వైఎస్ జగన్ మళ్లీ ఢిల్లీ టూర్.. ఆసక్తిరేపుతోన్న ఏపీ రాజకీయాలు!
posted on Feb 13, 2020 @ 3:48PM
ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. నిన్ననే ప్రధానిని కలిసిన సీఎం జగన్ రేపు మరోసారి ఢిల్లీ వెళ్ళి ప్రముఖ నేతలను కలవనున్నట్లు తెలుస్తోంది. పీఎం మోడీని కలిసిన రోజునే వైఎస్ జగన్.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి మూడు రాజధానుల అంశం, మండలి రద్దు వంటి అంశాలపై చర్చిస్తారని అంతా భావించారు. కానీ.. నిన్న ప్రధాని మోదీని కలవడం.. ఆ తర్వాత కేంద్ర హోమంత్రి అమిత్ షా అపాయింట్ మెంట్ ఖరారు కాకపోవడంతో ఏపీకి వెనుతిరిగారు వైఎస్ జగన్.
పీఎం మోదీని కలిసిన వైఎస్ జగన్ మూడు రాజధానుల అంశంపై ప్రధానంగా చర్చించారు. అలాగే.. పూర్తి వివరాలతో వినతి పత్రాన్ని కూడా అందించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. అవే అంశాలను ఇప్పుడు అమిత్ షాతో కూడా చర్చించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే వైఎస్ జగన్ ఇంకా ఎవరిని కలవబోతున్నారు.. ఎటువంటి అంశాలను చర్చించబోతున్నారనే దానిపై రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ప్రధాని మోదీకి ఇచ్చిన నివేదిక కాకుండా ఇంకా ఏయే విషయాలపై అమిత్ షాతో చర్చించనున్నారు అనేదానిపై సర్వత్రా ఆశక్తి నెలకుంది.
రేపు సాయంత్రం ఆరు గంటలకు ముఖ్య మంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ చేరుకొని ఏడు గంటలకు అమిత్ షాతో అపాయింట్ మెంట్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మూడు రాజధానుల అంశంతో పాటు ఇప్పటికే వికేంద్రీకరణ బిల్లు ప్రవేశ పెట్టిన నేపథ్యంలో మూడు రాజధానులకు సంబంధించి బిజెపిలో అసమ్మతి నెలకొన్న విషయం తెలిసిందే. అలాగే.. ఇప్పుడు ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున చేపడుతుంది ఏపీ ప్రభుత్వం. ఉగాది నాటికి ఇరవై ఐదు లక్షల ఇళ్ళ స్థలాలు ఇచ్చే కార్యక్రమాన్ని ఇప్పటికే ఏపీ ప్రభుత్వం చేపట్టింది. దీంతో ఈ కార్యక్రమానికి ఇప్పటికే మోడీని ఆహ్వానించిన నేపధ్యంలోనే అమిత్ షాను కూడా ఆహ్వానించే యోచనలో ఏపీ ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. కాగా రాజకీయపరంగా ఈ భేటీలకు సంబంధించి ఇప్పటికే టీడీపీ కొన్ని విమర్శలను చేస్తుంది. ఇప్పటికే యనమల రామకృష్ణుడు పలు రకాల విమర్శలు గుప్పించారు. దీంతో ఇప్పుడు అమిత్ షాతో భేటీ ఏ విధంగా చూస్తారనేది చూడాలి.