నారు. కేంద్ర మంత్రి హోదాలో ఉన్న తాను స్వయంగా పిలిచినా కిరణ్ రాకపోవడాన్ని శశిధర్ రెడ్డి తీవ్రంగా పరిగణిస్తున్నారు. అయితే, శాసనసభ కార్యక్రమాల వల్ల కిరణ్ ఇందిరా పార్కు వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి హాజరు కాలేక పోయారని కిరణ్ శిబిరం వెల్లడించింది.



రాష్ట్రంలో ముఖ్య మంత్రి పదవి నుండి కిరణ్ ను తొలగించాలని శశిధర్ రెడ్డి ఢిల్లీలో ప్రచారం చేస్తున్నారని కిరణ్ శిబిరం అభిప్రాయంతో ఉంది. శశిధర్ రెడ్డితో విభేదాలుండడం వల్లే కిరణ్ ఈ కార్యక్రమానికి హాజరు కాలేదని భావిస్తున్నారు.



రాష్ట్ర శాసనసభ స్పీకర్, పిసిసి అధ్యక్షుడు, అనేక మంది మంత్రులు పాల్గొన్న ఈ కార్యక్రమానికి కిరణ్ ఒక్కడే  హాజరు కాకపోవడం కచ్చితంగా హై కమాండ్ దాకా వెళ్లి ఉంటుందనేది మాత్రం స్పష్టం. రాజకీయంగా అభిప్రాయబేధాలెలా ఉన్నా, ముఖ్య మంత్రి స్థాయి వంటి వ్యక్తి మరో ముఖ్యమంత్రి వర్ధంతి  కార్యక్రమానికి  నగరంలో ఉండి కూడా హాజరు కాకపోవడం మాత్రం పలు విమర్శలకు తావిస్తోంది.