క్యాట్లో జగన్కు ఝలక్ తప్పదా? ఐపీఎస్లు ఏమంటున్నారు?
posted on Feb 11, 2020 @ 11:21AM
కమ్మ అధికారులు, ఉద్యోగులపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రతిపక్షంలో ఉండగా కమ్మ అధికారులపై తీవ్ర ఆరోపణలు చేయడమే కాకుండా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేసిన జగన్మోహన్ రెడ్డి... ఇఫ్పుడు అధికారంలోకి వచ్చాక తన కసి తీర్చుకుంటున్నారని అంటున్నారు. ముఖ్యంగా ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వర్రావును సస్పెండ్ చేయడం వెనుక... అతనిపై జగన్మోహన్ రెడ్డికున్న తీవ్రమైన కోపమే కారణమంటున్నారు. సెక్యూరిటీ ఎక్విప్ మెంట్ కొనుగోళ్లలో అవకతవకలకు పాల్పడ్డారని, అలాగే కాండక్టు రూల్స్ ధిక్కరించారంటూ రూల్ 3(1) కింద ఏబీ వెంకటేశ్వర్రావును జగన్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అయితే, ప్రభుత్వ వాదన.... క్యాట్ లో నిలబడదనే మాట వినిపిస్తోంది. జగన్ సర్కారు మోపిన అభియోగాలు కోర్టులో నిలబడవంటున్నారు.
ఎందుకంటే, చంద్రబాబు హయాంలో సుమారు 22కోట్ల రూపాయలతో కేంద్రం అనుమతితో కొనుగోలు చేసిన సెక్యూరిటీ ఎక్విప్ మెంట్ కోసం ఏర్పాటు చేసిన రెండు కమిటీల్లో ఏబీ వెంకటేశ్వర్రావు సభ్యుడిగా లేకపోవడం అతనికి కలిసొస్తుందని అంటున్నారు. పైగా అప్పటి బాబు ప్రభుత్వం గ్లోబల్ టెండర్లు ఆహ్వానించి కాంట్రాక్టు అప్పగించింది. అందువల్ల ఏబీవీపై సస్పెన్షన్ చెల్లదని అంటున్నారు. అసలు ఎక్విప్ మెంట్ కొనుగోళ్ల కమిటీల్లో సభ్యుడిగా లేడు.... పైగా అవి గ్లోబల్ టెండర్లు... అలాంటప్పుడు ఏబీ వెంకటేశ్వర్రావును ఎలా సస్పెండ్ చేస్తారని ప్రశ్నిస్తున్నారు.
ఇక, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి ఏబీ వెంకటేశ్వర్రావుకు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిన వైసీపీ సర్కారు, ఇప్పుడు ఏకంగా సస్పెండ్ చేసి కసి తీర్చుకున్నారని అంటున్నారు. ఎనిమిది నెలలుగా ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా వెయిటింగ్ లో పెట్టడమే కాకుండా జీతం కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిన జగన్ ప్రభుత్వం... ఇప్పుడు ఏకంగా సస్పెండ్ చేయడం దారుణమంటున్నారు. ఒకవేళ నిజంగానే అవకతవకలు జరిగి ఉంటే పోస్టింగ్ లో ఉండగానే చర్యలు తీసుకోవాల్సిందని అంటున్నారు. కావాలనే కక్షపూరితంగా ఏబీవీని సస్పెండ్ చేశారని తోటి ఐపీఎస్ లు వ్యాఖ్యానిస్తున్నారు. తన వేతనం ఇవ్వాలంటూ ఏబీ వెంకటేశ్వర్రావు ప్రభుత్వానికి రెండుసార్లు దరఖాస్తు చేసుకున్నారని, దీన్ని బట్టే ఎంతలా ఏబీవీని వేధించారో అర్ధమవుతోందంని అంటున్నారు.