ప్రధాని మోడీ ఇలాకాలో కాంగ్రెస్ స్వీప్
posted on Apr 12, 2021 @ 4:51PM
ప్రధాని నరేంద్ర మోడీకి ఊహించని షాక్ తగిలింది. మోడీ ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసిలో బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం ఏబీవీపీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. వారణాసిలోని సంపూర్ణానంద్ సంస్కృత విశ్వవిద్యాలయంలో నిర్వహించిన స్టూడెంట్ యూనియన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనుబంధ విద్యార్థి సంఘం ఎన్ఎస్యూఐ అన్ని పోస్టులను కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో ఏబీవీపీకి ఒక్క పోస్ట్ కూడా లభించలేదు. వారణాసిలో ఎన్ఎస్యూఐ విజయం.. బీజేపీకి, ప్రధాని మోదీకి షాక్ ఇచ్చినట్లేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
విద్యార్థి సంఘం ఎన్నికల్లో ఎన్ఎస్యూఐకి చెందిన కృష్ణమోహన్ శుక్లా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అజిత కుమార్ చౌబే ఉపాధ్యక్షుడిగా ఎన్నికవగా.. శివమ్ చౌవే జనరల్ సెక్రటరీగా, అశుతోశ్ కుమార్ మిశ్రా లైబ్రరీ మినిస్టర్గా ఎన్నికయ్యారు. కాగా ఈ విజయంపై కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. బీజేపీకి గట్టి షాక్ తగిలిందని, యువత బీజేపీకి తగిన గుణపాఠం నేర్పిందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. పాలనలో మార్పు కోరుకుంటున్నారని ఈ విజయంతో స్పష్టమవుతోందని యూపీ కాంగ్రెస్ చీఫ్ అజయ్ కుమార్ లల్లూ అన్నారు. ఉత్తరప్రదేశ్ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న మార్పునకు ఇది నాంది పలికినట్లయిందని చెప్పారు.
గతేడాది డిసెంబర్లో ఉత్తరప్రదేశ్లో జరిగిన ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి భారీ షాక్ తగిలింది. మొత్తం 11 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా.. వాటిలో బీజేపీ కేవలం నాలుగు స్థానాల్లోనే గెలిచింది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసి పరిధిలో ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలను సమాజ్వాదీ పార్టీ గెలుచుకుంది. ఈ మధ్య కాలంలో బీజేపీ పట్ల ప్రజల్లో విపరీతమైన వ్యతిరేక భావన వ్యక్తమవుతోంది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల పట్ల ప్రజలు వ్యతిరేకత కనబరుస్తున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం, నిత్యావసరాల ధరలు పెరగడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.