టీఆర్ఎస్ లో సీఎల్పీ విలీనం.. ఒకేసారి 12 మంది ఎమ్మెల్యేలు జంప్

  సీఎల్పీని టీఆర్ఎస్ లో విలీనం చేయాలంటూ హస్తం గుర్తుపై గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలు గురువారం తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు. ఈమేరకు 12 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని స్పీకర్‌కు అందజేశారు. తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 19 మంది ఎమ్మెల్యేలు హస్తం గుర్తుపై గెలిచారు. ఇప్పటికే ఆ 19 మందిలో 11 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ పార్టీని వీడి టీఆర్ఎస్ లో చేరనున్నట్లు బహిరంగంగా ప్రకటించారు. తాజాగా తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి కూడా ఈ జాబితాలో చేరారు. ప్రగతిభవన్‌లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసి టీఆర్ఎస్ లో చేరికపై చర్చించారు. దీంతో సీఎల్పీని టీఆర్ఎస్ లో విలీనం చేసేందుకు అవసరమై మెజార్టీ సమకూరింది. సీఎల్పీని టీఆర్ఎస్ లో విలీనం చేయాలంటే మూడింట రెండొంతుల మెజార్టీ అవసరం. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఎంపీగా గెలుపొందడంతో తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీంతో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల సంఖ్య 18కి పడిపోయింది. ఇక 18 మంది ఎమ్మెల్యేల్లో మూడింట రెండొంతులంటే 12 మంది సంఖ్యాబలం ఉంటే చాలు. ఈ నేపథ్యంలో 12 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల సంతకాలతో  కూడిన లేఖను సభాపతికి అందజేశారు. ఇప్పుడు కాంగ్రెస్‌ బలం ఆరుకు పడిపోయింది. దీంతో వీరికంటే ఎక్కువగా ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్న ఎంఐఎంకు ప్రతిపక్ష హోదా దక్కే అవకాశం ఉంది.

అందుకే పవన్ ఓడిపోయాడు.. ఇలాంటివి బయటికి తెలియవు

  సినీ నటుడు, వైసీపీ నేత పృథ్వీరాజ్ తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నికల ఫలితాలపై తన అభిప్రాయాలు వెల్లడించారు. ఎన్నికల్లో ఓటమి అనంతరం చంద్రబాబు ఏం చేస్తారన్నది ఆయనే తేల్చుకోవాలని.. వాళ్ల ఇంట్లో ఏం వండుకుంటున్నారు? ఏ కాఫీ పెడుతున్నారు? అనేది ఇక అనవసర విషయం అని పృథ్వీ అభిప్రాయపడ్డారు. పసుపు-కుంకుమ ఆదుకుంటుందని, 90 లక్షల మంది మహిళలు ఓట్లేస్తారని చంద్రబాబు నమ్మారని, కానీ ప్రజలు 'బైబై బాబు' అంటూ వీడ్కోలు పలికారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం కొలువైన తరుణంలో కూడా ఇంకా చంద్రబాబు గురించి మాట్లాడుకోవడం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు. ఇకమీదట టీడీపీలో ఏం జరుగుతుంది? వాళ్ల కార్యాచరణ ఏమిటి? వంటివన్నీ కూడా వాళ్లకు సంబంధించిన విషయాలే తప్ప తాము మాట్లాడ్డానికి ఏమీలేదని పృథ్వీ స్పష్టం చేశారు.   ఇక పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోవడానికి మితిమీరిన ఆత్మవిశ్వాసమే కారణమని పృథ్వీ అభిప్రాయపడ్డారు. అదేవిధంగా, ఎన్నికల ప్రచారం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా వైసీపీ నేత కన్నబాబుపై పవన్ చేసిన వ్యాఖ్యలపై కూడా పృథ్వీ స్పందించారు. కన్నబాబు గతంలో చిరంజీవి వద్ద పీఆర్వోగా పనిచేశారని, ఆ అభిమానంతోనే కన్నబాబుకు ప్రజారాజ్యంలో అవకాశం ఇచ్చారని పేర్కొన్నారు. అలాంటి కన్నబాబును తరిమికొట్టండి, తాటతీయండి అని పవన్ వ్యాఖ్యానించడంపై కాపు సామాజిక వర్గంలోనే వ్యతిరేకత వచ్చిందని అన్నారు. మనోడ్ని మనోడే తిట్టడం ఏంటని తూర్పుగోదావరి ప్రజలు చర్చించుకున్నారని, ఇలాంటివి బయటికి తెలియవని వివరించారు. అయినా, పీఆర్వోగా పనిచేసిన వ్యక్తి అంతటితో ఆగిపోవాల్సిందేనా? రాజకీయాల్లో ఎదగకూడదా? అని ప్రశ్నించారు.

'ఎన్టీఆర్‌ వైద్యసేవ' పథకం పేరు మారింది.. ఆశా వర్కర్లకు గుడ్ న్యూస్

  ఆశా వర్కర్లకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు అందించింది. రాష్ట్రంలోని ఆశావర్కర్ల వేతనాలను రూ.3వేల నుంచి రూ.10వేలకు పెంచాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. వైద్యఆరోగ్య శాఖపై నిర్వహించిన సమీక్షలో జగన్ ఈ మేరకు పలు సూచనలు చేశారు. పేదలకు ప్రభుత్వ ఆస్పత్రుల ద్వారా మెరుగైన వైద్య సౌకర్యాలు అందించడమే తమ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని చెప్పారు. వైద్యఆరోగ్య శాఖ సమూల ప్రక్షాళనకు ఆరోగ్య రంగంలోని నిపుణులతో ఒక కమిటీ ఏర్పాటు చేస్తామని.. సీఎం కార్యాలయం తరపున ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి పి.వి.రమేష్ ఆ కమిటీ సమన్వయ బాధ్యతలు చూస్తారన్నారు. వైద్యఆరోగ్య శాఖకు చెందిన అధికారులతో ఆ కమిటీ సమాలోచనలు జరిపి 45 రోజుల్లో నివేదిక సమర్పించాలని సీఎం ఆదేశించారు. 'ఎన్టీఆర్‌ వైద్యసేవ'ను ‘వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ’గా పేరు మార్చాలని జగన్‌ ఆదేశించారు. ఈ శాఖ తనకు అత్యంత ప్రాధాన్యతతో కూడినదని.. తానే ప్రత్యక్షంగా ఈ శాఖ పనితీరును పర్యవేక్షిస్తానని చెప్పారు. వైద్య ఆరోగ్య రంగంలో దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విధానాలే మనకు ఆదర్శమని చెప్పారు. ఆయన అప్పట్లో అమలు చేసిన ఆరోగ్యశ్రీ, 108 సర్వీసులు వంటి అనేక విధానాలను పలు రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకున్నాయని జగన్‌ గుర్తు చేశారు. 108, 104 సర్వీసులను ప్రక్షాళన చేసి.. వాహనాలు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండేలా చేయాలని సీఎం ఆదేశించారు. వైద్యఆరోగ్య శాఖకు పూర్వవైభవం తేవాలని.. దేశమంతా ఏపీ వైపు చూసేలా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అంబులెన్సుల స్థితిగతుల పనితీరుపై ఒక నివేదిక ఇవ్వాలని సంబంధిత అధికారులను జగన్‌ ఆదేశించారు. ప్రతి ఆరోగ్య కేంద్రం, ప్రభుత్వ ఆస్పత్రిలో పూర్తిస్థాయి అవసరాలు తీర్చేందుకు ఏయే చర్యలు తీసుకోవాలనే అంశాలపై సమగ్రంగా నివేదిక రూపొందించి అందజేయాలని సూచించారు. ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు, ఇతర పోస్టుల భర్తీపై జగన్‌ సానుకూలంగా స్పందించారు. పోస్టుల భర్తీ, ఆర్థిక అవసరాలు, మౌలిక వసతుల అభివృద్ధిపై నివేదికను తక్షణమే రూపొందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. వైద్యవిద్యలో ఇటీవల జరిగిన పరిణామాలపై జగన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సీట్లు పెంచడానికి అడ్డంకులు ఎందుకు వస్తున్నాయని.. సౌకర్యాలు లేవని సీట్ల కేటాయింపు చేయకపోతే దానిపై ఎందుకు గట్టిగా చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. నిబంధనలను వెంటనే సమీక్షించాలని ఆదేశించారు. విద్యార్థులకు ఎటువంటి ఆటంకం లేకుండా వైద్యవిద్య అందేలా చర్యలు చేపట్టాలని జగన్‌ స్పష్టం చేశారు.  నకిలీ మందులు, నాణ్యత లేని ఔషధాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రికి వస్తే సరైన ధరలకు నాణ్యమైన మందులు లభిస్తాయనే విశ్వాసం ప్రజల్లో తీసుకురావాలని.. ఆ దిశగా చర్యలు చేపట్టాలన్నారు. వైద్య పరికరాలు, మందులు, మౌలిక సౌకర్యాల టెండరింగ్ విధానాలను పునఃసమీక్షించాలని ఆదేశించారు. మొత్తం వైద్య ఆరోగ్య వ్యవస్థలో సమూల మార్పులు రావాలని.. కింది నుంచి పైస్థాయి వరకు పూర్తి ప్రక్షాళన దిశగా చర్యలు ఉంటాయని సీఎం జగన్‌ స్పష్టం చేశారు.

సీఎంగా జగన్ తొలి ప్రసంగం అద్భుతం.. విజయమ్మ కంటతడి

  ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణం చేశారు. విజయవాడలో ఇందిరాగాంధీ స్టేడియంలో ఏర్పాటు చేసిన సభావేదికపై తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ ఆయనతో ప్రమాణం చేయించారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా జగన్‌ ప్రసంగించారు. "ఆకాశమంతటి విజయాన్ని అందించిన మీ అందరికీ కృతజ్ఞతలు. పదేళ్లుగా నా రాజకీయ జీవితంలో 3,648 కి.మీ పాదయాత్ర చేశా. పాదయాత్రలో పేదల కష్టాలు చూశా.. ప్రజల కష్టాలు విన్నాను. నేనున్నానని మీ అందరికి చెబుతున్నాను. అందరి ఆకాంక్షలను పరిగణనలోకి తీసుకుంటూ ప్రజల కష్టాలను తీర్చేందుకు రెండే రెండు పేజీలతో మేనిఫెస్టో తీసుకొచ్చాం. గత ప్రబుత్వాల మాదిరిగా పేజీల కొద్ది మేనిఫెస్టో తీసుకోలేదు. మా మేనిఫెస్టోలో కులానికో పేజీ తీసుకురాలేదు. మేనిఫెస్టోను పవిత్రంగా భావిస్తాను. మేనిఫెస్టో ఆధారంగా పరిపాలిస్తానని మాట ఇస్తున్నాను" అని జగన్ చెప్పారు. "ఆగస్టు 15 నాటికి గ్రామాల్లో వాలంటీర్లుగా నాలుగు లక్షల మంది యువతకు ఉద్యోగవకాశం కల్పిస్తాం. ప్రతి 50 ఇళ్లకు ఒక గ్రామ వాలంటీర్‌ను నియమిస్తాం. గ్రామాలలో చదువుకున్న పిల్లలు.. సేవా చేయాలన్న ఆరాటం ఉన్న వారిని రూ.5వేల వేతనంతో వాలంటీరుగా నియమిస్తాం. ప్రభుత్వ పథకాల్లో అవీనితి పారదోలేందుకు వాలంటీర్లను నియమిస్తాం. వారికి మెరుగైన ఉద్యోగం వచ్చే వరకూ పనిచేయవచ్చు. ప్రభుత్వ సేవలు ఎవరికి అందకపోయినా, లంచాలు కనిపించినా కాల్‌ సెంటర్‌ ద్వారా నేరుగా సీఎం ఆఫీసుకు ఫిర్యాదు చేయవచ్చు. సీఎం ఆఫీసు నంబరు మీ అందరికీ అందుబాటులో ఉంటుంది. పరిపాలనలో విప్లవాత్మక మార్పులు తెచ్చేందుకు గ్రామ సచివాలయాలను తీసుకొస్తున్నాం. నవరత్నాల్లో ఏ పథకం కావాలన్నా నేరుగా గ్రామ సచివాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకుంటే 72 గంటల్లో పరిష్కరిస్తాం. అవినీతికి ఆస్కారం లేకుండా ప్రభుత్వ పథకాలను అందిస్తాం. నవరత్నాల్లో ప్రతి ఒక్కటి తప్పకుండా అమలు చేస్తాం." అని జగన్ స్పష్టం చేసారు. "ఏపీ సీఎంగా ఆరుకోట్ల ప్రజలకు హామీ ఇస్తున్నా. స్వచ్ఛమైన, అవినీతిలేని పాలన అందిస్తా. అవినీతి ఎక్కడ జరిగిందో .. ఏ ఏ కాంట్రాక్టుల్లో అవినీతి చోటుచేసుకుందో వాటిని రద్దు చేస్తాం. నిబంధనలు మార్చి ఎక్కువ మంది కాంట్రాక్టు పనుల్లో పాలుపంచుకునే అవకాశం కల్పిస్తాం. గత ఐదేళ్లలో రాష్ట్రంలో అవినీతి బాగా పెరిగిపోయింది. వ్యవస్థను ప్రక్షాళన చేస్తాం. కాంట్రాక్టులన్నీ పారదర్శకంగా ఉండేలా చూస్తాం. హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ అనుమతితో జ్యుడిషియల్‌ కమిషన్‌ వేస్తాం. కమిషన్‌ సూచనలకు అనుగుణంగా కాంట్రాక్టులు అప్పగిస్తాం. ఏడాది సమయం ఇస్తే అవినీతి లేకుండా అంతా ప్రక్షాళన చేస్తా. కులం, మతం, ప్రాంతం, వర్గం, పార్టీలు చూడకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తానని మాట ఇస్తున్నా. నన్ను ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఆశీర్వదించిన దేవుడికి, నాన్నగారికి, నా తల్లికి పాదాభివందనం చేస్తూ మీ అందరికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను’’ అంటూ జగన్‌ తన ప్రసంగాన్ని ముగించారు. ప్రసంగం అనంతరం జగన్ తన తల్లి విజయమ్మని కౌగిలించుకున్నారు. భావోద్వేగంతో ఆమె కంటతడిపెట్టేశారు. ఆమె కన్నీరు తుడిచిన జగన్ స్టేజ్‌పై నుంచి కిందికి తీసుకెళ్లారు. అనంతరం ఇందిరాగాంధీ స్టేడియం నుంచి నేరుగా తాడేపల్లిలోని తన స్వగృహానికి చేరుకున్నారు.

టీడీపీకి 116 సీట్లు.. రాయలసీమలో ఊహించని ఫలితాలు

  మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ ఏపీలో వైసీపీదే అధికారమని అంచనా వేస్తున్నాయి. అయితే టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం.. ఎగ్జిట్ పోల్స్ ని నమ్మొద్దని, నూటికి నూరు శాతం మళ్ళీ టీడీపీనే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. రేపు ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో చంద్రబాబు తమ పార్టీ నేతలకు, కార్యకర్తలకు గెలుపు మనదేనన్న భరోసా ఇచ్చారట. ప్రతిపక్షాల మైండ్‌గేమ్‌లో పడాల్సిన అవసరం లేదని, వారు చేస్తోన్న హంగామాకు బెదిరిపోవద్దని, గెలుపు మనదేనని వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. టీడీపీకి 116 సీట్లు వస్తాయని, దాని కంటే ఎక్కువ వచ్చే అవకాశం ఉందని, రాష్ట్రంలో అన్నివర్గాల ప్రజలు టీడీపీ వైపు నిలబడ్డారని అన్నారట. కేంద్రం, ఎన్నికల కమీషన్‌ సహాయంతో వైసీపీ ఎన్ని కుట్రలు చేసినా తట్టుకుని నిలబడ్డామని, గెలుపు మనదేనని, సంబరాలకు సిద్ధంగా ఉండాలని బాబు చెప్పినట్లు తెలుస్తోంది. వైసీపీకి పట్టున్న రాయలసీమలో కూడా టీడీపీ ఘన విజయం సాధించబోతోందని బాబు ధీమా వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. "గతంలో చిత్తూరులో టీడీపీకి 7 సీట్లు వస్తే.. ఈసారి మరో రెండు సీట్లు పెరుగుతున్నాయి. అదే విధంగా అనంతపురంలో వచ్చిన 12 సీట్లను నిలబెట్టుకుంటున్నామని, కర్నూలులో గతంలో 3 సీట్లు వస్తే.. ఈసారి తొమ్మిది సీట్లు సాధించబోతున్నామని, కడపలో మరో సీటు వస్తుందని.. గతానికంటే పది సీట్లు సీమలో అదనంగా గెలుచుకోబోతున్నాం" అని బాబు అన్నట్లు తెలుస్తోంది. రాయలసీమలోనే ఇలా ఉంటే మిగతా ప్రాంతాల్లో ఎలా ఉంటుందో చూసుకోవాలని ఆయన పార్టీ నేతలకు, కార్యకర్తలకు చెప్పారట.  ఇక ప్రకాశంలో ఏడు, నెల్లూరులో నాలుగు సీట్లు వస్తున్నాయని అన్నారట. రాజధాని ప్రాంతమైన  గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పదికి తగ్గకుండా వస్తాయని, గోదావరి జిల్లాల్లో కూడా అదే పరిస్థితి ఉందని, ఉత్తరాంధ్రలో మెజార్టీసీట్లు సాధిస్తామని తెలిపారట. మరి బాబుకి తమ గెలుపుపై ఉన్న నమ్మకం నిజమవుతుందో లేదో రేపు తెలుస్తోంది.

ఈవీఎంల తరలింపు కలకలం.. వారణాసిలో వీడియో సాక్ష్యం

  ఎన్నికల ఫలితాలకు సమయం దగ్గరపడేకొద్దీ ఎన్నికల సంఘం సరికొత్త వివాదాల్లో చిక్కుకుంటోంది. ఈవీఎంల తరలింపు విషయంలో రాజకీయ పార్టీల నుంచి విమర్శలు ఎదుర్కొంటోంది. యూపీ, బీహార్, పంజాబ్, హర్యానాల్లో ఈవీఎంల ట్యాంపరింగ్‌కు సంబంధించిన వార్తలు కలకలం రేపుతున్నాయి. కౌంటింగ్‌కు రెండు రోజుల ముందు ఈవీఎంలను స్ట్రాంగ్ రూంల వద్దకు తీసుకొచ్చిన వీడియోలు కలకలం సృష్టించాయి. ప్రధాని మోదీ పోటీ చేస్తున్న ఉత్తర్‌ప్రదేశ్‌ లోని వారణాసిలో ఈవీఎంల తరలింపు వ్యవహారం వివాదాస్పదంగా మారింది. చందౌలీ నియోజకవర్గంలో ఆదివారం పోలింగ్ ముగియగా.. సిబ్బంది మంగళవారం ఈవీఎంలను కౌంటింగ్ సెంటర్‌కు తీసుకువచ్చారు. మంగళవారం ఉదయం ఈవీఎంలను కౌంటింగ్ సెంటర్‌ కాంప్లెక్స్‌లోని ఓ గదిలో భద్రపరచడాన్ని సమాజ్‌వాదీ పార్టీ కార్యకర్తలు మొబైల్ లో చిత్రీకరించారు. పోలింగ్ ముగిసిన రెండ్రోజుల తర్వాత ఈవీఎంలు తీసుకురావడంపై అధికారులను నిలదీశారు. దీనిపై స్పందించిన ఎన్నికల యంత్రాంగం.. వీడియోలో చూపించిన ఈవీఎంలు చందౌలీ నియోజవర్గానికి చెందిన రిజర్వ్‌ యూనిట్లని తెలిపారు. పోలింగ్‌ రోజున తరలించే క్రమంలో ఏర్పడ్డ ఇబ్బందుల కారణంగా వాటిని స్ట్రాంగ్‌ రూంలకు చేర్చడంలో ఆలస్యమైందని వివరించారు. కాగా.. గత డిసెంబరులో ఈసీ ఇచ్చిన ఆదేశాల ప్రకారం.. ఎన్నికల ప్రక్రియ ముగిసిన వెంటనే అన్ని ఈవీఎంలతో పాటే రిజర్వ్‌ యూనిట్లను కూడా తరలించాల్సి ఉంటుంది. అలాగే అవన్నీ కౌంటింగ్ ప్రక్రియ ముగిసే వరకు సాయుధ బలగాల పటిష్ఠ భద్రతలో ఉండాలి. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘాజీపూర్‌ నియోజవర్గ పరిధిలో ఓ వాహనంలో భారీ ఎత్తున ఈవీఎంలను తరలిస్తున్నారని ఆరోపిస్తూ బీఎస్పీ అభ్యర్థి అఫ్జల్‌ అన్సారీ స్థానికంగా ఉన్న ఓ స్ట్రాంగ్‌రూమ్‌ వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో జిల్లా రిటర్నింగ్‌ అధికారి అక్కడికి చేరుకొని స్ట్రాంగ్‌ రూమ్‌ వద్ద పార్టీలకు చెందిన ప్రతినిధులను కూడా ఉండడానికి అనుమతించడంతో ఆందోళన విరమించారు. బీహార్, హర్యానా, పంజాబ్‌లోని పలు ప్రాంతాల్లోనూ ఇలాంటి ఘటనలే వెలుగులోకి వచ్చాయి. అయితే.. ఈవీఎంల తరలింపు వార్తలపై స్పందించిన ఎన్నికల సంఘం.. ఆ వార్తలన్నీ కేవలం వదంతులేనని, భారీ బందోబస్తు మధ్య ఈవీఎంలను భద్రపరిచామని తెలిపింది.

బాబుని కలిసిన బీజేపీ నేత.. ఏపీలో టీడీపీ గెలుపుపై నమ్మకంతోనేనా?

  కేంద్రంలో బీజేపీకి గానీ, కాంగ్రెస్ కి గానీ పూర్తీ మెజారిటీ వచ్చే అవకాశం లేదని.. ఈసారి ప్రాంతీయ పార్టీలు కీలక పాత్ర పోషిస్తాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఎగ్జిట్ పోల్స్ మాత్రం మళ్ళీ కేంద్రంలో ఎన్డీయేనే అధికారంలోకి వస్తుందని అంచనా వేసాయి. ఇక ఏపీలో వైసీపీదే గెలుపని అభిప్రాయపడ్డాయి. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు తాజాగా టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుని కలిశారు. అంతేకాదు.. మళ్ళీ మీరే రావాలి, మిమ్మల్ని సీఎంగా మరోసారి చూడాలని తన ఆకాంక్ష అని బాబుతో విష్ణు చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బీజేపీ, టీడీపీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఓ వైపు చంద్రబాబు బీజేపీయేతర పక్షాలను ఏకం చేయడానికి తనవంతు ప్రయత్నాలు చేసున్నారు. మరి ఇలాంటి సమయంలో బీజేపీ నేత.. చంద్రబాబుని కలవడం రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి పూర్తి మెజారిటీ వస్తుందని చెప్పినా బీజేపీకి నమ్మకం లేదా? అందుకే మిగతా పార్టీ నేతలను దగ్గరికి తీసుకునే ప్రయత్నంలో భాగంగా.. బీజేపీ పెద్దలు బాబు వద్దకి విష్ణుని రాయబారానికి పంపారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లేక ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నమ్మని విష్ణు.. ఏపీలో టీడీపీనే గెలిచే అవకాశముందని నమ్ముతూ బాబుకి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారా? అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి ఈ విష్ణు.. బాబుని ఏ ఉద్దేశంతో కలిసారో ఆ పై వాడు విష్ణువుకే తెలియాలి.

ఏపీలోని ప్రతి మహిళ సమాచారం వారి వద్ద ఉంది

  ఏపీ ప్రజల వ్యక్తిగత డేటాను టీడీపీ ప్రభుత్వం దొంగిలించిందని వైసీపీ నేత విజయసాయిరెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలోని ప్రతి మహిళకు సంబంధించిన సమాచారం టీడీపీ వద్ద ఉందని, ప్రతి కుటుంబానికి సంబంధించిన ఎంతో కీలకమైన సమాచారాన్ని చంద్రబాబు దొంగిలించారని మండిపడ్డారు. ఆ సమాచారం టీడీపీ గూండాల వద్ద కూడా ఉందని అన్నారు. మహిళల ఆధార్‌ కార్డు, బ్యాంక్‌ అకౌంట్‌, ఫోన్‌ నంబర్లు తదితర వివరాలు చంద్రబాబు ముఠా దగ్గర ఉన్నాయని మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వానికి చెందిన ఇ-ప్రగతి పోర్టల్ ను ఆధార్ కు లింక్ చేయడం ద్వారా ఎంతో సమాచారాన్ని రాబట్టారని విజయసాయిరెడ్డి తెలిపారు. జె.సత్యనారాయణ 2016 లో ఆధార్ సంస్థ చైర్మన్ గా నియమితులైనప్పటి నుంచి ఎన్నికల వరకు కూడా ఈ తంతు నిరాటంకంగా కొనసాగిందని ఆరోపించారు. ఆధార్ నమోదులో ఎంతో కీలకంగా భావించే ఫింగర్ ప్రింట్స్, రెటీనా స్కాన్ వంటి ఇ-డేటాను ఇ-ప్రగతి పోర్టల్ కు బదిలీ చేసుకుని, దాని క్యారక్టరైజేషన్ ను ఓ సాఫ్ట్ వేర్ ద్వారా డేటా రూపంలోకి మార్చుకున్నారని విజయసాయి ఆరోపించారు. ఆ విధంగా ఇ-ప్రగతిలోకి ఆధార్ డేటాను రాబట్టిన చంద్రబాబు దొంగలముఠా అక్కడ్నించి పార్టీ యాప్ సేవామిత్రలోకి దాన్ని బదలాయించిందని ఆరోపించారు. దాదాపు 6 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన, ప్రత్యేకించి స్త్రీలకు సంబంధించిన వివరాలను చంద్రబాబు తన పార్టీ యాప్ లో పెట్టుకోవడం అందరూ గమనించాలని అన్నారు. ఈ సేవామిత్రను రూపొందించింది ఐటీ గ్రిడ్స్ అని, ఐటీ గ్రిడ్స్ యజమాని అశోక్ దాకవరంను పట్టుకునేందుకు తెలంగాణ సర్కారు ఇప్పటికీ ప్రయత్నిస్తోందని తెలిపారు. "సేవామిత్ర యాప్‌తోనే టీడీపీ ఎన్నికల్లో సర్వేలు నిర్వహించింది. ఈ సర్వేల్లో ఎవరైతే టీడీపీపై అసంతృప్తి వ్యక్తం చేశారో.. వారి ఓట్లను తొలగించేందకు ఫామ్‌-7 దరఖాస్తులు చేశారు. ఐటీ మంత్రి నారా లోకేశ్‌ ద్వారానే ఐటీ గ్రిడ్‌కు ప్రజల వ్యక్తిగత డేటా చేరింది. చంద్రబాబు, లోకేశ్‌లు అశోక్‌ అరెస్ట్‌ కాకుండా కాపాడుతున్నారు. అశోక్‌ ఏ తప్పు చేయకుంటే అజ్ఞాతంలోకి ఎందుకు వెళతారు?." అని ప్రశ్నించారు. అశోక్‌ ఎక్కడున్నారో చంద్రబాబు, లోకేశ్‌, ఏబీ వెంకటేశ్వరరావులను అడగాలని విజయసాయిరెడ్డి తెలిపారు. వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ నియోజకవర్గంలో కూడా టీడీపీ నేతలు ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించారు. ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారి వివరాలు సేకరించి.. అందులో ఎవరైతే టీడీపీకి అనుకూలంగా ఉండరో వారి ఓట్లను తొలగించేందుకు ప్రయత్నించారు. తమకు అనుకూలంగా లేని ఓటర్ల వివరాలు సేకరించాలని టీడీపీ ఆ పార్టీ వెబ్‌సైట్‌లోనే నాయకులను ఆదేశించింది. మొబైల్ ఫోన్ లొకేషన్ ద్వారా, మీ కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్న వ్యక్తుల నంబర్ల ద్వారా సేవామిత్ర ప్రతి ఒక్కరినీ ట్రాక్ చేయగలదని అన్నారు. ఫోన్ లో ఉన్న మైక్ ను కూడా తమ అదుపులోకి తీసుకుని ఇతరుల సంభాషణను రికార్డు చేసే వీలుందని వివరించారు. ఈ విధంగా చంద్రబాబు ఐటీ గ్రిడ్స్ అశోక్ తో కలిసి దేశానికి, రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు ఎంత ముప్పు తీసుకువచ్చాడో అందరూ గమనించాలని విజ్ఞప్తి చేశారు. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి, కొత్త నంబర్ల నుంచి ఫోన్ కాల్ వస్తే అది చంద్రబాబు ముఠా దొంగిలించిన సమాచారం ఆధారంగా జరిగే మోసంగా అందరూ భావించాల్సిన పరిస్థితి ఉందని విజయసాయిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.

దాన్ని కూడా బూతుగా చిత్రీకరించే నీచ మనస్తత్వం నీది

  విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టడానికి విఫలయత్నం చేసి ఆపై సీఎం చంద్రబాబు మీద విమర్శలు చేసిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై టీడీపీ మహిళా నేత దివ్యవాణి విమర్శలు గుప్పించారు. సమస్యను సమస్యగా మాట్లాడడం వర్మ నేర్చుకోవాలని అన్నారు. రాష్ట్రంలో పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నప్పుడు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సింది ఏమీ లేదని, లక్ష్మీపార్వతి చరిత్ర ఏంటో ఆమె మొదటిభర్త వీరగంథం గారు ఎప్పుడో చెప్పారని, ఇటీవలే కోటి అనే యువకుడు కూడా తాను ఎలా వేధింపులకు గురైందీ సోషల్ మీడియాలో వెల్లడించాడని దివ్యవాణి పేర్కొన్నారు. ఎన్నికల వేడి కారణంగా రాజకీయ పార్టీలు, ప్రజలు తీవ్ర ఆవేశంలో ఉన్న తరుణంలో వర్మ ఏపీలో ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి చేసిన ప్రయత్నాలు సరికాదంటూ దివ్యవాణి అభిప్రాయపడ్డారు. వర్మ ప్రెస్ మీట్ పెడితే తలెత్తే పరిణామాలు, అల్లర్లను పోలీసులు ఊహించే ఆయనను అడ్డుకున్నారని.. పోలీసులు మంచి పనిచేశారని కితాబిచ్చారు. ఏపీలో 144 సెక్షన్ అమలులో ఉన్న సమయంలో ప్రెస్ మీట్ పెట్టుకుంటానని వచ్చిన వర్మ.. తనను పోలీసులు ఆపారని, అందుకు చంద్రబాబే కారణమని ఆరోపించడాన్ని దివ్యవాణి తప్పుబట్టారు. చంద్రబాబుపై నింద మోపడం చాలా బాధకరమని అన్నారు. "వర్మ గారూ, ఇవాళ మీపై విమర్శలు చేయడానికి కూడా ఎంతో ఆలోచించాల్సి వస్తోంది. ఓ సంస్కారవంతుడైన నాయకుడి వద్ద మేం పనిచేస్తున్నాం. అందుకే ఎంతో బాధతో మాట్లాడాల్సి వస్తోంది. జాగ్రత్త! నీ కప్ప కనుగుడ్లని తెలుగింటి ఆడపడుచులు పీకిపడేసి నిన్ను కళ్లు లేని కబోదిని చేస్తారు. ఒక పసిబిడ్డ తల్లి వద్ద పాలు తాగుతున్నా కూడా దాన్నొక బూతుగా చిత్రీకరించే నీచ మనస్తత్వం నీది." అని విమర్శించారు. "ఒకవేళ నీకు కోడికత్తి పార్టీ మీద ఆసక్తి కలిగితే ధైర్యంగా కండువా కప్పుకో. ఒక స్టార్ క్యాంపెయినర్ గా ప్రచారం చేసుకో. అంతేతప్ప చంద్రబాబు గారితో పోల్చుకునే స్థాయి నీకు లేదు.  సీఎం పోస్టులో ఎవరున్నా గానీ వాళ్లకు మర్యాద ఇచ్చి మాట్లాడడం నేర్చుకోండి" అని హితవు పలికారు. "దెయ్యాలు లేవు, దేవుళ్లు లేరు అనే వ్యక్తివి, ఎన్టీఆర్ ఆత్మ వచ్చి నాకు చెప్పింది, అందుకే సినిమా తీస్తున్నానంటూ నువ్వు కల్లబొల్లి కబుర్లు చెప్పడం. ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న జగన్, స్క్రిప్టు రైటర్ గా వ్యవహరిస్తున్న విజయసాయిరెడ్డి నీకు వంతపాడడం! ఏపీ ప్రజలేమీ అంత అమాయకులు కాదు. ఇతర రాష్ట్రాల్లో మీ సినిమా సంకనాకిపోయిందన్న సంగతి అందరికీ తెలుసు." అని ఎద్దేవా చేశారు. "ఎన్టీఆర్ గారి జీవితంలోకి వచ్చే సమయానికి ఆమేమీ పదహారేళ్ల బాలాకుమారి కాదు. ఆమె కనీసం ఎన్టీఆర్ గారి వయసును కూడా గుర్తించకుండా స్టెరాయిడ్స్ ఇప్పించి చావుకు కారణమైంది. నారా, నందమూరి కుటుంబాలకు సంస్కారం ఉంది కాబట్టి ఆమె గురించి ఇప్పటివరకు ఏమీ మాట్లాడలేదు. అయినా ఎన్టీఆర్ గురించి సినిమా తీయడానికి బూతు దర్శకుడివైన నీకేం అర్హత ఉంది?" అంటూ మండిపడ్డారు. "పక్కరాష్ట్రాల వాళ్లు కూడా ఎంతో గౌరవించే చంద్రబాబుపై విమర్శలు చేయడం కాదని, దమ్ము, ధైర్యం ఉంటే జగన్ కుటుంబంలో జరిగిన హత్యారాజకీయాలపై సినిమాలు తీయాలని సవాల్ విసిరారు. చంద్రబాబు ఘనతలపై పొరుగు రాష్ట్రాల వాళ్లు కూడా యూట్యూబ్ లో వీడియోలు పెడుతున్నారని, మీకొద్దంటే చెప్పండి మేం తీసుకెళతాం ఆయన్ని అని అంటున్నారని, అలాంటి వ్యక్తిపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదు" అని హెచ్చరించారు. "ఇవాళ తెలంగాణ ప్రజలకు తెలుస్తోంది చంద్రబాబు గారి విలువేంటో. 20 మంది ఇంటర్ విద్యార్థుల బంగారు భవిష్యత్తును, వాళ్ల తల్లిదండ్రుల సంతోషాన్ని మళ్లీ తీసుకురాగలరా? ప్రభుత్వం చేసిన తప్పు వల్ల ఎంతమంది బిడ్డలు ఆహుతైపోయారు? మరి ఆ తప్పులపై నీకు సినిమాలు తీసే దమ్ముంటే అప్పుడు నిన్ను నిజమైన డైరెక్టర్ అంటాం." అని దివ్యవాణి అన్నారు.

వైఎస్ వివేకా మృతి.. ఏడు కత్తి గాయాలు.. ఎన్నో అనుమానాలు

  ఏపీలో ఎన్నికల వేళ వైసీపీ అధినేత వైస్ జగన్ బాబాయ్ వైఎస్‌ వివేకానందరెడ్డి మృతి సంచలనం రేపుతోంది. ఆయన మరణం పలు అనుమానాలకు దారి తీస్తుంది. మొదట ఆయన తెల్లవారు జామున బాత్ రూమ్ కి వెళ్లి గుండె పోటుతో అక్కడే కుప్పకూలిపోయి చనిపోయారని వార్తలొచ్చాయి. కాసేపటికి ఆయన మృతదేహం రక్తం మడుగులో పడి ఉందని.. ఆయన తలకి, చేతులకి గాయాలు ఉన్నాయని.. ఆయన పీఏ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన మృతిపై అనుమానాలు మొదలయ్యాయి. ఆ అనుమానాలను నిజం చేస్తూ పోలీసులు కూడా వివేకాది హత్యే అని ప్రాధమికంగా నిర్దారించారు. వివేకానంద రెడ్డిది సహజ మరణం కాదని, ఆయన హత్యకు గురైనట్టు పోస్టుమార్టం నివేదికలో ప్రాథమికంగా నిర్థారణ అయిందని పోలీసులు వెల్లడించారు. ఆయన శరీరంపై ఏడు కత్తి గాయాలు ఉన్నట్లు, పదునైన ఆయుధంతో వివేకా తల, శరీరంపై దాడి చేసినట్లు వైద్యులు గుర్తించారు. పోస్టుమార్టం నివేదికను బట్టి చూస్తే వివేకా హత్యకు గురయ్యారని అర్ధమవుతోంది. అయితే ఆయన మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన రక్తపు మడుగులో పడి ఉంటే.. ఆయనది సహజం మరణమని, ఆయన గుండెపోటుతో మరణించారని ఎందుకు ప్రచారం చేశారు?. అసలు తొలుత అలా ఎవరు ప్రచారం చేశారు? అలా చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది?. వివేకా సౌమ్యుడని, వివాదాలకు దూరంగా ఉంటారని పేరుంది. మరి అలాంటి వ్యక్తిని చంపాల్సిన అవసరం ఎవరికుంది?. ఆయన హత్య వెనుక రాజకీయ కోణాలు, రాజకీయ ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా? ఇలా పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా ఎన్నికల వేళ ఓ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అధినేతకి స్వయానా బాబాయ్ అయిన వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందడంతో.. ఆయన మృతి రాజకీయ కోణం సంతరించుకుంది. ఇప్పటికే వివేకా మృతిపై కొందరు వైసీపీ, టీడీపీ నేతలు ఒకరిమీద ఒకరు అనుమానం వ్యక్తం చేస్తూ ఆరోపణలు, విమర్శలు చేసుకుంటున్నారు. మరోవైపు వివేకా మృతిపై విచారణకు ఇప్పటికే ఏపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఆ సిట్ నివేదిక వస్తే కానీ వివేకా మృతి వెనుక రాజకీయ కుట్ర ఉందో, మరేదైనా కక్ష ఉందో తెలీదు.

తెలంగాణ బడ్జెట్.. రైతులకు గుడ్ న్యూస్

  2019-20 సంవత్సరానికి రూ.1,82,017 కోట్లతో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌‌ను సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన కారణంగా ఎన్ని నిధులు వస్తాయో స్పష్టంగా తెలియదన్నారు. అందుకే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నామని కేసీఆర్ స్పష్టం చేశారు. కేంద్రం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత రాష్ట్రంలోనూ పూర్తి బడ్జెట్ ప్రవేశపెడతామని వెల్లడించారు. ఇది తెలంగాణ రాష్ట్రానికి ఆరవ బడ్జెట్‌ అని చెప్పారు. తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రజలు సహకారం అందిస్తున్నారని తెలిపారు. తెలంగాణ ఆవిర్భావానికి ముందు గుజరాత్‌, కేరళ అభివృద్ధి గురించే దేశవ్యాప్తంగా చర్చ జరిగేదని, ప్రస్తుతం తెలంగాణ అభివృద్ధిపై చర్చ జరుగుతోందని అన్నారు. తెలంగాణ అనుసరిస్తున్న ప్రణాళిక దేశంలో చర్చకు కేంద్ర బిందువైందని చెప్పారు. తెలంగాణ ఆవిర్భవించినప్పుడు ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. తక్కువ సమయంలో ఎక్కువ అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాం. అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్‌ అందిస్తున్నామన్నారు. రైతుల్లో నిరాశను తొలగించామని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని అన్నారు. తెలంగాణ రైతులకు కేసీఆర్‌ శుభవార్త చెప్పారు. 2018 డిసెంబరు 11వ తేదీలోగా తీసుకున్న రైతు రుణాలు రూ.లక్ష వరకూ మాఫీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ బడ్జెట్‌లో వ్యవసాయాభివృద్ధి కోసం రూ.20,107కోట్లు కేటాయించారు. రైతు బంధు సాయం కింద ఎకరానికి రూ.10వేలు అందిస్తుండగా, ఇందుకోసం రూ.12వేల కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. రైతు బీమా కోసం రూ.650కోట్లు కేటాయించిన కేసీఆర్‌ ప్రభుత్వం.. నీటిపారుదల శాఖకు రూ.22,500కోట్లు కేటాయించింది. తెలంగాణ బడ్జెట్‌ ముఖ్యాంశాలు: వ్యవసాయ శాఖకు రూ.20,107 కోట్లు రైతు రుణమాఫీకి రూ.6వేల కోట్లు రైతు బంధుకు రూ.12 వేల కోట్లు రైతు బీమా రూ.650 కోట్లు నీటిపారుదలశాఖకు రూ.22,500కోట్లు నిరుద్యోగ భృతికి రూ.1,810 కోట్లు ఎస్సీల అభివృద్ధికి రూ.16,581 కోట్లు ఎస్టీల అభివృద్ధికి రూ.9,827 కోట్లు మైనార్టీల సంక్షేమానికి రూ.2004 కోట్లు ఈఎన్‌టీ, దంత పరీక్షలకు రూ.5,536 కోట్లు ఆసరా పెన్షన్లకు రూ.12,067 కోట్లు కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌కు రూ.1450 కోట్లు రూపాయికి కిలో బియ్యం పథకానికి రూ.2,744 కోట్లు దివ్యాంగుల పెన్షన్లకు రూ.12వేల కోట్లు ఎంబీసీ కార్పోరేషన్‌కు రూ.1000 కోట్లు

ఇతర పార్టీలతో టీడీపీ పొత్తు ఖాయమన్న లోకేష్.. ఏ పార్టీలబ్బా?

  ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో టీడీపీ నేతల జంపింగులే హాట్ టాపిక్ అని చెప్పాలి. ఎందుకంటే నేతలు వరుసపెట్టి టీడీపీకి గుడ్ బై చెప్తున్నారు. నేతల జంపింగులపై తాజాగా మంత్రి నారా లోకేష్ స్పందించారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ రాదని తెలిసిన వారే పార్టీలు మారుతున్నారని ఆరోపించారు. గెలుపు గుర్రాలకే పార్టీ టిక్కెట్లు ఇస్తామని స్పష్టం చేశారు. ఎవరి పనితీరు ఏంటో చంద్రబాబుకు తెలుసునని చెప్పుకొచ్చారు. పార్టీలో, చంద్రబాబుతో విభేదాలు ఉంటే ఎప్పుడో వెళ్లి ఉండేవారని, ఎన్నికలకు రెండు నెలల ముందు కాదని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో 175 సీట్లకు గాను 150 సీట్లలో గెలిచి చంద్రబాబు సీఎం అవుతారని లోకేష్ ధీమా వ్యక్తం చేసారు. నాలుగేళ్ల 10 నెలలు ప్రయాణం చేసి, ఇప్పుడు బాబు మీద విమర్శలు చేయడంలో పరమార్ధాన్ని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. నిన్న మొన్నటిదాకా జగన్ ను తిట్టి, ఇప్పుడు ఆయన దగ్గరకే వెళ్లడం ఆశ్చర్యంగా ఉందని అన్నారు. నేతలు పార్టీలు మారినా ఏమీ కాదని.. సంక్షేమం, అభివృద్ధే టీడీపీకి అండగా నిలుస్తాయని లోకేష్ స్పష్టం చేసారు. అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుంటుందని తేల్చి చెప్పారు. ఎన్నికలకు 30 రోజుల ముందు పొత్తులపై చంద్రబాబు ఖచ్చితమైన నిర్ణయం తీసుకుంటారని లోకేష్ స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుంటుందని లోకేష్ చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీస్తున్నాయి. ఏపీ ఎన్నికల బరిలో ప్రధానంగా టీడీపీ, వైసీపీ, జనసేన, బీజేపీ మరియు కాంగ్రెస్ దిగనున్నాయి. టీడీపీ, వైసీపీల పొత్తు అసలు ఆప్షనే లేదు. ఇక టీడీపీ, బీజేపీలు గత ఎన్నికల్లో కలిసి పనిచేసినా.. ఇప్పుడు ఆ రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. కాబట్టి బీజేపీతో పొత్తు ఉండే అవకాశం లేదు. జనసేన విషయానికొస్తే.. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీకి దూరంగా ఉండి టీడీపీకి మద్దతిచ్చారు. కానీ ఇప్పుడు మాత్రం తాము ఏ పార్టీతో పొత్తు పెట్టుకోమని, కేవలం వామపక్షాలతో కలిసి నడుస్తామని స్పష్టం చేసారు. ఇప్పటికైతే జనసేనతో పొత్తు కూడా కష్టమే. మరి ఎన్నికల ముందు ఏదైనా అద్భుతం జరిగితే చెప్పలేం. ఇక మిగిలింది కాంగ్రెస్. మిగతా పార్టీలతో పోల్చుకుంటే ప్రస్తుతం టీడీపీ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునే అవకాశాలు ఎక్కువనే చెప్పాలి. ఇప్పటికే టీడీపీ, కాంగ్రెస్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీచేశాయి.. అదేవిధంగా కేంద్రంలో బీజేపీకి వ్యతిరేకంగా కలిసి పనిచేస్తున్నాయి. అయితే తెలంగాణలో వచ్చిన చేదు ఫలితాల నేపథ్యంలో టీడీపీ, కాంగ్రెస్ లు ఏపీలో ఎంతవరకు కలిసి పనిచేస్తాయో కూడా ఆలోచించాలి. కొందరు టీడీపీ నేతలు కూడా ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేస్తున్నారు. జాతీయస్థాయిలో కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తాం కానీ రాష్ట్రంలో మాత్రం విడిగా పోటీ చేస్తేనే టీడీపీకి లాభమని అభిప్రాయపడుతున్నారు. మరి ఇప్పుడు లోకేష్ ఏమో టీడీపీ, ఇతర పార్టీలతో పొత్తు అంటున్నారు. దీంతో అసలు టీడీపీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటుంది అంటూ చర్చలు మొదలయ్యాయి. చూద్దాం మరి ఎన్నికల ముందు టీడీపీ పొత్తుల విషయంలో ఎలాంటి ట్విస్ట్ లు ఇస్తుందో.

బడ్జెట్ ప్రవేశపెట్టిన యనమల.. 5 వేల కోట్లతో మరో కొత్త పథకం

  2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను మంత్రి యనమల రామకృష్ణుడు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రూ.2,26,177.53 కోట్లతో ఈ బడ్జెట్‌ను రూపొందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమరావతిలో వరుసగా మూడోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం గర్వకారణమని అన్నారు. అపార అనుభవం గల నాయకత్వాన్ని ప్రజలు ఆశించారని.. ఆ నమ్మకంతోనే చంద్రబాబుకు అధికారం అప్పగించారన్నారు. ఈజ్‌ఆఫ్ డూయింగ్‌లో ఏపీ అగ్రగామిగా నిలిచిందని, ఇది చంద్రబాబు సమర్థ నాయకత్వం వల్లే సాధ్యమైందని యనమల అన్నారు. నాలుగున్నరేళ్ల ప్రయాణంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నామని తెలిపారు. హేతుబద్ధత లేకుండా రాష్ట్ర విభజన జరిగిందని, దీంతో రాజధాని నగరాన్ని కోల్పోయామన్నారు. విభజన సమయంలో ఆదాయ-వ్యయాలు, ఆస్తులు-అప్పులు సరిగా పంపిణీ చేయలేదని.. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా నిరాశా నిస్పృహలు నెలకొన్నాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అరకొర సాయం వల్ల సమస్యలు మరింత జఠిలమయ్యాయని యనమల పేర్కొన్నారు. మహిళా సాధికారత సీఎం చంద్రబాబు ఆకాంక్ష అని.. 20 ఏళ్ల క్రితమే మహిళా పొదుపు సంఘాలను ఆయన ఏర్పాటు చేశారని యనమల గుర్తు చేశారు. వెలుగు పథకం ప్రపంచంలోనే అతిపెద్ద పేదరిక నిర్మూలన కార్యక్రమమని, ఆ పథకంలో ప్రస్తుతం 94 లక్షల మంది మహిళలు ఉన్నారని చెప్పారు. ఈ బడ్జెట్ లో పలు కొత్త పథకాలకు ప్రభుత్వం నిధులను మంజూరు చేసింది. ఇందులో రైతుల పెట్టుబడి సాయం కోసం అన్నదాత సుఖీభవ అనే పథకాన్ని మంత్రి ప్రకటించారు. అన్నదాత సుఖీభవకు రూ. 5 వేల కోట్లు కేటాయించారు. బడ్జెట్‌ ముఖ్యాంశాలు: వ్యవసాయానికి రూ. 12, 732 కోట్లు బీసీ వెల్ఫేర్‌ రూ.8,242 అటవీపర్యావరణానికి రూ. 491 కోట్లు ఉన్నత విద్య- 3,171 కోట్లు ఇంధన మరియు ఇన్‌ఫ్రాస్ట్రక్షర్‌ రూ.5,473 సెకండరీ ఎడ్యుకేషన్‌ రూ. 22,783 పౌరసరఫరాలు- రూ. 3,763 కోట్లు ఆర్థికశాఖకు రూ. 51, 841 కోట్లు సాధారణపరిపాలన శాఖకు- రూ.1,117 వైద్యారోగ్యశాఖకు రూ. 10,032 హోంశాఖకు రూ.6,397 కోట్లు గృహనిర్మాణశాఖకు రూ.4079 జలవనరులశాఖకు- రూ. 16,852 కోట్లు పరిశ్రమలశాఖకు 4,114 కోట్లు ఐటీకి 1006 కోట్లు కార్మిక ఉపాధి కల్పనకు 1225 కోట్లు న్యాయశాఖకు 918 కోట్లు అసెంబ్లీకి 149 కోట్లు మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌కు 7979 కోట్లు మైనార్టీ వెల్ఫేర్‌కు రూ. 1308 కోట్లు ప్లానింగ్‌కు 1403 కోట్లు పంచాయతీరాజ్‌, రూరల్‌ డెవలప్‌మెంట్‌ రూ. 35,182 కోట్లు రెవెన్యూశాఖకు రూ. 5546 కోట్లు రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ 172 కోట్లు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ 458 కోట్లు సోషల్‌ వెల్ఫేర్‌కు రూ. 6861 కోట్లు రోడ్లు భవనాలశాఖకు రూ. 5382 కోట్లు మహిళాశిశు సంక్షేమశాఖకు రూ. 3408 కోట్లు యువజన క్రీడలు రూ. 1982 కోట్లు చిన్నమధ్యతరహా పరిశ్రమలకు రూ. 400 కోట్లు డ్రైవర్‌ సాధికార సంస్థకు రూ. 150 కోట్లు క్షత్రియ కార్పొరేషన్‌కు రూ. 50 కోట్లు ధరల స్థిరీకరణ నిధికి రూ. 1000 కోట్లు యాంత్రీకరణకు రూ. 300 కోట్లు మత్స్యశాఖ అభివృద్ధికి రూ. 100 కోట్లు ఎస్సీ సబ్‌ప్లాన్‌ కింద రూ. 14,367 కోట్లు ఎస్టీ సబ్‌ప్లాన్‌ కింద రూ. 5,385 కోట్లు బీసీ సబ్‌ప్లాన్‌ కింద రూ. 16,226 కోట్లు మైనార్టీ సబ్‌ప్లాన్‌ కింద రూ. 1,304 కోట్లు పసుపు- కుంకుమ కింద రూ. 4 వేల కోట్లు బీసీల కార్పొరేషన్‌కు రూ. 3 వేల కోట్లు ముఖ్యమంత్రి యువనేస్తానికి రూ. 1200 కోట్లు డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలు రూ. 1100 కోట్లు చంద్రన్న బీమాకు రూ. 354 కోట్లు అన్నా క్యాంటీన్లకు రూ. 300 కోట్లు చేనేతలకు రూ. 225 కోట్లు 9,10 తరగతుల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకానికి రూ. 156 కోట్లు చంద్రన్న పెళ్లి కానుక కింద బీసీలకు రూ. 175 కోట్లు చంద్రన్న పెళ్లి కానుక కింద ఎస్సీలకు రూ. 128 కోట్లు మైనార్టీలకు దుల్హన్‌ పథకం కింద రూ.100 కోట్లు ఎన్టీఆర్‌ విదేశీ విద్యకు రూ. 100 కోట్లు పెన్షన్‌ కింద వృద్ధాప్య, వింతంతువులకు రూ. 10,401 కోట్లు

టీడీపీకి మరో బిగ్ షాక్.. ఏపీలో వైసీపీదే విజయమంటున్న సర్వే!!

  ఎన్నికల హడావుడి మొదలవుతుంటే సర్వేల సందడి మొదలవ్వడం సహజం. ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో ప్రధాన పార్టీలు.. అభ్యర్థుల ఎంపిక, బలాబలాల అంచనాతో బిజీ బిజీగా ఉన్నాయి. మరోవైపు కొన్ని సంస్థలు సర్వేలతో బిజీగా ఉన్నాయి. ఏపీలో అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎన్నికలు కూడా జరగనున్న విషయం తెలిసిందే. దీంతో కొన్ని జాతీయ మీడియా సంస్థలు ఏపీలో కూడా సర్వే నిర్వహిస్తున్నాయి. తాజాగా ‘రిపబ్లిక్‌ టీవీ - సీ ఓటర్‌' సంస్థలు ఏపీ పార్లమెంట్ ఎన్నికలపై సర్వే నిర్వహించాయి. ఈ సర్వే ఫలితాలు అధికార పార్టీ టీడీపీకి షాక్ ఇచ్చేలా ఉన్నాయి. పార్లమెంట్‌ ఎన్నికల్లో వైసీపీ ఎక్కువ సీట్లు సాధించనుందని ‘రిపబ్లిక్‌ టీవీ - సీ ఓటర్‌’ సంస్థలు నిర్వహించిన సర్వే వెల్లడించింది. టీడీపీ 6 ఎంపీ స్థానాలకే పరిమితమవుతుందని ఈ సర్వే తేల్చింది. ‘నేషనల్‌ అప్రూవల్‌ రేటింగ్స్‌’ పేరుతో జరిగిన ఈ సర్వే ఫలితాలను రిపబ్లిక్‌ టీవీ తాజాగా విడుదల చేసింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రాష్ట్రంలోని మొత్తం 25 లోక్‌సభ స్థానాలకుగానూ.. వైసీపీ 41.3 శాతం ఓట్లతో 19 ఎంపీ సీట్లు, టీడీపీ 33.1 శాతం ఓట్లతో 6 ఎంపీ సీట్లు గెలుచుకుంటాయని సర్వే అంచనా వేసింది. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లు ఏపీలో ఒక్క స్థానంలో కూడా గెలవలేవని పేర్కొంది. గత ఎన్నికల్లో  ఏపీలో టీడీపీకి 15 ఎంపీ సీట్లు రాగా, వైసీపీ 8 ఎంపీ సీట్లను సాధించింది. ఇప్పుడు సర్వే మాత్రం పూర్తి విరుద్ధంగా ఉంది. అయితే ఈ సర్వేపై విమర్శలు కూడా వెల్లువెతున్నాయి. బీజేపీ, వైసీపీలు సర్వేల పేరుతో ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నాయని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. '2014 ఎన్నికల ముందు వైసీపీ గెలుస్తుంది అంటూ కొన్ని సర్వేలు విడుదల చేసారు. కానీ ఫలితాలు తారుమారు అయ్యాయి. ప్రజలు టీడీపీకే పట్టం కట్టారు. ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది' అంటూ టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి సర్వేలో చెప్పినట్లు వైసీపీ ఎక్కువ సీట్లు గెలుచుకుంటుందో లేక 2014 ఫలితాలే రిపీట్ అవుతాయో తెలియాలంటే కొంత కాలం వేచి చూడాల్సిందే.

రాజీనామా చేస్తే బెదిరింపులా..జగన్ పద్ధతి మార్చుకో

  వంగవీటి రంగా ఆశయ సాధన కోసమే వైసీపీలో చేరానని, కానీ అది అక్కడ సాధ్యం కాకపోవడంతో బయటకు వచ్చేశానని వంగవీటి రాధా తెలిపారు. విజయవాడలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... రంగా ఆశయం నెరవేరుస్తానని పార్టీలో చేరేటప్పుడు వైసీపీ అధినేత జగన్ మాటిచ్చారని.. సొంత తమ్ముడికన్నా ఎక్కువ అన్నారని రాధా చెప్పారు. 'తమ్ముడినే ఇలా చూస్తే.. సామాన్య ప్రజలను జగన్‌ ఎలా చూస్తారు' అని ప్రశ్నించారు.  'ఒక్క సీటు కోసం నాకు ఈ గొడవ అవసరం లేదు. నేను అభిమానం కోరుకున్నా.. మీరు జాలి చూపిస్తున్నారు. సీటు ఇవ్వనందుకు నాకు బాధ లేదు, సూటిపోటి మాటలు నన్ను బాధించాయి' అని రాధా అన్నారు. వైసీపీలో తనకు జరిగిన అవమానాలు మరొకరికి ఎదురుకాకూడదన్నారు రాధా. తన తండ్రి విగ్రహావిష్కరణకు వెళితే.. ఎందుకు వెళ్లావంటూ వైసీపీ నేతలు తనను మందలించారన్నారు. ఇదెక్కడి న్యాయమన్నారు. రంగా విగ్రహావిష్కరణకు అన్ని రకాల పార్టీల వాళ్లు వస్తారని... ఆయన అభిమానానికి హద్దులు లేవన్నారు. తన తండ్రి విగ్రహావిష్కరణకు ఎవరి అనుమతి అవసరం లేదని చెప్పారు. అభిమానంతో కొంతమంది భోజనాలు పెడితే.. అది కూడా పొరపాటైపోయిందన్నారు. లోకల్ ఇంఛార్జీకి చెప్పలేదని.. తనను ప్రశ్నించారన్నారు. తండ్రి లేనివాడినని చేరదీశానని.. చెప్పినట్లు వినాల్సిందేనంటూ జగన్‌ ఒత్తిడి చేసేవారని రాధా ఆరోపించారు. ఇప్పటికైనా జగన్‌ పద్ధతి మార్చుకోవాలని సూచించారు. వైసీపీని వీడిన తర్వాత సోషల్ మీడియాలో తనపై బెదిరింపులు పెరిగాయని వంగవీటి రాధా అన్నారు. ఒకవేళ తన చావు వారికి ఆనందం కలిగిస్తుందంటే చంపేయండని అన్నారు. తనకు ప్రాణం మీద ఆశ లేదని.. పేదల కోసం పోరాడి ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి తన తండ్రి అని.. తాను కూడా అందుకు సిద్ధమేనని చెప్పారు. 'నన్ను బెదిరిస్తున్నవారి ఐపీ అడ్రస్‌ ద్వారా గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయగలను. కానీ.. వైసీపీ నేతలు కింద వారిని బలి చేస్తారనే ఆగిపోయాను. ఏపీ పోలీసుల మీద నాకు నమ్మకం ఉంది' అని రాధా అన్నారు. అలాగే పార్టీ మారేందుకు వంద కోట్ల డీల్ కుదుర్చుకున్నారన్న వార్తలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

రిగ్గింగే బీజేపీ గెలుపుకి కారణం.. బయటపడుతుందన్న భయంతో మర్డర్లు!!

  ఎన్నికల్లో గెలిస్తే ప్రజల అండ మా పార్టీకి ఉంది కాబట్టే గెలిచామని, ఓడిపోతే ఈవీఎం ట్యాంపరింగ్ జరగడం వల్లే ఓడిపోయామని చెప్పుకోవడం కొన్ని పార్టీలకు అలవాటు. ఇప్పటికే విపక్షాలు బీజేపీ మీద ఇటువంటి ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ లిస్ట్ లోకి ఓ సైబర్ నిపుణుడు కూడా చేరిపోయాడు. 2014 నుంచి ఇప్పటివరకు బీజేపీ సాధించిన విజయాలన్నీ ఈవీఎంల ట్యాంపరింగ్ వల్లే సాధ్యమైందని పెద్ద బాంబు పేల్చాడు. అమెరికాలో తలదాచుకుంటున్న సయ్యద్‌ షుజా అనే భారతీయ హ్యాకర్‌ సంచలన ఆరోపణలు చేశారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఈవీఎంలు హ్యాక్‌ చేయడం ద్వారానే బీజేపీ విజయం సాధించిందని అన్నారు. ఇందుకు టెలికాం సంస్థ రిలయన్స్‌ జియో సహకరించిందని తెలిపారు. అయితే ఇక్కడో అర్థంకాని విషయం ఏంటంటే.. 2014లో జియో సేవలు ప్రారంభం కాలేదు. 2016 సెప్టెంబర్‌ నుంచే అవి ప్రారంభమయ్యాయి. ప్రస్తుతానికి ఆ లాజిక్ పక్కన పెట్టి మిగతా మేటర్ లోకి వెళ్దాం. సయ్యద్‌ షుజా సోమవారం లండన్‌లో భారత పాత్రికేయ సంఘం నిర్వహించిన విలేకరుల సమావేశంలో స్కైప్‌ ద్వారా మాట్లాడారు. అయితే ముఖం కనిపించకుండా మాస్క్‌ ధరించారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో వాడిన ఈవీఎంలను డిజైన్‌ చేసిన ఈసీఐఎల్‌ బృందంలో తాను కూడా సభ్యుడినని చెప్పారు. 2009 నుంచి 2014 వరకు తాను ఆ సంస్థలో పనిచేశానని పేర్కొన్నారు. ఈవీఎంలను హ్యాక్‌ చేయగలమా? ఎలా చేయగలం? అన్న విషయాన్ని పరిశీలించాలని ఈసీఐఎల్‌ మమ్మల్ని కోరిందన్నారు. వాటిని హ్యాక్‌ చేయవచ్చని తాము నిరూపించామని తెలిపారు. రిలయన్స్‌ జియో అందించిన ఓ మాడ్యులేటర్‌ ద్వారా మిలటరీ గ్రేడ్‌ లోఫ్రీక్వెన్సీ తరంగాలతో బీజేపీ ఈవీఎంలను హ్యాక్‌ చేసింది. తద్వారా 2014 లోక్‌సభ ఎన్నికల్లో రిగ్గింగ్‌కు పాల్పడింది. ఈ విషయం తెలుసుకున్నారు కాబట్టే బీజేపీ సీనియర్‌ నేత గోపీనాథ్‌ ముండేను లోక్‌సభ ఎన్నికలు జరిగిన కొద్దిరోజులకే చంపేశారు. ముండే మరణంపై దర్యాప్తు జరుపుతున్న ఎన్‌ఐఏ అధికారి తాంజిల్‌ అహ్మద్‌ ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేయాలనుకున్నారు. ఆలోగానే ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారు. 2015లో ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఈ సంకేత ప్రసారాలను మేం అడ్డుకున్నాం. ఫలితంగా మొత్తం 70 స్థానాల్లో 67 స్థానాలను ఆమ్‌ ఆద్మీ పార్టీ గెల్చుకుంది. లేకుంటే బీజేపీ స్వీప్‌ చేసి ఉండేది. రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌ అసెంబ్లీలకు ఇటీవల జరిగిన ఎన్నికల్లోనూ సంకేత ప్రసారాలను మాబృందం అడ్డుకుంది. లేకుంటే ఆ రాష్ట్రాల్లోనూ బీజేపీ విజయం సాధించి ఉండేది.  గత లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర్‌ ప్రదేశ్‌, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, ఢిల్లీకి సంబంధించి ఈవీఎంలలో రిగ్గింగ్‌ జరిగింది. 2014 ఏప్రిల్‌లో ఈవీఎంల నుంచి సంకేతాలు వెలువడుతున్నట్లు గుర్తించాం. మాకు తెలిసిన ఈ సమాచారంతో బీజేపీని బ్లాక్‌ మెయిల్‌ చేయాలనుకున్నాం. హైదరాబాద్‌ శివార్లలో బీజేపీ నేత ఒకరిని కలుసుకునేందుకు మా బృందం వెళ్లింది. అక్కడ మా బృందంపై కాల్పులు జరిగాయి. ఇందులో కొందరు చనిపోయారు. నేను తప్పించుకున్నా. ఈ ఘటనను వెలుగులోకి రాకుండా చూడటానికి హైదరాబాద్‌లోని కిషన్‌గఢ్‌లో మతకలహాలు జరిగినట్లు చిత్రీకరించారు. తన బృందంలోని కొందరు సభ్యులు హత్యకు గురికావడంతో 2014లో తాను భారత్‌ నుంచి పరారయ్యాయని చెప్పారు. అమెరికాలో రాజకీయ ఆశ్రయం కోరారన్నారు. ఈవీఎంల హ్యాకింగ్‌పై కథనం రాయడానికి పాత్రికేయురాలు గౌరీలంకేశ్‌ అంగీకరించారు.  ఆలోగానే ఆమె హత్యకు గురయ్యారు. ఈవీఎంలలో వాడిన వైర్లను ఎవరు తయారుచేశారన్నది తెలుసుకునేందుకు సమాచారం చట్టం కింద ఆమె దరఖాస్తు చేశారు. ఆ తర్వాతే ఆమె హత్య జరిగింది అన్నారు. నా ఆరోపణలకు ఆధారాలిస్తా. ఇటీవలి ఎన్నికల్లో వాడిన ఈవీఎంల ద్వారానే మీకు హ్యాకింగ్‌ తీరును వివరిస్తా. ఏయే ఎన్నికల్లో ట్యాంపరింగ్‌ జరిగిందో చెబుతా అని తెలిపారు. ఈ విలేకరుల సమావేశానికి ఎన్నికల సంఘాన్ని కూడా ఆహ్వానించాం. కానీ రాలేదు. రాజకీయ పార్టీలను ఆహ్వానించాం. అయితే కాంగ్రెస్‌ తరఫున కపిల్‌ సిబల్‌ ఒక్కరే వచ్చారు అన్నారు. హ్యాకర్‌ షుజా ఆరోపణలను కేంద్ర ఎన్నికల సంఘం ఖండించింది. బీఈఎల్, ఈసీఐఎల్‌ రూపొందించే ఈవీఎంలను ఎవ్వరూ హ్యాక్‌ చేయలేరని స్పష్టం చేసింది. కట్టుదిట్టమైన భద్రత మధ్య ఈవీఎంలను రూపొందిస్తామనీ, సాంకేతిక కమిటీ సమక్షంలో నిబంధనల మేరకు ఈ యంత్రాలను కఠినమైన పరీక్షలకు లోనుచేస్తామని వెల్లడించింది. ఈ విషయంలో చట్టపరమైన చర్యలు తీసుకునే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఈసీ పేర్కొంది. మరోవైపు ఈ ఆరోపణలపై విచారణ జరిపించాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేస్తుంది. అయితే బీజేపీ మాత్రం ఇదంతా కాంగ్రెస్ ఆడుతున్న గేమ్ అంటుంది. హ్యాకర్‌ షుజా ముఖానికి ఉన్న ముసుగు తీసి ఆధారాలు బయటపెడితేనే కానీ అసలు నిజాలు ఏంటో మనకి తెలియవు.

అసెంబ్లీ సాక్షిగా వైఎస్ ని ప్రశంసించిన కేసీఆర్!!

  గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం సందర్భంగా చేపట్టిన చర్చలో వివిధ పార్టీల సభ్యులు మాట్లాడుతూ పలు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. వీటికి సీఎం కేసీఆర్ సమాధానమిచ్చారు. పేదరికంతో పాటు నిర్లక్ష్యం వల్ల చాలామంది కంటి పరీక్షలు చేయించుకోవడం లేదని కేసీఆర్‌ చెప్పారు. ఎవరూ కోరకుండానే మంచి ఉద్దేశంతో కంటివెలుగు ప్రవేశపెట్టామన్నారు. కంటివెలుగు పథకం కింద ఇప్పటి వరకు 1.32 కోట్ల మందికి పరీక్షలు జరిగాయని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కంటివెలుగు పథకాన్ని ఇతర రాష్ట్రాలు అమలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. త్వరలో చెవి, ముక్కు, గొంతు పరీక్షల శిబిరాలు కూడా నిర్వహిస్తామని కేసీఆర్‌ స్పష్టం చేశారు. గత ప్రభుత్వాలు రైతులను నిర్లక్ష్యంగా వదిలేశాయని కేసీఆర్‌ అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం నిజంగా రుణమాఫీ చేయకపోతే ప్రజలు మళ్లీ తమకు ఎందుకు ఓటు వేశారని విపక్ష సభ్యులను ప్రశ్నించారు. రైతే రాజు అయ్యే పరిస్థితులు వచ్చాయని ఇప్పటికే కొందరు ప్రశంసిచారని, రైతుబీమా పరిహారం బాధిత కుటుంబాలకు కేవలం 10 రోజుల్లో అందుతోందని చెప్పారు. కార్యాలయాలు తిరగకుండా, పైరవీలు చేయకుండానే బాధిత కుటుంబం ఖాతాలో పరిహారం సొమ్ము జమ అవుతోందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వ్యవసాయ అధికారులను కూడా నియమించలేదని సీఎం మండిపడ్డారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ విధానాల వల్లే పోడు భూముల సమస్య పరిష్కారం కాకుండా పోయిందన్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి కోయలు వలస రావడం కూడా పోడు భూముల విషయంలో సమస్యగా మారిందని.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆ సమస్యను తప్పకుండా పరిష్కారిస్తామని చెప్పారు. ఇళ్ల నిర్మాణాల విషయంలో ప్రభుత్వం సాహసం చేయబోతోందని కేసీఆర్‌ చెప్పారు. గతంలో సర్వే ప్రకారం 8 లక్షల ఇళ్లు నిర్మిస్తే సరిపోతుందని తేలిందన్నారు. ఇల్లు అవసరమైనవాళ్లు ఎంతమంది ఉన్నారో కచ్చితమైన లెక్కలను త్వరలో తీస్తామని చెప్పారు. కాంగ్రెస్‌ హయాంలో ఇళ్ల పేరుతో కుంభకోణం జరిగిందని ఆరోపించారు. కొంచెం ఆలస్యమైనా తాము డబుల్‌ బెడ్‌రూమ్ ఇళ్లు నాణ్యంగా నిర్మిస్తామని స్పష్టం చేశారు. డబుల్‌ బెడ్ రూమ్‌ ఇళ్ల లబ్ధిదారులను లాటరీ ద్వారా ఎంపిక చేస్తామన్నారు. పేదవాళ్ల పేర్లను లాటరీలో వేసి లబ్ధిదారులను ఎంపిక చేస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనూ లాటరీ విధానానికి మినహాయింపు లేదని కేసీఆర్‌ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో 30వేల ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. సొంత స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణానికి రూ.6 లక్షలు ఇస్తామని ప్రకటించారు. మంచి పథకాలు ఎవరు తెచ్చినా మెచ్చుకోవాల్సిందేనని కేసీఆర్‌ అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన ఆరోగ్యశ్రీ చాలా మంచి పథకమని చెప్పారు. అందుకే ఎలాంటి మార్పులు లేకుండా టీఆర్ఎస్ కూడా ఆరోగ్యశ్రీని అమలు చేసిందన్నారు. ఆరోగ్యశ్రీ బాగున్నందునే కేంద్రం అమలు చేస్తున్నఆరోగ్య పథకంలో తెలంగాణ చేరలేదని తెలిపారు. ఆయుష్మాన్‌భవ కంటే ఆరోగ్యశ్రీ పథకంతోనే ప్రజలకు మేలు జరుగుతుందని కేసీఆర్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ కిట్‌ పథకంలో కేంద్రం వాటా పైసా కూడా లేదని స్పష్టం చేశారు. కేంద్రంలో అనుకూల ప్రభుత్వం లేదని, తెలంగాణకు ఒక్క రూపాయి కూడా అదనంగా ఇవ్వలేదని కేసీఆర్‌ విమర్శించారు. మిషన్‌ కాకతీయ, భగీరథకు రూ. 24 వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ చెప్పినా.. కేంద్రం 24 రూపాయిలు కూడా ఇవ్వలేదని విమర్శించారు. రాజ్యాంగబద్దంగా రావాల్సిన పన్నువాటా తప్ప నిధులు రాలేదని అన్నారు. వచ్చే ఐదేళ్లలో ఆదాయ, వ్యయాల అంచానా రూ.10 లక్షల కోట్లని కేసీఆర్‌ పేర్కొన్నారు. ఐదేళ్లలో ప్రభుత్వం చెల్లించాల్సిన అప్పు రూ.2 లక్షల 40 వేల కోట్లని, అప్పు చెల్లిస్తే మళ్లీ రూ.లక్షా 30వేల కోట్లు తెచ్చుకునే అవకాశం ఉందన్నారు. సాగునీటి ప్రాజెక్టులపై దాదాపు రూ.లక్షా 20 వేల కోట్ల ఖర్చు చేసినట్లు కేసీఆర్‌ తెలిపారు. సంక్షేమం, వ్యవసాయం, ప్రాజెక్టుల తర్వాత రహదారులకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చామని కేసీఆర్ అన్నారు. 12,751 గ్రామ పంచాయతీల్లో బీటీ రోడ్ల నిర్మాణం జరిగిందని చెప్పారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి పెంచిన పెన్షన్లు, రైతు బంధు, నిరుద్యోగ భృతి అమలు చేస్తామని అన్నారు. మార్చి నాటికి మిషన్‌ భగీరథ ద్వారా అన్ని గ్రామాలకు తాగునీరు అందజేస్తామని కేసీఆర్‌ హామీ ఇచ్చారు.

వందమంది కేసిఆర్, జగన్ లు కలిసినా ఏం చేయలేరు

  ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా గుంటూరు జిల్లాలో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. సత్తెనపల్లిలో ఎన్టీఆర్‌ పార్కు, వావిలాల ఘాట్‌ ప్రారంభించారు. సత్తెనపల్లిలో 36 అడుగుల ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఎన్టీఆర్‌ ఒక మహానాయకుడు, యుగపురుషుడు అని కొనియాడారు. సత్తెనపల్లికి వన్నె తెచ్చేలా తారకరామసాగర్‌ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్‌ హుస్సేన్‌సాగర్‌లో ఎన్టీఆర్‌ హయాంలో బుద్ధుడి విగ్రహం ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. ఇప్పుడు అదే తరహాలో సత్తెనపల్లిలో ఎన్టీఆర్‌ విగ్రహం ఏర్పాటైందన్నారు. ఎన్టీఆర్‌ భారీ విగ్రహం ఏర్పాటు ఒక చరిత్రని, చరిత్రలో మళ్లీ అలాంటి యుగపురుషుడు పుట్టడని చంద్రబాబు పేర్కొన్నారు. ఆయనతో ఎవరూ పోటీ పడలేరు.. ఆయనకు ఆయనే సాటి అని అన్నారు. తెలుగుజాతి ఆత్మగౌరవం కోసం పోరాడిన వ్యక్తి ఎన్టీఆర్‌ అని, సమాజమే దేవాలయం.. పేదలే దేవుళ్లని నిర్వచించిన వ్యక్తి ఎన్టీఆర్‌ అని చంద్రబాబు కొనియాడారు. రాష్ట్ర విభజన తర్వాత ప్రజలు ఎంతో నమ్మకంతో తనను గెలిపించారని, రాష్ట్రానికి బీజేపీ మేలు చేస్తుందని భావించామన్నారు. కానీ, బీజేపీ ఆంధ్రప్రదేశ్‌కు నమ్మకద్రోహం చేసిందని మండిపడ్డారు. ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తే తెలుగుజాతి తిరుగులేని శక్తిగా ఆవిర్భవిస్తుందని చెప్పారు. కేంద్రం సహకరించక పోయినా ప్రాజెక్టులకు ఇబ్బందులు లేకుండా ముందుకెళ్తున్నామని అన్నారు. ప్రపంచం మొత్తం ఆహారపు అలవాట్లు మారాయని, దానికి అనుగుణంగా వ్యవసాయంలో మార్పులు చేస్తున్నామన్నారు. ప్రపంచానికి ఆదర్శంగా 8శాతం సేద్యంలో వృద్ధిరేటు సాధించిన ఏకైక ప్రభుత్వం మనదేనని అన్నారు. రైతులకు రూ. 24 వేల కోట్ల రుణ విముక్తి చేసిన ప్రభుత్వం టీడీపీయేనని అన్నారు. కేంద్ర హోంమంత్రి ఈ రోజు కడపలో పర్యటిస్తున్నారని, హోదా విషయంలో మోసం చేసి మళ్లీ ఎందుకు వచ్చారని చంద్రబాబు ప్రశ్నించారు. తుపాన్ వస్తే, రైతులు ఇబ్బందులు పడుతుంటే ఇక్కడికి రారని, గుంటూరులో పార్టీ ఆఫీస్‌ ప్రారంభోత్సవానికి మాత్రం వస్తారని చంద్రబాబు కేంద్రంపై మండిపడ్డారు. పుండు మీద కారం చల్లి సంతోషిస్తున్నారని, విభజన చట్టంలో పేర్కొన్న హామీలు అమలయి ఉంటే తమకు ఇబ్బందులు ఉండేవి కావన్నారు. రాష్ట్రంలో కష్టాలకు, ఇబ్బందులకు ప్రధాని మోదీయే కారణమని అన్నారు. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ప్రకటించాలని చంద్రబాబు కేంద్రాన్ని కోరారు. వందమంది కేసిఆర్, జగన్ లు కలిసినా ఆంధ్రప్రదేశ్ ను ఏమీ చేయలేరని చంద్రబాబు అన్నారు. నాకేదో గిప్ట్ ఇస్తానని కేసిఆర్ బెదిరిస్తున్నాడని.. కేసిఆర్ ఒక్క గిప్ట్ ఇస్తే తెలుగు ప్రజలు మూడు గిప్ట్ లు ఇస్తారన్నారు. కేసిఆర్ కు అవినీతి తమ్ముడు జగన్ తోడయ్యాడని విమర్శించారు.

అవినీతి గొంగళిపురుగుతో స్నేహం తెలంగాణ కోసమేనా?

  ఎలక్షన్‌ మిషన్‌ 2019పై టీడీపీ నేతలతో ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు గురువారం ఉదయం టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రాభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. 'ఏపీ అంటే మోదీకి అసూయ. గుజరాత్‌కన్నా ఏపీ మించిపోతుందనే భయం. ఏపీ అభివృద్ధి చెందకూడదని కేసీఆర్‌ పంతం. తన చేతగాని తనం భయటపడుతుందని కేసీఆర్‌కు భయం. తన కేసుల్లో జైలుకు వెళ్లాల్సి వస్తుందని జగన్‌కు భయం. అసూయపరులంతా ఏకమయ్యారు. అక్కసుతోనే బీజేపీ, టీఆర్ఎస్, వైసీపీ ఒకే చోటుకు చేరి ఏపీపై కుట్రలు చేస్తున్నాయి' అని ఆరోపించారు. 'గద్దల మాదిరిగా ఏపీపై వాలి కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు. మతాల మధ్య ఉద్రిక్తతలు రెచ్చగొడుతున్నారు. తెలంగాణలో సెంటిమెంట్‌ రెచ్చగొట్టారు.. ఇప్పుడు ఏపీలో కులాల మధ్య చిచ్చు రగిలిస్తున్నారు. రాజకీయ లబ్ధి కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌కు స్పందనలేదు. హడావుడిగా నిన్న జగన్‌తో కేటీఆర్‌ భేటీ అయ్యారు. ఈ భేటీతో టీఆర్ఎస్, వైసీపీ ముసుగు తొలగిపోయింది' అని విమర్శించారు.బీజేపీ వ్యతిరేక ఓట్లను చీల్చాలని కుట్ర జరుగుతుందని అన్నారు. బీజేపీ వ్యతిరేక శక్తులు ఏకం కాకుండా కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ అజెండా అమలుకే ఫెడరల్‌ ఫ్రంట్‌ అని విమర్శించారు. పార్టీలను గందరోగళ పరిచి.. ప్రజల్లో  అయోమయం పెంచడం వీరి లక్ష్యం అని ఆరోపించారు.  ఏపీకి హోదా ఇస్తే తమకూ ఇవ్వాలని కేసీఆర్ అన్నారని గుర్తుచేశారు. షెడ్యూల్ 9, షెడ్యూల్ 10 సంస్థల విభజనకు అడ్డంకులు పెట్టారన్నారు. చివరికి సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయనివ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘తెలంగాణలో 26 కులాలను బీసీ జాబితా నుంచి తొలగించారు. 26 కులాలకు అన్యాయం చేసిన వారితో జగన్‌ అంటకాగుతున్నారు. టీఆర్ఎస్ తో జట్టుకట్టిన వైసీపీకి 26 కులాల బీసీలే బుద్ధి చెప్పాలి' అని పిలుపునిచ్చారు. అవినీతి గొంగళి పురుగును కేసీఆర్‌ కౌగిలించుకున్నారు. అవినీతి గొంగళిపురుగుతో స్నేహం తెలంగాణ కోసమేనా? ప్రజలకు కేసీఆర్‌, కేటీఆర్‌ జవాబు చెప్పాలి’ అని చంద్రబాబు డిమాండ్ చేసారు.