కజ్జికాయలు (సంక్రాతి స్పెషల్)

 

 

 కావలసినవి:

మైదా                                      -500 గ్రాములు
నెయ్యి                                     -100 గ్రాములు
ఉప్పు                                      - తగినంత
చక్కెర                                     -350 గ్రాములు
కొబ్బరి తురుము                     - రెండు కప్పులు
గసగసాలు                               -100గ్రాములు
పుట్నాల పప్పు                       -150 గ్రాములు
యాలకులు                             -5 గ్రాములు
నూనె                                     -తగినంత


తయారీ విధానం :-


మైదాపిండిని జల్లించి అందులో ఉప్పు, నెయ్యి వేసి నీళ్ళతో పూరీల పిండిలా కలుపుకోవాలి. ఒక బాణలిలో తురిమిన కొబ్బరి వేసి సన్నని మంట మీద వేయించుకోవాలి. అందులో పుట్నాల పప్పు పొడి, గసగసాలు,  వేసి వేయించాలి.  స్టౌ మీద నుండి దింపి, చక్కెర పొడి ,యాలకుల పొడి కలిపి పక్కన పెట్టుకోవాలి.

ముందుగా కలిపి పెట్టుకున్న మైదాను చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని వాటిని పూరీల్లా వత్తాలి. దాని మధ్యలో కొబ్బరి తురుము, పుట్నాల పప్పు మిశ్రమాన్ని రెండు స్పూన్లు వేసి మధ్యకు మడవాలి. అర్ధ చంద్రాకారంలో వచ్చిన తర్వాత వాటి చివరలను తడి చేసి మడత మీద మడత వేసి వేళ్ళతో గట్టిగా అదమాలి. ఈ విధంగా చేస్తే లోపలి మిశ్రమం బయటికి రాదు.

ఇలా తయారుచేసిన కజ్జికాయలను కాగిన నూనెలో ఎర్రగా వేయించుకోవాలి. చాలా రుచికరంగా ఉండే కజ్జికాయలు తయారు!!

- Vissa Nagamani