Read more!

వైఎస్సార్‌ అభిమానులు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు

ఏపీ సీఎం వైఎస్ జగన్ తండ్రి, మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డిపై తెలంగాణలోని దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్‌ ని విమర్శించే క్రమంలో "వెనుకటి ఒకాయన గిట్లే మాట్లాడి, గట్లే పోయిండు.. పావురాల గుట్టకు! నువ్వు కూడా గంతే. యాక్షన్ కు రియాక్షన్ కచ్చితంగా ఉంటుంది" అంటూ రఘునందన్ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. దీనిపై వైసీపీ కార్యకర్తలు, వైఎస్సార్ అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు. వైఎస్సార్ అభిమానులు బీజేపీకి ఓటు వేయొద్దని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రఘునందన్ స్పందించారు. వైఎస్సార్‌ అంటే తనకు ఎంతో గౌరవం ఉందని, తన వ్యాఖ్యల్లో ఎలాంటి దురుద్దేశం లేదని వివరించారు. 

 

వైఎస్సార్‌ గురించి తాను చేసిన వ్యాఖ్యలను ఆయన అభిమానులు తప్పుగా అర్థం చేసుకుంటున్నారని, వైఎస్సార్‌ అభిమానుల మనసు నొప్పించి ఉంటే క్షమాపణలు కోరుతున్నట్లు తెలిపారు. "సీఎం కేసీఆర్ కేసీఆర్ గతంలో వైఎస్సార్ పై చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూ నేను ఆ కుటుంబానికి హెచ్చరిక చేసినట్టుగా మాట్లాడాను. అంతేతప్ప నేను వైఎస్సార్ ను కించపరుస్తూ మాట్లాడలేదు." అన్నారు "ఈ సందర్భంగా వైఎస్సార్‌ అభిమానులందరికీ ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి తప్పుగా ట్రోల్ చేయకండి. నా వ్యాఖ్యల పట్ల మీరు బాధపడుతున్నందుకు చాలా చింతిస్తున్నాను" అని రఘునందన్ రావు ఓ ప్రకటన చేశారు.